జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా
గుంటూరు వెస్ట్: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది అందరికీ మంచి జరగాలని, జిల్లా మరింత అభివృద్ధి పథంలో సాగాలని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా ఆకాంక్షించారు. ఉగాది పండుగను పురస్కరించుకుని గురువారం స్థానిక రెవెన్యూ కల్యాణ మండపంలో ఉత్సవాలు శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహించారు. వేడుకల్లో కలెక్టర్తోపాటు జీఎంసీ కమిషనర్ మయూర్ అశోక్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ... నూతన సంవత్సరంలో ప్రతి ఇంట్లోనూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో ఉంచి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ఉండేలా కృషి చేయాలన్నారు. గౌరీపెద్ది మురళి పంచాంగ పఠనం చేశారు. టీటీడీ వేద పండితులు లంకా నాగేశ్వర అవధాని, వైఖానస ఆగమ ముఖ్య ఆచార్య అళహరి రవికుమార్, ములుకుదురు చెన్న కేశవస్వామి దేవాలయం అర్చకులు నారాయణం కేశవ మూర్తి, దొండపాడు శ్రీ రాజ మల్లేశ్వరి దేవస్థానం అర్చకులు యనమదల హనుమంతరావులను పట్టు శాలువా, నూతన వస్త్రాలు, ప్రశంసాపత్రం, నగదుతో జిల్లా కలెక్టర్, కమిషనర్ మయూర్ అశోక్, జేసీలు ఘనంగా సత్కరించారు. సాహితీవేత్తలు, కవులు, కవయిత్రిలు పింగళి భాగ్యలక్ష్మి, చుండూరి శేషమాంబ, సంబరాజు రమణి, అస్మతున్నీస, లంకా మాధవి, బాసరాజు శంకర్రాజు, రాయల సుబ్బారావు, ఆవుల తిరుమలేష్, పి. శివ పార్వతి, కొమ్మడి శివశంకర ప్రసాద్, డాక్టర్ రావెళ్ళ శ్రీనివాసరావు, చెట్టి వెంకట రమణ, చెరుకూరి వెంకట సాయి రమేష్, ఎస్ఎంఎం ఖుద్దూస్లను పట్టు శాలువా, మెమోంటో, సర్టిఫికెట్, ఉగాది పురస్కారాలతో సత్కరించారు. తొలుత ఉగాది విశిష్టత, వైభవాన్ని తెలియజేసేలా సభలో చిన్నారులు, యువతులు సంప్రదాయ గీతాల ఆలాపన, నృత్యాల ప్రదర్శనతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. డీఆర్వో షేఖ్ఖాజా వలి, జెడ్పీ సీఈవో వి.జ్యోతి బసు, జీఎంసీ అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గ్రంధి మాధవి, ఆర్డీవో కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు.


