నేడు కేయూ స్వర్ణోత్సవ
ఆవిర్భావ వేడుకలు
కేయూ క్యాంపస్ : వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీ బుధవారం నాటికి 50 వసంతాలు పూర్తి చేసుకుని (గోల్డెన్ జూబ్లీ) 51 వసంతంలోకి అడుగిడుతోంది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీని పలు సమస్యలు వేధిస్తున్నాయి. ప్రధానంగా రెగ్యులర్ అధ్యాపకుల కొరతతో విద్యాబోధనపై, పరిశోధనలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. రెగ్యులర్ అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్లు కలిపి ప్రస్తుతం 77మంది ఉన్నారు. వీరిలో కొందరు రెండు, మూడు అంతకంటే ఎక్కువగా పాలన పదవుల్లోనే కొనసాగుతున్నారు. దీంతో బోధనపై వీరు అంతగా ఆసక్తి చూపడం లేదని ఆరోపణలున్నాయి. పొలిటికల్ సైన్స్, విద్యా కళాశాల, ఫిజికల్ ఎడ్యుకేషన్, జర్నలిజం, సైకాలజీ, తెలుగు, బయోకెమిస్ట్రీ విభాగాల్లో ఒక్కరు కూడా రెగ్యులర్ అధ్యాపకులు లేరు. బాటనీ, హిస్టరీ, జియాలజీ, ఎకనామిక్స్ విభాగాల్లో ఒకరు చొప్పున రెగ్యులర్ అధ్యాపకులు ఉండగా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఇద్దరు ఉండగా, అందులో ఒకరు తెలంగాణ వర్సిటీ వీసీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 172 మంది కాంట్రాక్టు లెక్చరర్లు ఉండగా 165 మంది వరకు పార్ట్టైం లెక్చరర్లు ఉన్నారు. మరో 99 మంది వరకు నూతనంగా పార్ట్టైం లెక్చరర్లకు త్వరలోనే నియామక పత్రాలు ఇవ్వనున్నారు.
332 అధ్యాపక పోస్టులు ఖాళీ..
కేయూలో రెగ్యులర్ అధ్యాపకుల పోస్టులు 409 మంజూరు ఉండగా ప్రస్తుతం 77మంది పనిచేస్తున్నారు. 332 పోస్టులు వెకెన్సీలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో 136 అధ్యాపకుల పోస్టులకు మంజూరు ఇచ్చి నియమించలేదు. క్యాంపస్లోని రెండు ఇంజనీరింగ్ కళాశాలల్లోనూ రెగ్యులర్ అధ్యాపకులను నియమించాల్సింది. నాన్టీచింగ్ పోస్టుల మంజూరు 626 ఉండగా ప్రస్తుతం రెగ్యులర్ 311మంది పనిచేస్తున్నారు. 315 వెకెన్సీలున్నాయి. నాన్టీచింగ్ కాంట్రాక్టులో 167 మంజూరు ఉండగా 155 మంది పనిచేస్తున్నారు. 12వెకెన్సీలు ఉన్నాయి. ఔట్సోర్సింగ్ పోస్టుల మంజూరు 330 ఉండగా 327 వెకెన్సీలు 3 ఉన్నాయి. సర్వీస్ పెన్షనర్లు టీచింగ్ నాన్టీచింగ్ కలిపి 498 మంది ఉన్నారు. ఫ్యామిలీ పెన్షనర్లు 294 మంది ఉన్నారు.
పీజీసెంటర్ల బలోపేతంపై దృష్టి ఏది?
కేయూ పరిధిలో జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, నిర్మల్ జిల్లాలో పీజీ సెంటర్లున్నాయి. కానీ వీటి అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టడంలేదు. అక్కడ పీజీ సెంటర్లలో రెగ్యులర్ అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లు లేరు. తూతూ మంత్రంగా నడిపిస్తుండడంతో అడ్మిషన్ల సంఖ్య తగ్గిపోతోంది.
సరిపడా హాస్టళ్లులేవు..
విద్యార్థులకు సరిపడా హాస్టళ్లు లేవు. ముఖ్యంగా పీ జీ తదితర కోర్సుల్లో విద్యార్థినులు( మహిళలు) ఎ క్కువ మంది అడ్మిషన్లు పొందుతున్నారు. వీరికి స రిపడా హాస్టళ్ల సదుపాయం కల్పించలేకపోడంతో ఇ బ్బందులు పడుతున్నారు. ఇక మెస్లలో నాణ్య మైన భోజనం అందించాలని తదితర సమ్యలతో తరచూ ఆందోళనలు చేస్తున్న విషయం విధితమే.
కాకతీయ యూనివర్సిటీ స్వర్ణోత్సవ వేడుకలు, యూనివర్సిటీ ఆవిర్భావాన్ని బుధవారం ఉదయం 11గంటలకు క్యాంపస్లోని సెనెట్హాల్లో నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ వి. రామచంద్రం మంగళవారం తెలిపారు. యూనివర్సిటీ ఐదు దశాబ్దాల ప్రస్థానంలో విద్య, పరిశోధన సంస్థాగత అభివృద్ధి, ఉన్నత విద్యారంగంలో అందించిన విశిష్ట సేవలను ఈ సందర్భంగా స్మరించుకోనున్నారని తెలిపారు.
కేయూలో 332 పోస్టులు ఖాళీ
బోధన, పరిశోధనలపై ప్రతికూల ప్రభావం
విద్యార్థులకు సరిపడా హాస్టళ్లు ఏవీ?


