అంజుమన్ భూమిపై ఎమ్మెల్యే తీరు దారుణం
చిన్నకాకాని అంజుమన్ భూమిపై నోటిఫికేషన్ సరికాదు మాజీ ఎమ్మెల్యే, ముస్లిం సంఘాల ప్రతినిధులు
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): గుంటూరు చిన్నకాకానిలోని అంజుమన్ సంస్థకు సంబంధించిన 71.57 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు కుట్రలు చేస్తుంటే అంజుమన్ అధ్యక్షుడు, వక్ఫ్బోర్డు కమిటీ సభ్యుడు, తూర్పు నియోజకవర్గ మైనారిటీ ఎమ్మెల్యే నసీర్ అహమ్మద్ ఏం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా అన్నారు. పాత గుంటూరులోని అంజుమన్ షాదిఖానాలో సోమవారం అంజుమన్ హమారా–హక్ హమారా పేరిట ముస్లిం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటైంది. ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు మహమ్మద్ ఖలీం అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో నూరి ఫాతిమా మాట్లాడుతూ ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన రాష్ట్ర మంత్రి లోకేష్ ఓఎస్డీ, పర్సనల్ అసిస్టెంట్ సంబంధిత అధికారులకు చిన్నకాకానిలోని 71.57 ఎకరాల భూమిని ఐటీ పార్క్ కోసం ప్రైవేటీకరణ చేసేందుకు విన్నవించుకుంటే 11 నెలల తరువాత ఇప్పుడు వక్ఫ్ సీఈఓ, వక్ఫ్బోర్డు చైర్మన్, జిల్లా అంజుమన్ అధ్యక్షుడు, వక్ఫ్బోర్డు కమిటీ సభ్యుడు, ప్రస్తుత అధికార పార్టీ ఎమ్మెల్యే నసీర్ అహమ్మద్కు తెలియకుండానే ఎజెండాలో కమిటీ సభ్యులు సంతకాలు చేశారా? అని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ ఏకంగా పచ్చ పత్రికలో టెండర్లు పిలుస్తూ నోటిఫికేషన్ ఇవ్వడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. తక్షణమే భూసేకరణకు జిల్లా కలెక్టర్ ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ముస్లిం సంఘాలు మాట్లాడేందుకు ప్రయత్నించే క్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం రౌండ్ టేబుల్ సమావేశంలో భూ సేకరణ చట్టం ప్రకటనను తక్షణమే విరమించుకోవాలని తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జీయావుద్దీన్, జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షుడు పఠాన్ షైదా, సీపీఎం నగర కార్యదర్శి నళినికాంత్, మాజీ డిప్యూటీ మేయర్ గౌస్, లియాఖత్ అలీ, షన్ను, అప్సర్ బాబు, కార్పొరేటర్లు మహమ్మద్, ఆబిద్, ఫర్జానా, మైనారిటీ నాయకులు సలీం, సమీ ఉల్లా బేగ్, జాఫర్ ఖాన్, జబీర సలీం, ఇషాక్, నజీర్, సమద్, సైదా, సుభాని, రహీముద్దీన్, రియాజ్, జబిఉల్లా, బషీర్, ముస్లిం సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు మహమ్మద్ ఖలీం, మాజీ శాసనసభ్యుడు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్వలి, ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఖాజావలి, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి జాదా మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే నంబూరు సుభాని మాట్లాడుతూ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో, మాజీ ఎమ్మెల్యే జీయావుద్దీన్తో కలిసి అంజుమన్ సంస్థను అభివృద్ధి పథంలో నడిపించామన్నారు.
ఆస్తులను కాజేస్తే అల్లాహ్ క్షమించడు
చిన్నకాకానిలో ఉన్న అంజుమన్ సంస్థకు సంబంధించిన 71.57 ఎకరాల భూమికి పట్టాదారు పాస్పుస్తకాన్ని తీసుకు వచ్చామని తెలిపారు. అంజుమన్ ఆస్తులను కాజేస్తే అల్లాహ్ క్షమించడని నూరి ఫాతిమా తెలిపారు. దీనిపై తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహమ్మద్ మాట్లాడుతూ... అంజుమన్ సంస్థకు సంబంధించిన చిన్న కాకానిలోని 71.57 ఎకరాల భూమికి సంబంధించి అధికారులతో, న్యాయనిపుణులతో మాట్లాడుతాను.
అంజుమన్ భూమిపై ఎమ్మెల్యే తీరు దారుణం


