పెదకాకాని: పెదకాకాని రైల్వే హాల్ట్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన బుధవారం వెలుగు చూసింది. పెదకాకాని పోలీసులు, రైల్వే పోలీసులు, స్థానికుల సమాచారం మేరకు.... పెదకాకాని రైల్వేహాల్ట్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు రైల్వే కీమెన్ పోలీసులకు సమాచారం అందించారు. సీఐ టి.పి. నారాయణస్వామి తమ సిబ్బందితో వెళ్లి, రైల్వే పోలీసులకు కూడా సమాచారం అందించారు. రైల్వే పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంను రప్పించి వివరాలు సేకరించారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. రఘురామ కాలనీలో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్ వద్దకు జాగిలం వెళ్లి ఆగింది. సంఘటనా ప్రదేశంలో ఒకే బ్రాండ్ కలిగిన షర్టులు మృతుడి శరీరంపై ఒకటి, పక్కనే రక్తగాయాలతో మరొకటి ఉన్నాయి. ఒకే రకమైన రెండు క్యాప్లు, రెండు జతల చెప్పులను పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు జీజీహెచ్లోని శవాగారానికి తరలించారు. ఆర్పీఎఫ్ ఏఎస్సీ బి.శైలేష్కుమార్, డీఎస్పీ అక్కేశ్వరరావు, సీఐ అంజిబాబు తదితరులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.


