పీజీఆర్ఎస్ ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి
జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ 170 ఫిర్యాదులు స్వీకరణ
నగరంపాలెం: జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించారు. ఈ మేరకు బాధితుల నుంచి జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అర్జీలు స్వీకరించారు. బాధితుల సమస్యలను ఆయన ఆలకించారు. సంబంధిత సబ్ డివిజన్ల పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ మొబైల్ఫోన్లో మాట్లాడారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి పోలీస్స్టేషన్ అధికారి పీజీఆర్ఎస్ ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీలు పరిష్కరించాక బాధితులకు తెలియజేయాలని చెప్పారు. ఫిర్యాదిదారుల అనుమతుల్లేకుండా ఏ ఫిర్యాదు ఆన్లైన్లో మూసివేయద్దని సూచించారు. 170 ఫిర్యాదులు స్వీకరించామని తెలిపారు. జిల్లా ఏఎస్పీ (పరిపాలన) జీవీ.రమణమూర్తి, డీఎస్పీలు అబ్దుల్అజీజ్ (గుంటూరు తూర్పు), శ్రీనివాస్రెడ్డి (మహిళా పీఎస్), బెల్లం శ్రీనివాసరావు (ట్రాఫిక్)లు ఫిర్యాదులు స్వీకరించారు.


