● ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె. మధుమూర్తి ● ఘనంగా వీవీఐటీ స్నాతకోత్సవం
పెదకాకాని: ప్రతి ఒక్క విద్యార్థి డిగ్రీ పట్టా వెనుక తల్లిదండ్రుల త్యాగాలు ఎన్నో ఉంటాయని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె. మధుమూర్తి అన్నారు. వాసిరెడ్డి వెంకటాద్రి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల స్నాతకోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె. మధుమూర్తి, వీవీఐటీ విశ్వవిద్యాలయ చాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్, వైస్ చాన్సలర్ కొడాలి రాంబాబు, ప్రిన్సిపాల్ డాక్టర్ వై. మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు.ప్రొఫెసర్ మధుమూర్తి మాట్లాడుతూ డిగ్రీ అంటే కేవలం పట్టా మాత్రమే కాదు జ్ఞానాన్ని సంపాదించడం అన్నారు. స్టార్టప్ కంపెనీలను స్థాపించి ఉద్యోగాలు అందించే స్థాయికి విద్యార్థులు ఎదగాలని సూచించారు. వీవీఐటీ విశ్వవిద్యాలయ చాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్లో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. వైస్ చాన్సలర్ కొడాలి రాంబాబు మాట్లాడుతూ 2007లో ప్రారంభమైన వీవీఐటీ కళాశాల అనతి కాలంలోనే అనేక విజయాలను సొంతం చేసుకొని 2025లో విశ్వవిద్యాలయంగా ఎదిగిందని చెప్పారు. వీవీఐటీ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. మల్లికార్జునరెడ్డి కళాశాల వార్షిక ప్రణాళికను, భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. 2021–2025 విద్యా సంవత్సరానికి గాను అత్యుత్తమ ప్రతిభ కనబరచి కళాశాల టాపర్గా నిలచిన విద్యార్థిని పరుచూరి బిందు రేణుకకు వాసిరెడ్డి వెంకటాద్రి బంగారు పతకాన్ని ముఖ్య అతిథి ప్రొఫెసర్ కె. మధుమూర్తి అందజేశారు. క్లాస్ ఆఫ్ 2025కు ఉత్తమ ప్రతిభ కనబరచిన 11 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, ప్రశంసా పత్రాలతోపాటు 1195 మంది పట్టభద్రులకు డిగ్రీలు ప్రదానం చేశారు. ఈ వేడుకల్లో భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా విద్యార్థులు వేషధారణలో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో వీవీఐటీ వైస్ చైర్మన్ వాసిరెడ్డి మహదేవ్, సెక్రటరీ ఎస్. బదరీ ప్రసాద్, జాయింట్ సెక్రటరీ మామాళ్లపల్లి శ్రీకృష్ణ, డీన్ ఆఫ్ అకడమిక్ డాక్టర్ కె. గిరిబాబు, విభాగాధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు.