గుంటూరు మెడికల్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ బోధనా ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులకు రావాల్సిన వేతన బకాయిలను(పీఆర్సీ) తక్షణమే విడుదల చేసి వారి ఖాతాల్లో జమ చేయాలని గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జీడీఏఏపీ) స్టేట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ స్వరూప్కాంత్ డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం గుంటూరు వైద్య కళాశాలలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. డాక్టర్ స్వరూప్కాంత్ మాట్లాడుతూ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలో పనిచేస్తున్న వైద్యులకు 2016 నుంచి పీఆర్సీ బకాయిలు రావాల్సి ఉందన్నారు. ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులకు, సెకండరీ హెల్త్ వైద్యులకు టైమ్బాండ్ ప్రమోషన్లు ఇవ్వాలని, వైద్య అధికారులకు సీనియార్టీ ప్రకారం ప్రమోషన్ ఇవ్వాలని కోరారు.


