శిక్షణ లేని శిశు సంరక్షణ కేంద్రాలు | Sakshi Guest Column Special Story On Child Care Centers | Sakshi
Sakshi News home page

శిక్షణ లేని శిశు సంరక్షణ కేంద్రాలు

Jul 7 2026 11:47 AM | Updated on Jul 7 2026 11:52 AM

Sakshi Guest Column Special Story On Child Care Centers

న దేశంలో డే కేర్‌ సెంటర్స్‌ పేరుతో శిశు సంరక్షణ కేంద్రాలను నడుపుతారు. వీటిలో కొన్ని ప్రైవేటు సంస్థల గొలుసు కేంద్రాలు, కొన్ని స్థానిక మైనవి. వీటిలో రోజుకు గంట చొప్పున నెల రుసుం రూ. 3,000 నుండి రూ. 15,000 వరకు ఉంటుంది. ఇటీవల బెంగళూరు బ్రూక్‌ (వైట్‌) ఫీల్డ్‌లో క్యాప్జెమిని సాంకేతిక సేవల కంపెనీ ప్రాంగణంలోని డే కేర్‌ సెంటర్‌లో పిల్లలను వాష్‌రూమ్‌లు, ఫ్రంట్‌ లోడ్‌ వాషింగ్‌ మెషిన్లలో ఉంచడం, టాయిలెట్‌ గొట్టాలతో నోటిలో నీళ్ళు కొట్టడం వంటి దుశ్చర్యలకు పాల్పడ్డ దృశ్యాలు బహిర్గత మయ్యాయి. అరిస్తే, ఏడిస్తే కొడతామనీ, చంపు తామనీ బెదిరింపులు ఉన్న వీడియో బయటికి వచ్చింది.

ఇవ్వాళ పిల్లల చదువు, వైద్యం, ఇతర సౌక ర్యాలకోసం ఒకరి సంపాదన సరిపోవడం లేదు. దంపతులిద్దరూ కష్టపడితే కాని ఇల్లు గడవదు. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. ఒకసారి ఉద్యోగం వదిలితే తిరిగిరాదు. అందుకే ఇంట్లో ఆలనా, పాలనా చూసే పెద్దలు ఎవరూ లేని యువ దంపతులు తమ పిల్లలను శిశుసంరక్షణ కేంద్రాలలో చేర్చవలసి వస్తోంది. మానసిక శాస్త్ర సూత్రాలు తెలియవు!

డే కేర్‌ సెంటర్లలో పసిపిల్లల పట్ల యాజ మాన్యాలు, అక్కడ పనిచేసేవారూ ఎందుకింత బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారో కారణాలను వేతకాలి. ఈ కేంద్రాలను నిర్వాహకులు లాభా లకు నడుపుతారు. వారికిగానీ, అందులో ఉద్యో గులకుగానీ ఏ మాత్రం సేవాదృక్పథం ఉండటం లేదు. పిల్లల కోసం ఇచ్చిన తిండి, తీర్థాలను తిని పిల్లలను మాడ్చే ఆయాలున్నారు (తిండిలేని వారి పేదరికం కారణమేమో).

యాజమాన్యం, సిబ్బందికి శిశు సంరక్షణలో శిక్షణ ఉండదు. వీరికి పిల్లలు ఎందుకు ఏడుస్తు న్నారో తెలియదు. ఏడుపు మాన్పడం, బుజ్జగించడం, ఆడించడం రాదు. శిశుకేంద్రాలలో ఆట వస్తువులు ఉండవు. ఉన్నా పనిచేయవు. ఎదుటి వారితో సరిగ్గా వ్యవ హరించడానికీ, జీవితంలో అతి చిన్న సమస్యలను ఎదుర్కోవడానికీ మాన సిక శాస్త్ర సాధారణ సూత్రాలు తెలియాలి. ఇవి తెలియకనే పిల్లలు, విద్యార్థులు, పెద్దలు, రైతులు చిన్నపాటి ఇబ్బందులకే ఆత్మహత్యలకు ఒడి గడుతున్నారు.

పసిపిల్లల సంరక్షణకు శిశు మనస్తత్వాన్ని తెలుసుకోవాలి. దాన్ని అధ్యయనం చేయాలి. అనుదిన అనువర్తిత చర్యలను అమలుచేయాలి. పిల్లలందరూ ఒకేలా ప్రవర్తించరు. ఒకే సమస్యకు ఒకేలా స్పందించరు. ఇండియాలో అధిక శాతం ప్రజలకు శిశు సంరక్షణపై అంతగా అవగాహన లేదు. పిల్లల సంరక్షణలో వాళ్ళకు తెలిసినవి మామూలు మొద్దు మార్గాలే.

స్వీడన్‌ లాంటి దేశంలో విద్య, వైద్యం ఉచితం. ప్రభుత్వం పిల్లలను దేశ సంపదగా పరిగణిస్తుంది. శారీరక, మానసిక ప్రత్యేకతలు ఉన్న పసిపిల్లలకు నిద్ర, సంగీతం, మేధో ప్రేరణ, మానసిక ఉల్లాసం, మాట, ఆటల కోసం అత్యంత ఆధునిక యంత్ర సౌకర్యాలతో ప్రత్యేక పాఠశా లలు ఉంటాయి. నలుగురు పిల్లలకు ఐదుగురు శిక్షణపొందిన మానసిక నైపుణ్య ఉపాధ్యాయులు ఉంటారు. వీరు వృత్తి రీత్యానేగాక, ప్రవృత్తి పరంగానూ మానవత్వంతో పసిపిల్లలను తల్లిదండ్రుల కంటే బాగా చూడగలరు.

మానసిక ఆరోగ్యం, శిశురక్షణ, పిల్లల భద్రత, పాలన, పోషణ వంటి సున్నిత విషయాలను పౌర సమాజం ప్రచారం చేయాలి. ప్రజాపక్ష రాజకీయ పక్షాలు వీటిని తమ పాలనా విధానాలుగా ప్రకటించాలి. - సంగిరెడ్డి హనుమంత రెడ్డి, ఆల్‌ ఇండియా ప్రోగ్రెసివ్‌ ఫోరం జాతీయ కార్యదర్శి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement