
రెండు కుటుంబాల అదృశ్యంపై ఫిర్యాదు
తాడేపల్లి రూరల్ : తాడేపల్లి పట్టణ పరిధిలోని ప్రకాష్నగర్లో నివసించే రెండు కుటుంబాలకు చెందిన ఆరుగురు కనిపించడం లేదంటూ ఓ వ్యక్తి గురువారం తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు.. కారు డ్రైవింగ్కు వెళ్లిన బెవర దుర్గారావు ఇంట్లో ఉన్న భార్యకు ఫోన్ చేశాడు. ఆమె గానీ కుటుంబ సభ్యులు గానీ లిఫ్ట్ చేయలేదు. ఇంటికి వచ్చి చూడగా వారు కనిపించలేదు. తన భార్యతో పాటు తోడల్లుడి కుటుంబం కూడా కనిపించడం లేదని పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశాడు. కనిపించకుండా పోయిన వారిలో దుర్గారావు భార్య సుధారాణి, కుమారుడు నవీన్ కుమార్, కుమార్తె యశ్వణి, తోటికోడలు, మరో ఇద్దరు ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తాడేపల్లి ఎస్ఐ ప్రతాప్ కుమార్ కేసు నమోదు చేశారు.