హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ సమావేశం
తాడేపల్లి రూరల్: తాడేపల్లి సీతానగరంలోని సీతా భవన్లో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యక్రమాలపై సోమవారం సమావేశాన్ని నిర్వహించారు. ట్రస్ట్ చైర్మన్ దాసరి శ్రీనివాసులు మాట్లాడుతూ ఆరు నెలల కార్యక్రమాలకు సంబంధించిన ప్రణాళికల ప్రకారం మార్చి 8వ –10 తేదీ వరకు కంచి పీఠాధిపతులు విజయేంద్ర సరస్వతి స్వామి వారి సూచనల మేరకు ప్రకాశం బ్యారేజ్ నుంచి హంసల దీని వరకు దేవత వృక్షాలను నాటడం జరుగుతుందని తెలిపారు. ఆషాడ మాసం వ్యాస పౌర్ణమి సందర్భంగా రాష్ట్రంలో ప్రతి దేవాలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించనున్నామని పేర్కొన్నారు. గ్రామాల కేంద్రంగా ఉన్న దేవాలయాల్లో నిరంతర పూజా కార్యక్రమాలు, దీప ప్రజ్వలనలు, ధూపదీప నైవేద్యాలు నిరాటంకంగా కొనసాగేందుకు ఆర్థిక సహకారం అందించే పెద్దల మద్దతుతో చర్యలు తీసుకుంటామన్నారు. ట్రస్ట్ కమిటీ సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


