హన్మకొండ అర్బన్: తెలంగాణ సామాజిక ఆర్థి క ముఖచిత్రం – 2023 పుస్తకాన్ని బుధవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు, నిరుద్యోగ యువతకు, సామాజికవేత్తలకు ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. పుస్తకం అవసరమున్న వారు కలెక్టరేట్లోని సీపీఓ కార్యాలయంలో రూ.150 చెల్లించి పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ అంకిత్, జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి సత్యనారాయణ, జిల్లా పౌరసంబంధాల శాఖ ఏడీ లక్ష్మణ్కుమార్ పాల్గొన్నారు.
పద్మ అవార్డులకు
దరఖాస్తుల ఆహ్వానం
కాశిబుగ్గ: భారత ప్రభుత్వం పద్మ అవార్డులు అందించేందుకు అర్హులైన వారినుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వరంగల్ జిల్లా యువజన క్రీడల అధికారి ఎస్.ఇందిర బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కళలు, ఆటలు, సంఘసేవ, విద్య, వైద్య, విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక, పరిశ్రమలు తదితర రంగాల్లో విశిష్టమైన సేవలు చేసిన వారికి ఈ అవార్డులను ప్రదానం చేస్తారని పేర్కొన్నారు. www.padmaawards.gov.inల వెబ్సైట్లో దరఖాస్తు చేసుకొని, అన్లైన్ చేసిన దరఖాస్తులతోపాటు చేసిన సేవలకు సంబంధించిన వివరాలు, పేపర్ క్లిప్పింగ్లు, ఫొటోలతో సహా 3 సెట్లను ఈనెల 28లోపు జిల్లా క్రీడల కార్యాలయంలో అందజేయాలని సూచించారు.
దశాబ్ది ఉత్సవాలకు
పకడ్బందీ ఏర్పాట్లు
హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్
హన్మకొండ అర్బన్: జిల్లాలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్.. అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జూన్ 2 నుంచి 21 రోజులపాటు నిర్వహించే ఉత్సవాలపై శాఖల వారీగా కార్యక్రమాల విధివిధానాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీసీపీ ఎంఏ బారి,డీఆర్ఓ వాసుచంద్ర,ఆర్డీఓ రాము, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్, డీపీఓ జగదీశ్వర్, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.
నేడు ఎన్టీఆర్ కళారత్న
పురస్కార ప్రదానోత్సవం
హన్మకొండ కల్చరల్: పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా గురువారం కవి సమ్మేళనం, ప్రముఖులకు ఎన్టీఆర్ కళారత్న పురస్కార ప్రదానోత్సవం చేస్తామని అసోసియేషన్ అధ్యక్షుడు కె.మురళీమోహన్ రాజు బుధవారం తెలిపారు. సుబేదారి లోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో జరిగే కార్యక్రమంలో అభిమానులు పాల్గొనాలని కోరారు.
భూకబ్జా యత్నం కేసులో
ఇద్దరి అరెస్ట్
వరంగల్: వరంగల్ ఏనుమాముల పోలీస్స్టేషన్ పరిధిలోని రెడ్డిపాలెంలో భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించిన ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సీఐ మహేందర్ తెలిపారు. రెడ్డిపాలెం గ్రామ పరిధిలో మనికంటి రాంరెడ్డి మొగిలిచెర్ల రోడ్డు పక్కన కొనుగోలు చేసిన స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టగా గిర్మాజిపేటకు చెందిన కొడిపాక మునిందర్, ఐలోని దేవేందర్ తప్పుడు పత్రాలు సృష్టించి ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు చేయడంతోపాటు సెటిల్మెంట్ చేసుకోవాలని బెదిరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్సై పోగుల శ్రీకాంత్ విచారణ జరిపి ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపినట్లు సీఐ తెలిపారు.