
సంక్షేమం అమలుపై లెక్కలు చెప్పండి !
● మాజీ ఎమ్మెల్యే శివకుమార్ డిమాండ్ ● తొలి ఏడాది రూ.187.08 కోట్ల సంక్షేమ పథకాల అమలు ● కూటమి ప్రభుత్వంలో ఈ ఏడాది ఎంత ఇచ్చారు ? ● మంత్రి మనోహర్ గణాంకాలు వెల్లడించాలి
తెనాలి: నియోజకవర్గంలో గత ఏడాది ప్రజలకు అందించిన సంక్షేమాన్ని ప్రకటించాలని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ డిమాండ్ చేశారు. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా తాను 2019–2020లో నియోజకవర్గంలో రూ.187,08,10,000 సంక్షేమాన్ని అందించానని లెక్కలు చెప్పారు. కనీసం అమలుచేసిన పథకాల సాయం గణాంకాలనైనా వివరించాలని ఆయన మంత్రి మనోహర్ను కోరారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తొలి ఏడాది పాలన 2019–2020, కూటమి ప్రభుత్వం ఏడాది కాలం 2024–2025 పాలనను బేరీజు వేస్తూ రూపొందించిన ‘జగన్ అంటే నమ్మకం... చంద్రబాబు అంటే మోసం’ పుస్తకాన్ని గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే శివకుమార్ ఆవిష్కరించారు. అక్కడే విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను మరచి, వ్యవస్థలు, వ్యక్తులు, వైఎస్సార్ సీపీ నేతలపైనా పాల్పడుతున్న ఆరాచకాలను తాజా పుస్తకం బహిర్గతం చేస్తుందని తెలిపారు. పేదవాడి సంక్షేమానికి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యతను ఇచ్చిందని చెప్పారు. 2024–25లో నియోజకవర్గంలో అందించిన సంక్షేమాన్ని మనోహర్ వెల్లడించాలని స్పష్టంచేశారు. వంట గ్యాస్ సిలెండర్ల పథకానికి ఎందరు అర్హులు? ఎంతమందికి ఇచ్చారు? ఎందరికి డబ్బులు ఖాతాల్లో వేశారనే వివరాలను ఇంతకుముందు తాను కోరినా ఇప్పటికీ సమాధానం ఇవ్వలేదని శివకుమార్ గుర్తు చేశారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ, రూరల్, కొల్లిపర మండల అధ్యక్షులు దేసు శ్రీనివాసరావు, చెన్నుబోయిన శ్రీనివాసరావు, కల్లం వెంకటప్పారెడ్డి. జిల్లా ఉపాధ్యక్షుడు గోల్డ్ రహిమా, కౌన్సిలర్లు షేక్ దుబాయ్బాబు, యాతాటి అనిల్, మల్లెబోయిన రాము, బూరెల దుర్గాప్రసాద్, చింకా సురేష్యాదవ్, కాకి దేవసహాయం, దేవరపల్లి భూషణం, బండ్లమూడి నాని, ధరణికోట మల్లికార్జునరావు, అక్కిదాసు కిరణ్కుమార్, షేక్ మీరావలి, ఇందిరా ప్రియదర్శిని, నాలాది బుజ్జిబాబు, కార్తికేయ, కె.భవానీశంకర్ పాల్గొన్నారు.