
ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
● రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్కుమార్
● హనుమకొండ, వరంగల్ కలెక్టర్లతో మంత్రి సమీక్ష
హన్మకొండ: ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ, సాధికారత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శనివారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్, వరంగల్ కలెక్టర్ సత్యశారదతో సమీక్ష నిర్వహించారు. జిల్లాల్లో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు, పథకాల అమలు తీరు, సంక్షేమ, గురుకుల పాఠశాలల, కళాశాలల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈసమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులకు అందుతున్న భోజన, వసతి, జరుగుతున్న లోపాల్ని గుర్తించి సరిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గురుకుల, ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫిర్యాదులు పెట్టె క్రమం తప్పకుండా పరిశీలించాలని, ఫిర్యాదుల బాక్సులో వస్తున్న ఫిర్యాదులు, వాటికి గల కారణాలను వెంటనే తెలుసుకుని పరిష్కార మార్గాలను చూడాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికారులు సమన్వయంతో పనిచేసి మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్.నాగరాజు, హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, ఆయా గురుకులాల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
వరంగల్ అర్బన్: పర్యావరణ హితం కోసం మట్టి ప్రతిమలను పూజిద్దామని వరంగల్ మేయర్ గుండు సుధారాణి అన్నారు. శనివారం బల్దియా ప్రధాన కార్యాలయంలో గణేశ్ ఉత్సవాల సందర్భంగా మేయర్, కమిషనర్ చాహత్ బాజ్పాయ్ మట్టి వినాయక ప్రతిమలను మెప్మా ఆర్పీలు, ఎస్హెచ్జీలు, బల్దియా సిబ్బందికి పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ.. బల్దియా ఆధ్వర్యంలో ఈ సంవత్సరం సుమారు 50 వేల ప్రతిమలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కమిషనర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ.. మట్టి విగ్రహాలను పూజించేలా ఎస్హెచ్జీలు, మహిళల్లో చైతన్యం కల్పిస్తూ ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ జోనా, సీహెచ్ఓ రమేశ్, సీఎంహెచ్ఓ రాజారెడ్డి, ఎంహెచ్ఓ రాజేశ్, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.
గడువులోగా పనులు పూర్తి చేయాలి..
నిర్దేశిత గడువులోగా స్మార్ట్ సిటీ మిషన్ పనులు పూర్తి చేయాలని మేయర్ గుండు సుధారాణి ఇంజనీరింగ్, స్మార్ట్ సిటీ ప్రతినిధులను ఆదేశించారు. శనివారం బల్దియా ప్రధాన కార్యాలయంలో స్మార్ట్ సిటీ మిషన్కు చెందిన అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఇందులో ఈఈలు రవికుమార్, సంతోశ్ బాబు, మాధవీలత, స్మార్ట్ సిటీ ప్రతినిధి ఆనంద్ ఓలేటి, బాబులాల్ సింగ్, డీఈ, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట