నగరంపాలెం: జిల్లాలోని ఆరు కేంద్రాల్లో ఈ నెల 30వ తేదీన నీట్ పీజీ దృష్ట్యా పటిష్ట పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనున్న పరీక్షకు హాజరయ్యే 784 మంది అభ్యర్థులు నిర్ణీత వేళకు చేరుకోవాలని సూచించారు. ఉదయం 8.30 గంటల తర్వాత కేంద్రాల్లోకి అనుమతించరని చెప్పారు. ఆయా కేంద్రాల వద్ద ప్రత్యేక బందోబస్త్తోపాటు నిరంతర నిఘా ఉంటుందని పేర్కొన్నారు. కేంద్రాల సమీపాన జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని సూచించారు. పరీక్షకు సంబంధించి తప్పుడు వార్తలు, వదంతులు సోషల్ మీడియాలో ప్రచారం చేసినా, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడినా, పరీక్షల నిర్వహణకు ఆటంకం కలిగించినా సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.
ప్రశాంతంగా నిర్వహించాలి
గుంటూరు వెస్ట్: నీట్ పీజీ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి షేక్ ఖాజావలి అన్నారు. పరీక్షకు సంబంధించి అన్ని శాఖల అధికారులతో శనివారం స్థానిక కలెక్టరేట్ నుంచి వీసీ ద్వారా సమీక్షించారు. అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత తహసీల్దార్లకు సూచించారు.


