
పాత రాతియుగాన్ని చదువుకున్నాం... శిలాయుగాన్ని కూడా తెలుసుకున్నాం. ఆ కాలంలో ఏమేమి ఉన్నాయి? బ్రహ్మ కట్టిన తిరునెల్లి ఆలయం ఉంది. ఇంకా ఇంకా చాలా చాలా ఉన్నాయి. వాటిని చూడాలంటే... అరక్కల్... అంబల్వాయల్ మ్యూజియాలకు కళ్లప్పగించాలి. ఎడక్కల్ గుహల్లో ఎనిమిదివేల ఏళ్ల నాటి బొమ్మలను తాకి చూడాలి. మోడరన్ హిస్టరీ చెప్పిన పాఠాలకు ఆనవాళ్లుగా... ఏమేమి ఉన్నాయి? డచ్ కట్టడాలు... పోర్చుగీసు నిర్మాణాలు... బ్రిటిష్ కాలపు టెలిఫోన్లు. వాటిని చూడాలంటే ఏం చేయాలి?... వయనాడుకు ప్రయాణమవ్వాలి. ఎరుపెక్కిన కళ్లతో కప్పడ్ బీచ్లో వాస్కోడిగామా స్మారకాన్ని చూడాలి. గాంధీజీ జాతీయోద్యమ స్ఫూర్తిని రగిలించిన కాల్పెట్టలో బస చేయాలి. ఫారెస్ట్కు అర్థవంతమైన నిర్వచనం చెప్తున్న కురువద్వీపంలో అడుగుపెట్టాలి. పూకోద్ సరస్సులో కలువల మధ్య పడవ ప్రయాణం చేయాలి. భవిష్యత్తు తరాల కోసం ప్రకృతిని గౌరవిస్తూ ముందుకుసాగాలి. ‘వండర్స్ ఆఫ్ వయనాడ్’ ఐఆర్సీటీసీ ప్యాకేజ్ సిద్ధంగా ఉంది.సెలవులు వస్తున్నాయి... కేరళలో పర్యటనకు ప్లాన్ చేసుకోండి.
మొదటి రోజు..
ఉదయం ఆరుగంటల సమయంలో 12789 నంబరు కాచిగూడ–మంగళూరు సెంట్రల్ ఎక్స్ప్రెస్ కాచిగూడ నుంచి బయలుదేరుతుంది.
రెండోరోజు
ఉదయం ఆరు గంటల సమయంలో రైలు కన్నూరుకు చేరుతుంది. రైలు దిగి రైల్వే డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన హోటల్కు చేరుకుని ఫ్రెష్ అప్ అయ్యి ఉపహారం తిన్న తర్వాత సైట్ సీయింగ్కి బయలుదేరాలి. ఏంజిలో ఫోర్ట్, అరక్కల్ మ్యూజియం చూసుకున్న తర్వాత ప్రయాణం వయనాడు వైపు సాగుతుంది. దారిలో అందమైన ప్రకృతి దృశ్యాలను ఆస్వాదిస్తూ వయనాడు, కాల్పెట్టలోని హోటల్లో చెక్ ఇన్ అవ్వాలి. రాత్రి బస అక్కడే.
ఇక్కడికి గాంధీజీ వచ్చాడు!
కన్నూర్ కోట (సెయింట్ ఏంజిలో ఫోర్ట్) పోర్చుగీసు, డచ్వాళ్ల పాలన సాగించిన ప్రదేశం. అరక్కల్ మ్యూజియం కన్నూరు సిటీకి మూడు కిలోమీటర్ల దూరాన ఉంది. అరక్కల్ రాజవంశం నివసించిన ప్యాలెస్ అది. వాళ్లు ఉపయోగించిన ఫర్నిచర్ డిజైన్లు ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్గా సంపన్నవర్గాల ఇళ్లలో కనిపిస్తున్నాయి. బ్రిటిష్పాలన కాలంనాటి టెలిఫోన్ కూడా ఉంది.
రాత్రి బస చేస్తున్న కాల్పెట్ట అందమైన హిల్స్టేషన్. దట్టమైన అటవీ ప్రదేశం కూడా. కేరళలో భారత జాతీయోద్యమం పురుడుపోసుకున్న ప్రదేశం ఇది. ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తినింపడానికి గాంధీజీ 1934లో ఈ ప్రదేశాన్ని సందర్శించాడు.
మూడోరోజు
ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత సైట్ సీయింగ్కి బయలుదేరాలి. కురువ ద్వీప్, తిరునెల్లి ఆలయం, బాణాసుర సాగర్ డ్యామ్ చూసుకుని హోటల్కి చేరాలి. ఆ రాత్రి బస కూడా కాల్పెట్టలోనే.
బ్రహ్మ కట్టిన ఆలయం
కురువద్వీపంలో విహారం మరో ప్రపంచంలోకి వెళ్లినట్లు ఉంటుంది. కబిని నది ఉపనదుల ప్రవాహం మధ్యలో ఏర్పడిన వెయ్యి ఎకరాల దీవి ఇది. పచ్చదనాన్ని పుష్పగుచ్ఛంగా ఒకచోట రాశి΄ోసినట్లుంటుంది. ఇక్కడ అరుదైన పక్షులు కనిపిస్తాయి. తిరునెల్లి ఆలయం ఓ విశిష్టత. దీని గురించి చారిత్రక ఆధారాలేవీ దొరకట్లేదు. పౌరాణిక ఆధారాల ప్రకారం వేదవ్యాసుడు రాసిన పురాణాల్లో విష్ణువు కోసం బ్రహ్మ భూమ్మీద నిర్మించిన ఆలయం అని తెలుస్తోంది.
లొకేషన్ సెలెక్ట్ చేయడానికి బ్రహ్మదేవుడు తన వాహనం హంస మీద భూమండలం అంతా పర్యటిస్తూ ఈ ప్రదేశాన్ని చూసి ముచ్చటపడ్డాడని, ఇక్కడే ఆలయాన్ని నిర్మించాడని, ఈ కొండకు బ్రహ్మగిరి అనే పేరు రావడానికి కారణం అదేనని చెబుతారు. ఆలయాన్ని నిర్మించే వరకు తనతో తెచ్చిన విగ్రహాన్ని ఉసిరి చెట్టులో దాచడంతో ఈ ఆలయానికి నెల్లి అనే పేరుతో తిరునెల్లి ఆలయం అనే పేరు వచ్చింది.
పది–పదకొండు శతాబ్దాల్లో చేరరాజు భాస్కర రవివర్మ పాలించిన నాటికే ఇది గొప్ప యాత్రాస్థలంగా ప్రాచుర్యంలో ఉంది. ఇక్కడ ప్రాచీన కాలం నాటి గ్రామాల ఆనవాళ్లను కూడా చూడవచ్చు. ఆ తర్వాత చూడాల్సిన బాణాసుర సాగర్ డ్యామ్ రెండువేల అడుగుల పొడవుతో దేశంలోనే అతి పెద్ద ఎర్త్డ్యామ్. జల విద్యుత్ తయారీ కేంద్రాన్ని కూడా చూడవచ్చు.
నాల్గోరోజు
బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అంబలవాయల్ హెరిటేజ్ మ్యూజియం, సూచిపారా జలపాతం, ఎడక్కల్ గుహలు, పూకోద్ సరస్సులో విహారం తర్వాత తిరిగి హోటల్కు చేరాలి. ఆ రాత్రి బస కూడా కాల్పెట్టలోనే.
రాతియుగాన్ని చూసొద్దామా!
ఇది వయనాడ్ హెరిటేజ్ మ్యూజియం, అంబలవాయల్ అనే ప్రదేశంలో ఉండడంతో ఆ పేరు వచ్చింది. ఇందులో రాతియుగం నాటి పదునైన రాతి ఆయుధాలు, 14 నుంచి 16వ శతాబ్దం నాటి శిల్పాలు, మృణ్మయపాత్రలు, టెర్రకోట శిల్పాలు ఉంటాయి. ఇక ఎడక్కల్ గుహలు కాల్పెట్టకు 25 కి.మీ.ల దూరంలో ఉన్నాయి. వీటి వింత ఏమిటంటే... ఇవి నేలమీద విస్తరించిన గుహలు కావు. ఎవరూ పనిగట్టుకుని తొలిచినవీ కాదు. దాదాపు నాలుగు వేల అడుగుల ఎత్తులో సహజంగా ఏర్పడిన గుహలు.
ఈ గుహల్లో కనిపించే బొమ్మలు క్రీస్తు పూర్వం ఆరువేల ఏళ్ల నాటివని అంచనా. ఈ రోజు చివరగా పూకోద్ సరస్సులో పడవ విహారంతో సేదదీరడమే. ఈ సరస్సు దాదాపు ఎనిమిది వందల మీటర్ల ఎత్తులో కొండల మీద ఏడెనిమిది ఎకరాల్లో విస్తరించి ఉంది. వర్షపునీరు కొండ కోనల నుంచి ఇక్కడికి చేరుతుంది. సరస్సు నిండిన తర్వాత నీరు కిందకు ప్రవహించి పనమారమ్ నదిగా మారుతుంది. ఈ నది కబిని నదిలో కలుస్తుంది. ఈ సరస్సులో కలువలు విరివిగా ఉంటాయి. అందుకే దీనికి పూలతీరం అనే అర్థంలో పూకోద్ అనే పేరు వచ్చింది.
ఐదోరోజు
ఉదయం బ్రేక్ఫాస్ట్ పూర్తయిన తర్వాత హోటల్ గది చెక్ అవుట్ చేసి బయలుదేరాలి. ప్రయాణం కోళికోద్ వైపు సాగుతుంది. దారిలో కప్పడ్ బీచ్ విహారం. సాయంత్రం ఎస్ఎమ్ స్ట్రీట్లో షాపింగ్ కోసం సమయం ఉంటుంది. షాపింగ్ తర్వాత కోళికోద్ రైల్వే స్టేషన్కి వెళ్లి రైలెక్కాలి. 12790 నంబరు మంగళూరు సెంట్రల్ – కాచిగూడ ఎక్స్ప్రెస్ రాత్రి 11.35 నిమిషాలకు బయలు దేరుతుంది. 24 గంటల తర్వాత ఆరవ రోజు రాత్రి 11.40కి కాచిగూడకు చేరుతుంది.
వాస్కోడిగామా అడుగుపెట్టాడు!
కప్పడ్ బీచ్ అంటే ΄ోర్చుగీసు నావికుడు వాస్కోడిగామా మన దేశానికి సముద్ర మార్గాన్ని అన్వేషించి మన నేల మీద పాదం మోపిన ప్రదేశం. ఇది 1498లో జరిగింది. భారతీయుల్లో జాతీయోద్యమ స్ఫూర్తిని రగిలించడానికి గాంధీజీ 1934లో కాల్పెట్టలో అడుగుపెట్టడానికి కారణమైన సంఘటన అన్నమాట. కష్టంగా అయినా నిష్టూరంగా అయినా ఈ ప్రదేశాన్ని చూడాల్సిందే, వదిలేయడానికి వీల్లేదు. గుడ్లు పెట్టి పిల్లలను పొదగడానికి ఇక్కడికి వచ్చే తాబేళ్లను చూడడానికైనా కప్పడ్ బీచ్ని కవర్ చేయాలి.
అలాగే సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తూ ప్రశాంతంగా సముద్రతీరాన గడపడానికి ఇది మంచి ప్రదేశం. ఇక చివరగా కోళికోద్ పట్టణంలోని ఎస్ఎమ్ స్ట్రీట్లో షాపింగ్ కోసం సమయం ఇస్తారు. వాహనం దిగి మార్కెట్ అంతటా కాలి నడకన తిరగాలి. ఏం కొన్నా కొనక΄ోయినా కోళికోద్ హల్వా తప్పకుండా రుచి చూడాలి. బంధువులు, స్నేహితుల కోసం ఇంటికి తెచ్చుకోవాలి. దీంతో ఈ టూర్ తీపి జ్ఞాపకపు రుచి కలకాలం గుర్తుంటుంది.
వండర్స్ ఆఫ్ వయనాడ్ (ఎస్హెచ్ఆర్ 098) ప్యాకేజ్లో...
ఇవి ఉంటాయి
స్టాండర్డ్ ప్యాకేజ్లో స్లీపర్ క్లాస్లో ప్రయాణం. కంఫర్ట్ ప్యాకేజ్లో థర్డ్ ఏసీలో ప్రయాణం. రైలు దిగిన తరవాత లోకల్ జర్నీ ఏసీ వాహనంలో ఉంటుంది. ట్రావెల్ ఇన్సూరెన్స్. టోల్ ఫీజ్, పార్కింగ్ ఫీజులు ప్యాకేజ్లోనే. రాత్రి బస చేసిన హోటల్లో ఉదయం బ్రేక్ఫాస్ట్ ఉంటుంది.
ఇవి వర్తించవు
మధ్యాహ్నం, రాత్రి భోజనాలు. రైలు ప్రయాణంలో భోజనాలు, సైట్ సీయింగ్ ప్రదేశాల ఎంట్రీ టికెట్ చార్జ్లు, బోటింగ్, హార్స్ రైడింగ్ వంటి రిక్రియేషనల్ టికెట్ ఫీజులు, గైడ్ చార్జ్లు, ఇతర సర్వీసులు పర్యాటకులే భరించాలి. కొన్ని ప్రైవేట్ టూర్ ప్యాకేజ్లు ట్రీ హౌస్లో రాత్రి బస ఏర్పాటు చేస్తున్నాయి.
వండర్స్ ఆఫ్ వయనాడ్
టికెట్ ధరలిలా
సింగిల్ ఆక్యుపెన్సీలో (ఒక్కొక్కరికి ఒక్కో గది) కంఫర్ట్ ప్యాకేజ్ 37, 640 రూపాయలు, స్టాండర్డ్ ప్యాకేజ్కి 34, 840 రూపాయలు.
డబుల్ ఆక్యుపెన్సీలో (ఇద్దరికి ఒక గది) ఒక్కొక్కరికి కంఫర్ట్ ప్యాకేజ్ 21,220 రూపాయలు, స్టాండర్డ్ ప్యాకేజ్లో 18,430 రూపాయలు.
ట్రిపుల్ ఆక్యుపెన్సీలో (ముగ్గురికి ఒక గది) ఒక్కొక్కరికి కంఫర్ట్ ప్యాకేజ్ 17,740 రూపాయలు, స్టాండర్డ్ ప్యాకేజ్లో 14,950 రూపాయలు.
(చదవండి: ఏకంగా ఆన్లైన్లోనే మట్టిని అమ్మేస్తున్నారు..!)