గుంటూరు ఎడ్యుకేషన్: నిబద్ధతతో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించిన బండి శ్రీనివాసరావు ఉద్యోగులకు ఆదర్శ ప్రాయుడని జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అన్నారు. గుంటూరు రూరల్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి బండి శ్రీనివాసరావు ఉద్యోగ విరమణ సందర్భంగా ఆదివారం జెడ్పీ కార్యాలయంలో అభినందన సభ నిర్వహించారు. ఈసందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న హెనీ క్రిస్టినా మాట్లాడుతూ 43 ఏళ్ల సుదీర్ఘ ప్రభుత్వ సేవలో బండి శ్రీనివాసరావు జిల్లా పరిషత్, మండల పరిషత్ వ్యవస్థలో వివిధ హోదాల్లో పని చేసి ప్రజలకు అందుబాటులో ఉండే అధికారిగా, క్రమశిక్షణకు ప్రతీకగా నిలిచారని కొనాయాడారు. గ్రామీణాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, స్థానిక సంస్థల బలోపేతం, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. అనంతరం బండి శ్రీనివాసరావు దంపతులను సత్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీలు పి.అశోక్ బాబు, డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, ఏపీపీఆర్ఎంఈఏ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కూచిపూడి మోహన్రావు, జెడ్పీ సీఈఓ వి.జ్యోతి బసు, పీపీఆర్ అండ్ ఆర్డీ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కేఎన్వీ ప్రసాద్, డిప్యూటీ సీఈఓ సీహెచ్ కృష్ణ, ఏపీపీఆర్ఎంఈఏ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్వీవీ యేసు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అనుమట్టి శ్రీనివాసరావు, ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కె.బుచ్చిరాం, అగ్నికుల క్షత్రియ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు, డీపీఓ బీవీ నాగసాయి కుమార్, తదితరులు పాల్గొన్నారు.


