వరంగల్ క్రైం : వరంగల్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన సన్ప్రీత్సింగ్ను ఏసీబీ అధికారులు మంగళవారం ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య, ఇన్స్పెక్టర్లు ఎస్.రాజు, ఎల్.రాజు ఉన్నారు. అనంతరం సీపీకి పూలమొక్కను అందజేశారు. అదేవిధంగా బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే సీపీని కలిసి పూల మొక్క అందజేశారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు.
కలెక్టర్ ప్రావీణ్య రక్తదానం
హన్మకొండ అర్బన్ : హనుమకొండ కలెక్టరేట్ ఐడీఓసీలోని జిల్లా ఖజానా కార్యాలయ ప్రాంగణంలో రెడ్క్రాస్ సౌజన్యంతో తలసేమియా బాధితుల కోసం మంగళవారం ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో కలెక్టర్ ప్రావీణ్య స్వయంగా రక్తదానం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, జిల్లా ఖజానా అధికారి ఎ.శ్రీనివాస్కుమార్, డీఆర్డీఓ మేన శ్రీను, బీసీ సంక్షేమ శాఖ అధికారి రామ్రెడ్డి, ఉద్యోగ సంఘాల బాధ్యులు, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.
నేటినుంచి ఎంఎల్హెచ్పీ
పోస్టులకు దరఖాస్తులు
ఎంజీఎం : జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న మిడ్ లెవెల్ హెల్త్ కేర్ ప్రొవైడర్ (ఎంఎల్హెచ్పీ) పోస్టుల భర్తీకి నేటి (బుధవారం)నుంచి 26వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 13 పోస్టులు (జనరల్–5, బీసీ–ఏ–1, బీసీ–బీ–1, ఎస్సీ–1, ఈడబ్ల్యూఎస్–4, దివ్యాంగులు–1 కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు 18 నుంచి 46 సంవత్సరాల వయస్సులోపు ఉండి బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎంలో కమ్యూనిటీ హెల్త్ బ్రిడ్జి కోర్సు చదివిన వారికి ప్రాధాన్యత ఉంటుందని వివరించారు. దరఖాస్తులు hanamkonda. telangana.gov.in వెబ్సైట్నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని, దరఖాస్తు పత్రంతో పాటు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి, హనుమకొండ పేరున ఎస్సీ, ఎస్టీలు రూ.250, ఇతరులు రూ.500, దివ్యాంగులకు ఫీజు మినహాయింపు ఉందని తెలిపారు. విద్యార్హతలు, కుల, నివాస సర్టిఫికెట్లు జత చేసి హనుమకొండ కలెక్టరేట్ (ఐడీఓసీ)లోని రెండో అంతస్తు ఎస్–16లోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.
డీఆర్డీఏ పరిధిలోకి మెప్మా!
హన్మకొండ అర్బన్ : మహిళా సంఘాలను ఒకే గూటికి తీసుకు వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. పట్టణ ప్రాంతాల్లో పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకు రుణాలు ఇప్పించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందజేస్తున్న మెప్మాను ఇకపై డీఆర్డీఏలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లో విలీనం కానున్నట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడగానే మెప్మా పరిధిలోని మహిళా సంఘాలు, పరకాల మున్సిపాలిటీ పరిధిలోని మహిళా సంఘాలు, ఉద్యోగులు, ఆర్పీలంతా సెర్ప్ పరిధిలోకి వెళ్లనున్నారు. ఇప్పటి వరకు కమిషనర్ల ఆధ్వర్యంలో విధులు నిర్వహించిన మెప్మా ఉద్యోగులు, ఆర్పీలు ఇక నుంచి సెర్ప్ ఆధ్వర్యంలో విధులు నిర్వహించనున్నారు.
సీపీని కలిసిన ఏసీబీ అధికారులు
సీపీని కలిసిన ఏసీబీ అధికారులు