
గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్య
మేడికొండూరు: పేరేచర్లలో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సేకరించిన సమాచారం మేరకు.. పేరేచర్ల విశ్వ భారతి కళాశాల సమీపంలో గుర్తు తెలియని వ్యక్తిని బండరాయితో తలపై బలంగా కొట్టి హత్య చేశారు. అటుగా వెళ్తున్న గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో మేడికొండూరు పోలీసులు సంఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లి ఆధారాలు సేకరిస్తున్నారు. మృతుని వయస్సు సుమారుగా 45 – 50 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. ఆచూకీ తెలిసినవారు మేడికొండూరు పోలీసులను సంప్రదించాలని సీఐ తెలిపారు.
ట్రాక్టర్, ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి
మేడికొండూరు: రోడ్డుపై వేగంగా వెళుతున్న ట్రాక్టర్ ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో వ్యక్తి అక్కడక్కడ దుర్మరణం చెందిన సంఘటన మండలంలోని పాలడుగు అడ్డరోడ్డు వద్ద ఆదివారం జరిగింది. గుంటూరు నల్లకుంటకుకు చెందిన తమ్మిశెట్టి జక్కరయ్య (45) తన భార్యతో కలిసి సత్తెనపల్లి నుంచి గుంటూరుకు ద్విచక్ర వాహనంపై వెళుతున్నారు. మార్గంమధ్యలో ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొనడంతో ప్రయాణిస్తున్న జక్కరయ్య మృతి చెందాడు. ఆయన భార్యకు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పందిళ్లమ్మ గుడిలో చోరీ
వేటపాలెం: మండలంలోని పందిళ్లపల్లి శివారు పంట పొలాల్లో ఉన్న గ్రామ దేవత పందిళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో శనివారం రాత్రి చోరీ జరిగింది. దొంగలు దేవస్థానం ముందు వైపుగల కటకటాల తాళాలు పగలగొట్టి లోపలకు ప్రవేశించారు. హుండీని కూడా పగలగొట్టి అందులోని నగదు, బీరువాని తెరచి అమ్మవారి నగలు ఎత్తుకెళ్లారని ఎస్ఐ ఎం. వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. చోరీకి గురైన మొత్తం విలువు రూ.30 వేలు ఉంటుందని పేర్కొన్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్మాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
వివాహిత ఆత్మహత్యాయత్నం
బల్లికురవ: కుంటుంబ కలహాలతో ఓ వివాహిత ఎలుకల మందు పేస్టు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి మండలంలోని చిన అంబడిపూడిలో జరిగింది. 108 సిబ్బంది, స్థానికుల సమాచారం మేరకు.. చిన అంబడిపూడి బీసీ కాలనీకి చెందిన పల్లపు అనూష ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎలుకల మందు పేస్టు తిని అపస్మారక స్థితికి చేరుకుంది. కుటుంబ సభ్యులు 108 వాహనానికి సమాచారం అందించారు. సిబ్బంది ప్రాథమిక చికిత్స చేసి అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనూష ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.
స్కూటీని ఢీ కొట్టిన లారీ
వ్యక్తి మృతి
వేటపాలెం: వేగంగా వస్తున్న లారీ ఎదురుగా వస్తున్న స్కూటీని ఢీ కొట్టిన సంఘటనలో వ్యక్తి మతి చెందాడు. 216 జాతీయ రహదారి బైపాస్ రోడ్డులో అక్కాయిపాలెం దగ్గరలో సంఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీస్ లు తెలిపిన వివరాల మేరకు... చీరాలకు చెందిన రాజు కృష్ణారెడ్డి(61) తన స్కూటీపై వేటపాలెం పని నిమిత్తం వచ్చాడు. పని ముగించుకుని రాత్రి తిరిగి బైపాస్ రోడ్డు మీదగా చీరాల బయలు దేరాడు. అక్కాయిపాలెం జంక్షన్ దగ్గరలో చీరాల వైపు నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. త్రీవ గాయాలతో ఉన్న వ్యక్తిని చీరాల ఏరియా వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్య