జీఎంసీ కాంట్రాక్టర్లకు గుదిబండగా పెండింగ్ బిల్లులు రూ. 113 కోట్లకుగాను ఇచ్చింది కేవలం రూ. 10.78 కోట్లే తెలుగు తమ్ముళ్ల జోక్యంతో తప్పని అవస్థలు
మోసం చేయడమే..
అధికారం అండగా తెలుగు తమ్ముళ్ల పెత్తనంతో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ (జీఎంసీ)లోని కాంట్రాక్టర్లు నానా అవస్థలు పడుతున్నారు. అప్పులు చేసి మరీ పలు అభివృద్ధి పనులు పూర్తి చేశారు. సకాలంలో బిల్లులు రాకపోవడంతో వాటిని తీర్చలేక ఇబ్బందుల పాలవుతున్నారు. చంద్రబాబు పాలనలో అల్లాడుతున్నారు.
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో కాంట్రాక్టర్లు పలు పనులు పూర్తి చేశారు. 711 బిల్లులకు సంబంధించి రూ.113.83 కోట్లకు నిధి పోర్టల్కు పంపించారు. అందులో 127 బిల్లులకు రూ.10.78 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. 545 బిల్లులకు సంబంధించి రూ.95.02 కోట్లు వెయింటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నాయి. 39 బిల్లులకు సంబంధించి రూ.8.03 కోట్లు వివిధ దశల్లో పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వం మంజూరు చేసిన బిల్లుల్లో కూడా కేవలం రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షల్లోపే ఉంటున్నాయని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. రూ. 20 లక్షలకు మించి ఉన్న బిల్లులకు మోక్షం కలగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరపాలక సంస్థకు సంబంధించిన నీటి పన్నులు, దుకాణాల రూమ్ అద్దెలు, బిల్డింగ్ లైసెన్స్ ఫీజులు, ఆక్రమణ పన్నులు, ఇతర అన్ని ఫీజులు జనరల్ ఫండ్ 001 ఖాతాకు జమ అవుతుంటాయి. అయితే కాంట్రాక్టర్లకు 001 పద్దు నుంచి బిల్లులు వస్తుంటాయి. ఈ పద్దులో ఉన్న నగదు రూ.48.20 కోట్లు మాత్రమే. కాంట్రాక్టర్లు చెల్లించాల్సిన మొత్తం దాదాపు రూ.వంద కోట్ల వరకు ఉన్నాయి. 001 పద్దు నుంచి చెల్లించినా.. మిగిలిన మొత్తం చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది.
అడ్డం తిరిగిన కథ
నిధి పోర్టల్ ద్వారా బిల్లుల చెల్లింపులు ఆలస్యమవుతున్న నేపథ్యంలో కాంట్రాక్టర్ల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని జీఎంసీ అధికారులు 165 మంది కాంట్రాక్టర్లకు కార్పొరేషన్ ’జనరల్ ఫండ్స్’ నుంచి అయినా కొంత మేర బిల్లులు చెల్లించేందుకు సిద్ధపడ్డారు. కానీ ‘తెలుగు తమ్ముళ్లు’ అడ్డుపడ్డారు. తమ అనుచరుల 5 నుంచి 10 బిల్లులను ముందే క్లియర్ చేయాలంటూ ప్రజాప్రతినిధుల ద్వారా కమిషనర్పై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అధికార పార్టీ నేతల ఈ రాద్ధాంతంతో విసిగిపోయిన అధికారులు ఆ ప్రక్రియను సైతం నిలిపివేశారు. కనీసం కొందరికై నా జనరల్ ఫండ్స్ ద్వారా చెక్కులు రాస్తే ఎంతో కొంత డబ్బులు వస్తాయని ఆశించిన కాంట్రాక్టర్లకు తెలుగు తమ్ముళ్ల దెబ్బకు మొండి చేయే మిగిలింది.
జీఎంసీ 001 పద్దులో డబ్బులు తక్కువ ఉన్నప్పటికీ వందలాది బిల్లులు ఏ విధంగా అధికారులు నిధి పోర్టల్ పంపించారు? ఇది కాంట్రాక్టర్లను మోసం చేయడం, తప్పుదారి పట్టించడమే. బిల్లులు ఆలస్యమవుతున్న క్రమంలో కోర్టును ఆశ్రయిస్తున్నాం. బిల్లులు ఇవ్వాలని కోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ అడ్డుకున్నారు. కంటెమ్ట్ నోటీసు ఇస్తే అప్పుడు బిల్లులు ఇస్తున్నారు. అకౌంట్ సెక్షన్లో పారదర్శకత లేదు. అధికారులు సక్రమంగా ఉండరు.
– డి. శ్రీనివాసరావు, క్లాస్ వన్ కాంట్రాక్టర్


