నగర వాసులకు నీటి కష్టాలు తప్పవా?
వేసవిలో రోజు వారీ నీటి వినియోగం 150 నుంచి 160 మిలియన్ లీటర్లు కృష్ణా నది నుంచి దాదాపు 132 మిలియన్ లీటర్ల నీటి సేకరణ లక్ష్యం సంగంజాగర్లమూడి నుంచి 19.50 మిలియన్ లీటర్ల నీరు లభ్యం అసంపూర్తిగా గోరంట్ల వాటర్ ట్యాంకుల నిర్మాణం స్పందించని పాలక వర్గం, అధికారులు
సమ్మర్ యాక్షన్ ప్లాన్ ఊసే లేదు..!
గుంటూరు నగర పరిధిలో 10 లక్షలకు పైగా జనాభా
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): గుంటూరు నగరంలో వేసవి వస్తే చాలు తాగునీటి సమస్య ఉత్పన్నమవుతుంది. నగర శివారు ప్రాంతాల తోపాటు..విలీన గ్రామాలకు తాగునీటి కష్టాలు ఉత్పన్నమవుతున్నాయి. సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా నగరంలో తాగునీటి సమస్యకు చెక్ పెట్టే కార్యక్రమాలు సత్ఫలితాలు ఇవ్వడం లేదనే చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఏళ్ల తరబడి గోరంట్ల వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంతో వేసవిలో తాగునీటి కష్టాలు మళ్లీ పునరావతం కాక తప్పదని నగర వాసులు ఆందోళన చెందుతున్నారు.
అవసరం కొండంత...సరఫరా గోరంత
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 43 వాటర్ ట్యాంకులు ఉన్నాయి. ఈ ట్యాంకులకు గుంటూరు నగరానికి కృష్ణానది నుంచి తక్కెళ్లపాడుకు 132 మిలియన్ లీటర్ల తాగునీరు సరఫరా అవుతుంది. సంగంజాగర్లమూడి(కొమ్మమూరు కెనాల్) నుంచి 19.50 మిలియన్ల నీరు సరఫరా అవుతోంది. మొత్తం 151.50 మిలియన్ లీటర్ల నీరు గుంటూరు నగరానికి ప్రతిరోజూ సరఫరా అవుతుంది. పైపులైన్ల లీకులు వలన రోజుకు 10 నుంచి 20 మిలియన్ లీటర్ల నీరు వృథా అవుతూ ఉంటుంది. వేసవిలో నీటి వాడకం ఎక్కువగా ఉండటంతో నగర శివారు ప్రాంత వాసులకు నీటి కష్టాలు వస్తుండేవి. పైపులైన్ లీకులు మరమ్మతులు చేపడుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో పైపులైన్లు పాతవి కావడంతో లీకు బరస్ట్ అవ్వడంతో తిరిగి అక్కడే లీకులు ఏర్పడతున్నాయనే చెప్పుకోవచ్చును.
అసంపూర్తిగా గోరంట్ల ట్యాంకు పనులు
గోరంట్ల కొండపై రూ.33 కోట్లతో రెండు వాటర్ ట్యాంకుల నిర్మాణం అసంపూర్తిగా ఉంది. తక్కెళ్లపాడు హెడ్ వాటర్ వర్క్స్ నుంచి వయా ఆటోనగర్ మీదుగా 10.14 కిలోమీటర్ల పైపులైను కొండమీద వాటర్ ట్యాంక్ నిర్మాణానికి కనెక్ట్ చేశారు. ట్యాంక్ పైభాగాన శ్లాబ్ వేయకపోవడంతో పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి.
గుంటూరు నగర ప్రజలకు ఈ వేసవిలో నీటి కష్టాలు తప్పేలా లేవు. ప్రస్తుతం తక్కెళ్లపాడు, సంగంజాగర్లమూడిల నుంచి 151.50 మిలియన్ లీటర్ల నీరు సరఫరా అవుతోంది. పైప్ లైన్ లీకేజీల కారణంగా ప్రతిరోజూ వేలాది లీటర్లు వృథాగా పోతోంది. అయితే వేసవిలో రోజు వారి వినియోగం 150 నుంచి 160 మిలియన్ లీటర్ల నీరు అవరమని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన వేసవిలో నగర వాసులకు నీటి కష్టాలు తప్పేలా లేవు.
వేసవి కాలం రాకముందే గుంటూరు నగర పాలక సంస్థ అధికారులు సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తారు. ఇందులో భాగంగా పైపులైన్ల లీకుల మరమ్మతులు..మోటార్లు కండీషన్లో ఉన్నాయో..లేవో చూసుకోవడం..ఏమైన మరమ్మతులు ఉంటే చేయించడంతోపాటు బోరింగ్ పంపుల మరమ్మతులు..ఎక్కడైనా తాగునీరు రాకపోతే తీసుకునే చర్యలపై ఇంత వరకు అధికారులు యాక్షన్ ప్లాన్ చేయలేదనే చెప్పుకోవచ్చు. ఇప్పుడిప్పుడే ఎండలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో అధికారులు సమ్మర్ యాక్షన్ ప్లాన్ ఎప్పుడు ప్రారంభిస్తారో వేచి చూడాల్సి ఉంది.


