రేషన్ దుకాణాల్లో జేసీ విస్తృత తనిఖీలు
గుంటూరు వెస్ట్: జిల్లాలో రేషన్ దుకాణాలలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మంగళవారం తెలిపారు. జిల్లా పౌర సరఫరాల అధికారి, వారి సిబ్బందితో కలసి విస్తృతంగా తనిఖిలను నిర్వహిస్తున్నారన్నారు. ఈ నెలలో రేషన్ పంపిణీ జరుగుతున్న పలు చౌక ధరల దుకాణాలలో పౌర సరఫరాల సిబ్బంది ఆకస్మికగా తనఖిలను నిర్వహించి వాటిలో వ్యత్యాసాలు గుర్తించిన రేషన్ దుకాణాల డీలర్లపై 6ఎ, క్రిమినల్ కేసులను నమోదు చేయడం జరిగిందని వివరించారు. గుంటూరు నగరంలో రేషన్ షాప్ నెంబర్ 0781095, 0781106, 0781141లలో తనిఖీలను నిర్వహించగా ఆ దుకాణాల్లో బియ్యం తక్కవగా ఉండటాన్ని గుర్తించడం జరిగిందని తెలిపారు. రేషన్ షాపుల నెంబర్లు 0781003, 0781018, 0781015 లో తనిఖీలను నిర్వహించగా వాటిలో బియ్యం ఎక్కువగా ఉండటాన్ని గుర్తించామన్నారు. తాడేపల్లి మండల పరిధిలో రేషన్ షాప్ నెంబర్ 0793014 లో తనిఖీలు నిర్వహించగా అక్కడ కూడా బియ్యం తక్కవగా ఉండటాన్ని గుర్తించి డీలర్లపై కేసులను నమోదు చేశామన్నారు. పీడీఎస్ బియ్యం కొనుగోలు, విక్రయాలు జరిపితే నేరమని తెలిపారు. అమ్మినా, కొన్నా చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జేసీ హెచ్చరించారు.


