న్యూస్రీల్
చౌకధరల దుకాణాల ద్వారా నిరుపేదలకు అందని రేషన్ జిల్లాలో ఇష్టానుసారంగా ఇసుక, మైనింగ్, గ్రావెల్ తవ్వకాలు ఉచిత ఇసుక పేరుతో అధికార పార్టీ నేతల అడ్డగోలు దోపిడీ నకిలీ ఎరువులు, విత్తనాలతో ఇబ్బందులు పడుతున్న రైతులు జిల్లాలోని దాచేపల్లి, సాగర్ చెక్పోస్టుల మీదుగా గ్రానైట్ అక్రమ రవాణా ఇన్ని అక్రమాలు కొనసాగుతున్నా జిల్లాలో విజిలెన్స్ దాడులు శూన్యం మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారుల తీరే కారణం
ఆదివారం శ్రీ 30 శ్రీ ఆగస్టు శ్రీ 2026
7
తెనాలి: స్థానిక మార్కెట్యార్డులో శనివారం క్వింటా నిమ్మకాయలు కనిష్ఠ ధర రూ.7 వేలు, గరిష్ఠ ధర రూ.11,800, మోడల్ ధర రూ.10 వేల వరకు పలికింది.
బాపట్ల: బాపట్లలోని ఈవీఎం గోదాములను బాపట్ల కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ శనివారం పరిశీలించారు. ఆయన వెంట బాపట్ల ఆర్డీఓ, తహసీల్దార్ ఉన్నారు.
కేంద్ర మంత్రి పెమ్మసాని
గుంటూరు రూరల్: నగర పరిధిలోని శిల్పారామం – పెదపలకలూరు వరకు చేపడుతున్న మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్–3 రహదారి అభివృద్ధి పనులను కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, జీఎంసీ కమిషనర్ కె.మయూర్ అశోక్లతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రూ.48 కోట్లతో సుమారు 4.25 కిలోమీటర్ల పొడవైన ఈ రోడ్డు పనులను వేగంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అదనంగా సుమారు రూ. 2–3 కోట్ల వ్యయం అయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఎన్ఎస్పీ కెనాల్స్ క్రాసింగ్స్ వద్ద భవిష్యత్తులో నీటి ప్రవాహానికి ఇబ్బంది లేకుండా అదనపు కల్వర్టులు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక్కో కల్వర్టుకు సుమారు రూ.10 లక్షలు– రూ.15 లక్షల వరకు అదనపు వ్యయం అవుతుందని తెలిపారు. త్వరలో నిర్మించనున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి మీదుగా పేరేచర్ల జంక్షన్ వరకు ఈ రోడ్డును విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇది పూర్తయితే పల్నాడు ప్రాంతం నుంచి వచ్చే వారికి ఇన్నర్ రింగ్ రోడ్ ద్వారా నేరుగా అమరావతికి మెరుగైన అనుసంధానం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఈ అదనపు విస్తరణకు సుమారు రూ.15 కోట్లు– రూ.20 కోట్ల అదనపు వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. ఇందుకు ముఖ్యమంత్రికి ఇప్పటికే లేఖ రాసినట్లు చెప్పారు. ఆమోదం లభించలేదన్నారు. డ్రైనేజ్ కవర్లు, సెంటర్ లైటింగ్ వంటి అదనపు సదుపాయాలకు కూడా మరన్ని నిధులు అవసరం అవుతాయని పేర్కొన్నారు.
సాక్షి ప్రతినిధి, గుంటూరు: పట్టపగలే అక్రమ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నా అటువైపు వెళ్లాలంటేనే జంకుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలకు చౌక బియ్యం అందకుండా లారీలకు లారీలు బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు. జిల్లాలో చౌక బియ్యం, ఇసుక, మైనింగ్ మాఫియాకు అధికార పార్టీ ముఖ్య నేతలు నేరుగా సహకరిస్తుండటం, కొన్ని చోట్ల వారే చేస్తుండటంతో చీకటి వ్యాపారం నిర్భయంగా కొనసాగిస్తున్నారు. అదేమని ప్రశ్నిస్తే వారిపై దాడులకు దిగుతూ, తిరిగి ఎదురు కేసులు పెట్టి ఇరికిస్తున్నారు. అక్రమ బియ్యం వ్యాపారంతో అధికార పార్టీ చోటా నాయకులు రూ.లక్షలు సంపాదిస్తుంటే, వారికి వెన్నుదన్నుగా నిలిచిన ముఖ్య నేతలు మాత్రం రూ.కోట్లు పొందుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో రేషన్, ఇసుక, గ్రావెల్, మైనింగ్ మాఫియా జోరు సాగుతోంది. విజిలెన్స్ శాఖలో కొంతకాలంగా స్తబ్ధత నెలకొంది. అధికార పార్టీ నేతల ఆదేశాల మేరకు విచారణ నిర్వహించడం మినహా అడ్డుకోలేకపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో నియంత్రించాలంటే, వారికి అండగా నిలుస్తున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులను నియంత్రిస్తేనే సాధ్యపడుతుందని విజిలెన్స్ శాఖలో చర్చించుకుంటున్నారు.
అధికార పార్టీ నేతల దోపిడీ
ప్రతి ఒక్కరికీ ఉచితంగా అందిస్తున్నామంటూ డబ్బాలు కొట్టుకుంటున్న ప్రభుత్వ పెద్దలు... ఆ ముసుగులో దోపిడీకి పాల్పడుతున్న తమ పార్టీ ఎమ్మెల్యేలు, బినామీలను అడ్డుకోలేకపోతున్నారు. ముఖ్యంగా పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలోని మల్లాది, అంబడిపూడితోపాటు, రాజధాని ప్రాంతంలో సైతం డ్రెడ్జర్ల ద్వారా కృష్ణా నది గర్భాన్ని తవ్వేస్తూ, నిబంధనలకు తిలోదకాలు ఇస్తున్న విజిలెన్స్ అధికారులకు ఇదేమీ కనిపించడం లేదు. చిన్నబాబు బినామీలు, ఎమ్మెల్యేల బావమరుదులు ఇలా అధికార పార్టీ ముఖ్య నేతలే అక్రమ ఇసుక రవాణాకు తెగబడుతూ రూ.కోట్లు గడిస్తున్నారు. వీటిని అడ్డుకోవాల్సిన విజిలెన్స్ అధికారులు సైతం వారికి సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజలకు ఉచితంగా అందాల్సిన ఇసుకను రూ.వేలు ఖర్చుపెట్టి కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇక్కడి ఇసుకను హైదరాబాద్కు భారీ స్థాయిలో తరలిస్తూ అక్రమార్కులు తమ జేబులు నింపుకొంటున్నారు. ఇంత జరుగుతున్నా, సరిహద్దు చెక్పోస్టులు దాటుతున్నా విజిలెన్స్ అధికారులకు కనిపించకపోవడం దారుణమైన విషయం.
మామూలిస్తే సరి..
అక్రమార్కులకు జిల్లాలో కొందరు విజిలెన్స్ అధికారులు అండగా నిలుస్తూ, నెలవారీ మామూళ్లకు అలవాటు పడ్డారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజిలెన్స్ అంటేనే ప్రభుత్వ ఆదాయాలకు గండి పడకుండా, ప్రజలకు, ప్రభుత్వ పథకాలకు, ఇసుక, మట్టి వంటి సహజ వనరులకు దుర్వినియోగం కాకుండా కాపాడాలి. కానీ ఇప్పుడు గాడి తప్పింది. చేయాల్సిన పని వదిలేసి, కొందరు విజిలెన్స్ అధికారులు బిర్యానీ సెంటర్లు, స్వీట్షాపులు వంటి వాటిపై దాడులు చేస్తామంటూ బెదిరింపులకు దిగుతూ, భారీ ఎత్తున అవినీతికి పాల్పడున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, అక్రమ రవాణాపై సీరియస్గా దృష్టి సారించి, అక్రమార్కులను అడ్డుకుని విజిలెన్స్పై ప్రజలకు నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉంది.
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్రమ సంపాదనకు ద్వారాలు తెరుచుకున్నాయి. పార్టీ నేతల ఇసుక, గ్రావెల్, గ్రానైట్, చౌక బియ్యం అక్రమ రవాణాపై విజి ‘లెన్స్’ దృష్టి సారించడం లేదు. అధికార పార్టీ ముఖ్య నేతలు, వారి బినామీల అండదండలు అందిస్తున్నారని తెలిసినా ఆ వైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అసలే వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు నకిలీ ఎరువులు, విత్తనాలు మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారాయి. దీనిపై పూర్తి స్థాయి నిఘా ఉంచి నకిలీలను అరికట్టాల్సిన విజిలెన్స్ అధికారులు వాటిపై కనీస దృష్టి సారించకపోవడంతో రైతులు నకిలీ ఎరువులు, విత్తనాలు వాడి నష్టాలపాలై అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అనేక నియోజకవర్గాల నుంచి చౌక బియ్యం, ఇసుక, గ్రానైట్లను అక్రమంగా రవాణా చేస్తున్నారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న మాఫియాలను జిల్లాలోని దాచేపల్లి, నాగార్జునసాగర్ వద్ద ఉన్న రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టుల వద్ద సైతం విజిలెన్స్ అధికారులు అడ్డుకోలేకపోతున్నారు. ఇదంతా వీరికి తెలిసే జరుగుతోందనే అనుమానాలు బలపడుతున్నాయి. గ్రామాల్లో ఆటోలు, ట్రాక్టర్ల ద్వారా చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే వారిపై దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్న విజిలెన్స్ అధికారులు, భారీ స్థాయిలో అక్రమ రవాణాకు పాల్పడుతున్న మాఫియా ముఠాలను అడ్డుకోలేకపోతున్నారు. వీరికి అధికార పార్టీ నేతల అండదండలు ఉండటం వల్లే వారి జోలికి వెళ్లాలంటే భయపడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


