అంతర్జాతీయస్థాయికి తెలుగు నాటకం
నగరంపాలెం: నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా/ వేదిక (తెలుగు నాటక పరిషత్ల సంఘం) సంయుక్తంగా మార్కెట్ కూడలిలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఙాన మందిరంలో నిర్వహిస్తున్న భారత్ రంగ్ మహోత్సవ్ – అంతర్జాతీయ నాటక ఉత్సవం నాలుగో రోజుకి చేరింది. సోమవారం జరిగిన సభకు వేదిక అధ్యక్షుడు డాక్టర్ ముత్తవరపు సురేష్బాబు అధ్యక్షత వహించగా, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, వైద్యురాలు ముత్తవరపు భార్గవిచౌదరి జ్యోతిప్రజ్వలన చేశారు. అనంతరం జరిగిన సభలో తెలుగు నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ తెలుగు నాటకం అంతర్జాతీయ స్థాయికి సాటి అని నిరూపించేలా భారత్ రంగ్ మహోత్సవ్ కొనసాగుతుందని అన్నారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ సోషల్ మీడియా ప్రభావంతో నాటక రంగం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న తరుణంలో అంతర్జాతీయ నాటకోత్సవాలను ఏపీకి తేవడం అభినందనీయమన్నారు. సీనియర్ కళాకారులు సుబ్బరాయశర్మ, బుద్దాల వెంకట్రావు, వి.పురుషోత్తమం, దేవేంద్రలను సత్కరించారు. అనంతరం ‘ఏ వెరీ సింపుల్ స్టోరీ’ అనే రష్యన్ నాటకం ప్రదర్శించారు. రష్యన్ దర్శకుడు అలెక్సి బ్లాకి అద్భుత సృజన దృశ్యరూపంగా మలిచారు. మనుషుల స్వార్థానికి, జంతువుల నిస్వార్థ ప్రేమకు మధ్య ఉన్న సన్నని గీతను నాటకం ఆవిష్కరించింది. కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా భాషా సరిహద్దులను చెరిపేస్తూ అద్భుత అభినయంతో కరుణ, స్నేహం, పరస్పర అవగాహనే జీవిత పరమార్థమని ఈ నాటకం చాటిచెప్పింది.
మానవీయ విలువలు చాటిన రష్యన్ నాటకం ‘ఏ వెరీ సింపుల్ స్టోరీ’


