
లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు
సంతమాగులూరు(అద్దంకి): నిలిచి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా, ఐదుగురికి గాయాలైన సంఘటన సంతమాగులూరు మండలంలోని పాతమాగులూరు గ్రామ సమీపంలో శుక్రవారం జరిగింది. అందిన సమాచారం మేరకు.. తణుకు నుంచి నంద్యాల వైపు లోడ్తో వెళుతున్న లారీ పాత మాగులూరు వద్ద ఆగి ఉంది. ఈ క్రమంలో విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందున్న లారీని గమనించకుండా ఢీ కొట్టడంతో మూడో సీటులో కూర్చున్న అనంతపురం రూరల్ మండలానికి చెందిన హుస్సేన్(55) అక్కడిక్కడే మృతిచెందాడు. మరో ఐదుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.
రైలులో బెర్త్ లేక బస్సులో..
దూదేకుల హుస్సేన్ ఈ నెల 17న స్నేహితుడు అబ్దుల్ దౌలాతో పనిమీద విజయవాడ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఇద్దరూ రైలు ఎక్కడానికి మచిలీపట్నం రైల్వేస్టేషన్కు వెళ్లారు. అక్కడ ఒకే బెర్త్ ఉండటంతో, దౌలా రైలు ఎక్కాడు. హుస్సేన్ బస్సులో అనంతరపురం బయలుదేరాడు. సంతమాగులూరు మండలం పాతమాగులూరు గ్రామ సమీపంలోకి రాగానే ముందు ఆగి ఉన్న లారీని ఢీ కొట్టడంతో సీటులో కూర్చుని ఉన్న హుస్సేన్ తల ముందు సీటుకు తగిలి, తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుని భార్య ఆశాబీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి శవ పంచనామా నిర్వహించి బంధువులకు అప్పగించారు.
ఒకరు మృతి.. ఐదుగురికి స్వల్ప గాయాలు

లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు