
పథకం ప్రకారమే వృద్ధురాళ్ల హత్య
● మృతుల్లో ఒకరైన రాజేశ్వరికి పరిచయమున్న మహిళ కీలకం ● పోలీసుల దర్యాప్తులో వెల్లడి ● రక్షించుకునేందుకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయిన వృద్ధురాళ్లు
తెనాలి రూరల్: స్థానికంగా కలకలం రేపిన వియ్యపురాళ్ల హత్యలు పథకం ప్రకారమే జరిగినట్టు తెలుస్తోంది. ఇద్దరూ వృద్ధ మహిళలు ఒంటరిగా ఉంటున్నారని గమనించిన దుండగులు వారిని హతమార్చి బంగారాన్ని అపహరించారు. ముందుగానే వేసుకున్న పథకం ప్రకారమే హత్య చేసినట్టు ఘటన స్థలంలో తెలుస్తోంది. ఆటోలో గురువారం ఉదయం 11.30 గంటల సమయంలో ఓ మహిళ, ఇద్దరు యువకులు వియ్యపురాళ్లైన దాసరి రాజేశ్వరి(65), పిటా అంజమ్మ(70)లు ఒంటరిగా ఉంటున్న నివాసానికి రావడం సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. వచ్చి 10 నిమిషాల అనంతరం వెళ్లపోయారని స్థానికులు చెబుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు వచ్చిన సందర్భంలో కేకలు వినపడ్డాయని, కొందరు పోలీసులకు తెలిపారు. తెనాలి నుంచి బాపట్ల జిల్లా చుండూరు మండలం చినపరిమి గ్రామానికి వెళ్లే రోడ్డులో గతంలో నిర్వహించిన అప్పడాల కంపెనీ పై అంతస్తులో వృద్ధ వితంతు వియ్యపురాళ్లు కలసి ఉంటున్నారు. సాధారణంగా వీరు కింది కంపెనీలోకి వెళ్లరని, సాయంత్రం ఇంటి బయట అరుగు మీద కూర్చుంటూ ఉంటారని స్థానికులు చెబుతున్నారు. హత్యలు మాత్రం వాడుకలో లేని అప్పడాల కంపెనీలో జరగడం గమనార్హం. రెండు మృతదేహాలు వేర్వేరు గదుల్లో పడి ఉన్నాయి.
తెలిసిన వ్యక్తుల పనే?
ఈ డబుల్ మర్డర్ తెలిసిన వ్యక్తుల పనే అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. సీసీ పుటేజీలో రికార్డు అయిన మహిళకు, రాజేశ్వరికి కొన్నేళ్లుగా పరిచయముందని ఇక్కడి వారు చెబుతున్నారు. ఆ పరిచయం ఆధారం చేసుకుని అప్పడాల కంపెనీని అద్దెకు తీసుకునేందుకు వచ్చి, రాజేశ్వరి, అంజమ్మలను కిందకు పిలిపించి కంపెనీలోకి తీసుకెళ్లి హత్య చేసినట్టు భావిస్తున్నారు.
హత్య సందర్భంలో తీవ్ర పెనుగులాట?
నిందితులు వృద్ధురాళ్లను హత్య చేసేందుకు ప్రయత్నించిన సమయంలో ఇద్దరూ తీవ్రంగానే ప్రతిఘటించడంతో పెనుగులాట జరిగినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలంలో మృతదేహాలు పడి ఉన్న తీరు ఇందుకు బలం చేకూరుస్తోంది. రాజేశ్వరి చేతిలో కర్ర ఉండగా, అంజమ్మ చేతిలో రెండు కిలోల తూకం రాయి రక్తం మరకలతో ఉంది. దీనిని బట్టి పెనుగులాట జరిగి ఉంటుందని, ఇద్దరూ తమను రక్షించుకునే ప్రయత్నం చేయడంతో దుండగులు విచక్షణారహింతంగా తలలపై దాడి చేసి హత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. తమ వెంట తెచ్చుకున్న ఇనుపరాడ్లు, ఇతర పరికరాలతో దాడి చేసి హత్య చేసి ఉంటారని ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు, క్లూస్ టీం భావిస్తున్నారు. అంజమ్మ చేతిలోని తూకం రాయి, రాజేశ్వరి చేతిలోని కర్రను క్లూస్ టీం సీజ్ చేసింది. ఇద్దరి మృతదేహాలు వేర్వేరు గదులోల పడి ఉన్నాయి. హత్య చేసి వీరి వద్ద ఉన్న బంగారాన్ని నిందితులు అపహరించుకెళ్లినట్టు పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం నిందితుల ఆచూకీ పోలీసులు గుర్తించి, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది.

పథకం ప్రకారమే వృద్ధురాళ్ల హత్య