నేడు ప్రపంచ కవలల దినోత్సవం | World Twins Day | Sakshi
Sakshi News home page

నేడు ప్రపంచ కవలల దినోత్సవం

Feb 22 2026 9:23 AM | Updated on Feb 22 2026 9:23 AM

World Twins Day

అనంతపురం కల్చరల్‌/గుత్తి రూరల్‌: ఒకే పోలిక.. ఒకే డ్రెస్‌. అచ్చం ఒకరిని చూస్తే మరొకరిని చూసినట్లే! జిరాక్స్‌ టూ జిరాక్స్‌... ఇలా చెప్పుకుంటూ పోతే కవలల గురించి ఎన్నో అంశాల్ని పోల్చి చెప్పినా తక్కువే అవుతుంది. తల్లిగర్భంలో ఒకేసారి, ఒకే రూపంతో మొదలై.. క్షణాల వ్యవధిలో బయటి ప్రపంచానికి పరిచయమై.. ఒకే ముఖకవళికలతో అందరినీ అమితంగా ఆకట్టుకోవడం కవలల ప్రత్యేకత. ముద్దులొలికే పసికందులను చూడగానే వారి పేర్లను కూడా దరిదాపు ఒకేలా పెట్టేయడం పరిపాటిగా మారింది. రామయ్య.. లక్ష్మయ్య, రమేష్‌.. నరేష్‌ జలజ.. శైలజ లాంటి పేర్లతోనూ తికమక పట్టించేస్తుంటారు. ప్రపంచ కవలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సాక్షి’ ప్రత్యేక కథనం.  

సైన్స్‌ ఏమి చెబుతోందంటే.. 
సృష్టి లోని ఎన్నో వింతలు, అద్భుతాల్లో కవలల జననం కూడా ఒకటిగా ఉంటోంది. బాగా తెలిసిన వారు సైతం కవలలను ఎవరెవరో పోల్చుకోవడం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఫలదీకరణ సమయంలో వచ్చే మార్పుల కారణంగా కవలల జననం సంభవిస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు.  ప్రత్యుత్పత్తి ప్రక్రియలో అండం ఏర్పడిన తర్వాత శుక్రకణం రెండుగా విడిపోయి జని్మంచిన కవలలను మోనోజైగోటిక్‌ లేదా యూని ఓవిలార్‌ ట్విన్స్‌ అంటారు. వీరిలో ఇద్దరూ ఆడ లేదా, మగ అయి ఉంటారు. వీరికి చాలా దగ్గర పోలికలుంటాయి. రెండు శుక్ర కణాలు ఏర్పడి జని్మంచే కవలలను ‘డై జైగోటిక్‌ లేదా బైనోవిలార్‌ ట్విన్స్‌ అంటారు. వీరిలో ఒకరు ఆడ, మరొకరు మగ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.  

కవలల దినోత్సవ ఆవిర్భావమిలా.. 
ప్రథమంగా కవలల దినోత్సవాన్ని పోలెండు దేశస్థులు 1976లో నిర్వహించారు. మోజెస్, విల్‌కాక్స్‌ అనే కవల సోదరులు తాము నిసిస్తున్న ఊరికి ‘ట్విన్స్‌ బర్గ్‌’ అని పేరుపెట్టుకున్నారు. కవలలనే పెండ్లాడి, మళ్లీ కవలలకే జన్మనిచ్చారు. దురదృష్టమైన విషయమేమంటే ఒకే రకమైన వ్యాధి సోకి వారిద్దరూ ఒకే రోజు మరణించారు. వీరి గుర్తుగా ప్రతి ఫిబ్రవరి 22న అంతర్జాతీయ కవలల దినం జరపడం పరిపాటిగా మారింది.  

అభిరుచులు ఒక్కటే 
అనంతపురం నగరానికి చెందిన మల్లికార్జునరెడ్డి, రాధ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరికి ఓ బాబు తర్వాత 2012లో కవలలు జన్మించారు. సాయి సహస్ర, సాయి సమన్వి అని పేర్లు పెట్టారు. పెరుగుతున్న కొద్దీ కాసింత పోలికలు వేరైనా అభిరుచులు, ఇష్టాలు మాత్రం ఒక్కటేనని తల్లిదండ్రులు అంటున్నారు.  

ఇద్దరూ మొండిఘటాలే 
తాడిపత్రి పట్టణానికి చెందిన షేక్‌ నాజియా, షేక్‌ బాబాఫకృద్ధీన్‌ దంపతుల పిల్లలు మన్నత్‌ అఫ్రా, మన్నత్‌ అష్మరాను చూస్తే ఎవరు ఎవరో గుర్తు పట్టడం చాలా కష్టం. ఇద్దరూ మొంటి ఘటాలే.  డ్రస్సులు, ఆభరణాలు ఏదీ కొన్నా ఇద్దరికీ ఒకేలా ఉండాలి. భోజనం, అల్పాహారం కూడా సేమ్‌ టు సేమ్‌ ఉండాలి. లేకపోతే గొడవ చేసేస్తారు. ఇద్దరూ ఒకేసారి అస్వస్థతకు గురవుతుంటారు. ఏ పని చేసినా ఇద్దరు ఒకేలా చేస్తారు.

పెరుగుతున్న కొద్దీ మార్పులొచ్చాయి
అనంతపురానికి చెందిన మెహబూబా, అబ్ధుల్‌ షమీ దంపతుల కుమారులు మహమ్మద్‌ అజ్మల్, మహమ్మద్‌ అక్మల్‌ చిన్నప్పుడు బాగా దగ్గరి పోలికలుండడంతో గుర్తు పట్టడం కష్టమయ్యేది. పెరుగుతున్న కొద్ది కాసింత గుర్తు పట్టేలా మారిపోయారు. ఆటల్లో అక్మల్, అందరినీ ఆట పట్టించడంలో అజ్మల్‌ చురుగ్గా ఉంటారు. అయితే ఆలోచనల్లో మాత్రం ఇద్దరూ ఒకేలా ఉంటారని తల్లిదండ్రులంటున్నారు.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement