విద్యతో పాటు నైతికత ముఖ్యం
ఏఎన్యూ(పెదకాకాని): ప్రతి విద్యార్థి విద్యతో పాటు నైతిక విలువలు కలిగి ఉండాలని ప్రముఖ ప్రవచనకర్త, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు అన్నా రు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో శనివారం విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం – నైతిక విలువలు అనే అంశంపై ప్రసంగం చేశారు. ఈ కార్యక్రమానికి ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.సురేష్కుమార్ అధ్యక్షత వహించారు. ఏఎన్యూ స్వర్ణోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ.. విలువలతో కూడిన జీవితం ప్రతి విద్యార్థి విజయానికి మార్గమన్నారు. గురువు గౌరవాన్ని కాపాడలేని చదువు వ్యర్ధమన్నారు. విలువలతో కూడిన విద్య అభ్యసించిన వారు తప్పక విజయం సాధిస్తారన్నారు. కష్టపడిన వారు ఎప్పటికీ నష్టపోరని.. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆజాద్, గొప్ప ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య, జాతి వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేసిన నెల్సన్ మండేలా, బెనారస్ యూనివర్సిటీ స్థాపనకర్త మదన్మోహన్ మాలవ్య వంటి మహనీయులు సమాజంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని విజేతలుగా నిలిచారని గుర్తు చేశారు. విద్యార్థులు తల్లిదండ్రులు, విద్యాసంస్థ, గురువులు గర్వించేలా సమాజంలో ఉత్తమ గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు. వర్సిటీ వైస్ చాన్స్లర్ ఆచార్య కె.గంగాధరరావు, రిజిస్ట్రార్ జి.సింహాచలం, రెక్టార్ ఆర్.శివరాంప్రసాద్లు ప్రసంగించారు. అనంతరం చాగంటి కోటేశ్వరరావు దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు హాజరయ్యారు.
ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు


