
లాలాపేట పీఎస్ పరిధిలో అనుమానితుడు పరారీ
పట్నంబజారు: గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని లాలాపేట పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం చోరీ కేసులో అనుమానితుడిగా ఉన్న ఓ యువకుడు పరారైనట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. లాలాపేట పోలీసు స్టేషన్పరిధిలోని పలు ప్రాంతాల్లో సెల్ఫోన్ చోరీలకు పాల్పడుతున్న నిమ్మలపేటకు చెందిన ఓ యువకుడిని కొద్ది రోజుల కిందట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం సాయంత్రం క్రైం విభాగ రూంలో ఉన్న యువకుడు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన క్రమంలో స్టేషన్ నుంచి బయటకు పరుగెత్తినట్లు సమాచారం. తేరుకున్న పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ అతని జాడ తెలియరాలేదు.
హైవేపై మూడు వాహనాలు ఢీ
మార్టూరు: జాతీయ రహదారిపై ఒకదాని వెనుక మరొకటిగా వెళుతున్న మూడు వాహనాలు పరస్పరం ఢీకొన్న సంఘటన స్థానిక రాజుపాలెం, డేగరమూడి రెస్ట్ ఏరియా సమీపంలో గురువారం సాయంత్రం జరిగింది. హైవే పెట్రోలింగ్ సిబ్బంది నాయక్, శ్రీహరి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒంగోలుకు చెందిన పద్మనాభయ్య శెట్టి తన వాహనంలో చిలకలూరిపేట నుంచి ఒంగోలు వెళ్తున్నాడు. రెస్ట్ ఏరియా సమీపంలోకి వెళ్లగానే వాహనాన్ని వెనుక నుంచి గ్రావెల్ తరలించే టిప్పర్ వాహన డ్రైవర్ బలంగా ఢీ కొట్టి రహదారి మధ్యలో తన వాహనాన్ని నిలిపివేశాడు. అదే మార్గంలో విజయవాడ నుంచి కృష్ణపట్నం పోర్టుకు వెళుతున్న కంటైనర్ వాహనం హఠాత్తుగా అడ్డుగా వచ్చిన టిప్పర్ వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ప్రమాద తీవ్రతకు మూడు వాహనాలు ధ్వంసం అయినప్పటికీ వాటిల్లోని వ్యక్తులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న హైవే పెట్రోలింగ్, ట్రాఫిక్ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకొని, రహదారికి అడ్డంగా ఉన్న వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూశారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ వాహనాన్ని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు.
రెండు కుటుంబాల మధ్య ఘర్షణ
చిలకలూరిపేట టౌన్: ఆర్థిక పరమైన వివాదాన్ని మనసులో పెట్టుకుని రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో మహిళకు గాయాలయ్యాయి. చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన ఆవుల దేవరాజు, శ్రీదేవి దంపతులు, అదే గ్రామానికి చెందిన ఎం.నాగరాజు, గోవిందమ్మ దంపతులు గురువారం గ్రామంలోని ఓ ఇంట్లో నిర్వహిస్తున్న పెదకర్మ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో రెండు కుటుంబ సభ్యుల మధ్య జరిగిన వాగ్వాదం కాస్తా ఘర్షణకు దారితీసింది. ఈ మేరకు జరిగిన దాడిలో శ్రీదేవికి గాయాలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.