
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా వెంగళాయపాలెనికి చెందిన పార్టీ కార్యకర్త సింగయ్య ప్రమాదం కారణంగా మృతిచెందారు. ఈ నేపథ్యంలో పార్టీ వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, బలసాని కిరణ్ కుమార్, నూరి ఫాతిమా వెంగళాయపాలెంలో సింగయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం, పార్టీ తరఫున సింగయ్య కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కు అందజేశారు.
ఈ సందర్బంగా మాజీ మంత్రి, పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ..‘సింగయ్య వైఎస్సార్సీపీ కార్యకర్త. వైఎస్ జగన్ అభిమాని. వైఎస్ జగన్ పర్యటనలో కారు ప్రమాదం కారణంగా సింగయ్య మృతిచెందాడు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది. విషయం తెలుసుకోగానే వైఎస్ జగన్.. వారి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. దీనికి సంబంధించిన చెక్కును సింగయ్య భార్యకు అందించాం. సింగయ్య మృతుని కూడా కూటమి ప్రభుత్వం రాజకీయం చేయాలని చూసింది.
వైఎస్ జగన్ పర్యటనలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు కేసులు పెడుతున్నారు. పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా ఎవరూ భయపడరు. వాటిపై న్యాయపోరాటం చేస్తాం. కానీ, వైఎస్సార్సీపీ నాయకుల్ని గాని కార్యకర్తలు గాని పోలీసులు అక్రమంగా నిర్బంధిస్తే చూస్తూ ఊరుకోం. వైఎస్ జగన్ పర్యటనకు ప్రజలు రానివ్వకుండా చేయాలని ప్రభుత్వం పోలీసులు ద్వారా కుట్ర పన్నింది. ఆ కుట్రను ఛేదించుకుంటూ వేలాది మంది జనం తరలివచ్చారు.

మాజీ ఎంపీ మోదుగులు వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ..‘సింగయ్య వైఎస్సార్సీపీకి కరుడుగట్టిన కార్యకర్త. ప్రమాదంలో ఆయన చనిపోవడం బాధాకరం. ఈ విషయం తెలుసుకోగానే వైఎస్ జగన్ మమ్మల్ని అందరినీ సింగయ్య ఇంటికి వెళ్లి ఆ కుటుంబానికి అండగా ఉండమని ఆదేశించారు. వైఎస్ జగన్ పంపిన 10 లక్షలు ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును ఆ కుటుంబానికి అందించాం. సింగయ్య కుటుంబానికి పార్టీ అన్నివేళలా అండగా ఉంటుంది.
పత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బాలసాని కిరణ్ కుమార్ మాట్లాడుతూ..‘వైఎస్సార్సీపీ కార్యకర్త సింగయ్య యాక్సిడెంట్లో చనిపోవడం బాధాకరం. ఆయన కుటుంబానికి ఎప్పుడు పార్టీ అండగా ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు.