Vaisakha Masam పర్వదినాల వైశాఖ : ఎన్ని విశేషాలో! | Vaisakha Masam 2025 check these important days | Sakshi
Sakshi News home page

Vaisakha Masam పర్వదినాల వైశాఖ : ఎన్ని విశేషాలో!

Apr 24 2025 12:06 PM | Updated on Apr 24 2025 12:47 PM

Vaisakha Masam 2025 check these important days

28, సోమవారం నుంచి మే 27, మంగళవారం వరకు వైశాఖమాసంసంవత్సరంలోని అన్ని మాసాలూ విశిష్టమైనవే అని చాటి చెప్పే గొప్ప సంస్కృతి మనది. శ్రీమన్నారాయణునికి అత్యంత ప్రీతికరమైన వైశాఖమాసంలో స్నానానికి, దానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ వైశాఖమాసంలో ప్రతిరోజూ పుణ్యతీర్థాల్లో స్నానం చేయటం విశేష ఫలితాన్నిస్తుందని పద్మపురాణం చెబుతోంది.  

నెలంతా స్నానం చేయలేనివారు కనీసం శుక్లపక్ష త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ తిథుల్లో స్నానం చేసినా సకలపాపాల్ని నివృత్తి అవుతాయి. స్నానం తర్వాత త్రికరణశుద్ధిగా విష్ణుపూజ చేయాలి.  అట్లాగే యథాశక్తి ఏకభుక్తం, నక్తం ఆచరించేవారికి కోరిన కోరికలన్నీ సిద్ధిస్తాయని వైశాఖ పురాణం చెబుతోంది.  పాలిచ్చే ఆవును, పాదుకలు, చెప్పులు, గొడుగు, విసనకర్ర, అన్ని సౌకర్యాలతో కూడిన శయ్య, దీపం, అద్దం– ఇవన్నీ గురువుకి దానంగా ఇవ్వాలి.  అశక్తులైనవారు చలివేంద్రాలు నిర్వహించటం, పరమశివునికి నిరంతరాయంగా అభిషేకం జరిగే ఏర్పాట్లు చేయడం, పితృదేవతల తృప్తి కోసం చెప్పులు, గొడుగు, పల్చని వస్త్రాలు, చందనం, పూలు, పండ్లు, ఇంకా నీటితో నింపిన కుండని దానం చేయటం అన్ని విధాలా మేలుని కలిగిస్తుంది.


ఈ మాసం ఈ పర్వదినాలు... 

అక్షయతృతీయ...
వైశాఖ శుద్ధ తృతీయను అక్షయ తృతీయ అంటారు.  ఈరోజున చేసే పూజలు, హోమం, దానం, పితృ తర్పణం అక్షయమైన పుణ్యఫలాన్ని ఇస్తాయి కాబట్టే దీనికా పేరొచ్చింది. ఈ పర్వదినాన నీటితో నింపిన కుండ, గోధుమలు, శనగలు  ధాన్యాలు, పెరుగన్నం దానం చేయటం వల్ల శాశ్వతంగా శివ సాయుజ్యాన్ని పొందవచ్చని పురాణోక్తి. అదేవిధంగా గొడుగు, ΄ాదరక్షలు, గోవు, భూమి, బంగారం, వస్త్రాలను దానం చేయటం ఎంతో పుణ్యప్రదం.

పరశురామ జయంతి...
శ్రీమహావిష్ణువు పరశురామునిగా అవతరించిన వైశాఖ శుద్ధ తదియ పరశురామ జయంతిగా చెప్పబడుతోంది. వైశాఖ శుక్ల తృతీయ నాడు పునర్వసు నక్షత్రంలో రాత్రి సమయంలో సాక్షాత్తూ ఆ హరియే పరశురాముడిగా రేణుకా గర్భం నుండి స్వయంగా అవతరించాడు. అంతటి మహా తపశ్శాలి జయంతిని మనం యుగయుగాలుగా జరుపుకుంటున్నాం. ఈరోజు ఉపవాసం చేసి ప్రదోషకాలంలో పరశురాముని షోడశోపచారాలతో పూజించిన వారికి శత్రు పీడ ఉండదని వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. 

గంగోత్పత్తి...
గంగోత్పత్తి అంటే గంగాదేవి ఆవిర్భవించటం లేదా అవతరించటం. వైశాఖ శుక్ల సప్తమిన గంగోత్పత్తి అని పృథ్వీచంద్రోదయ గ్రంథం చెబుతోంది. వైశాఖ శుక్ల సప్తమిన జహ్ను మహర్షి కోపంతో గంగను తాగాడు. తన కోపం చల్లారాక మళ్ళీ కుడిచెవి నుండి వదిలిపెట్టాడు.  ఈ కారణంగా ఈ రోజున గంగానదిలో స్నానం చేయటం చెప్పలేనంత ఫలితాన్ని ఇస్తుంది. కనీసం గంగాదేవిని స్మరిస్తూ పుణ్య నదుల్లో పవిత్ర స్నానం చేస్తే కూడా మంచి ఫలితాన్ని పొందవచ్చు. అదీ వీలు కానప్పుడు చెరువు వద్ద లేదా కాలువ వద్ద గంగను ధ్యానిస్తూ స్నానాలాచరించవచ్చు. 

హనుమజ్జయంతి...
శ్రీరామ భక్తాగ్రేసరుడైన హనుమంతుడు – చైత్ర పౌర్ణమినాడు జన్మించినట్లు పలు గ్రంథాలు  చెబుతున్నాయి. కాగా పరాశర సంహిత  వైశాఖ బహుళ దశమిని ఆంజనేయుడి జన్మదినంగా పేర్కొంటోంది. అందుకే దక్షిణ భారతదేశంలో వైశాఖ బహుళ దశమినాడు హనుమజ్జయంతి జరుపుకుంటూ ఉండగా, ఉత్తర భారతదేశంలో చైత్ర పౌర్ణమిని హనుమజ్జయంతిగా భావించి వేడుకలు జరుపుతారు. ఈరోజున ఆంజనేయస్వామిని పూజించటం వలన గ్రహ దోషాలు నివారించబడతాయి. ఇంకా భూత, ప్రేత, పిశాచాల పీడలు తొలగి, గాలి చేష్టలు వంటి మానసిక రుగ్మతలు కూడా తొలగిపోతాయి. హనుమజ్జయంతినాడు సుందరకాండ, హనుమాన్‌ చాలీసాపారాయణ చేయడం మంచిది. ఈ రోజు శ్రీ సీతారామచంద్రులను పూజించడం వల్ల హనుమంతుని అనుగ్రహాన్ని శీఘ్రంగా పొందవచ్చు. 

నృసింహ జయంతి...
వైశాఖ శుద్ధ చతుర్దశినాటి సాయంకాలం నరసింహమూర్తి హిరణ్యకశిపుని వధించేందుకు ఆవిర్భవించాడని పురాణాలు చెబుతున్నాయి. నృసింహ జయంతినాడు బ్రహ్మ ముహూర్తంలో లేచి  స్నానం చేసి స్వామికి షోడశోపచార పూజ జరిపి,  శ్రీ నృసింహస్తోత్రం–శ్రీ నృసింహ సహస్ర నామ జపం చేసిపానకం–వడపప్పు, చక్ర పొంగలి–దద్ధ్యోదనం నివేదిస్తే స్వామి వారి అనుగ్రహంతో సర్వసంపదలు లభిస్తాయని ప్రతీతి.  

వైశాఖ పూర్ణిమ– బుద్ధ పూర్ణిమ...
లోకంలోని ప్రజల దుఃఖ నివారణకోసం, శాంతిని నెలకొల్పటం కోసం గౌతముడు శుద్ధోదన చక్రవర్తికి, మహామాయకు జన్మించిన వైశాఖ శుద్ధ పూర్ణిమకే బుద్ధజయంతి అని పేరు. గౌతముడు బుద్ధుడిగా పరివర్తన చెందిన ఈ రోజుకే బుద్ధపూర్ణిమ అని కూడా పేరు.

వైశాఖ శుద్ధ దశమి –  శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి... 
తెలుగు రాష్ట్రాల్లోని హిందువులకు మరీ ముఖ్యంగా ఆర్యవైశ్యులకు వారి కులదైవం అయిన వాసవీ మాత ఎంతో ముఖ్యం. అలాంటి వాసవి జయంతి వైశాఖ శుద్ధదశమి నాడు, సాక్షాత్తు ఆ పరమేశ్వరి అవతారమైన వాసవీదేవి సుమారు వెయ్యేండ్ల క్రితం పెనుగొండలో ‘కుసుమ శ్రేష్టి’, కుసుమాంబ పుణ్యదంపతులకు వైశాఖ శుద్ధ దశమి, శుక్రవారం నాడు జన్మించింది.

వైశాఖ శుద్ధ ఏకాదశి – మోహినీ ఏకాదశి...
ఈ మాసంలో వచ్చే ఏకాదశినే మోహిని ఏకాదశి అని అంటారు. ఈ రోజు ఏకాదశి వ్రతం ఆచరించినవారికి మహావిష్ణువు అక్షయంగా సంపదలు ఇస్తాడని, వారు ఇహలోక ఆనందాన్ని అనుభవించిన పిమ్మట వారికి విష్ణు లోక ప్రవేశం కలుగుతుందని పురాణ వచనం.

వైశాఖ పూర్ణిమ – మహావైశాఖి...
వైశాఖ పూర్ణిమకి మహావైశాఖి అని పేరు. దశావతారాల్లో ద్వితీయ అవతారమైన కూర్మరూపాన్ని శ్రీమహావిష్ణువు ఈనాడే ధరించాడు. ఈ వేళ శ్రీకూర్మరూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువును పూజించడం సత్ఫలితాలనిస్తుంది.

వైశాఖ శుద్ధ పూర్ణిమన్నమయ్య జయంతి...
తెలుగులో తొలి వాగ్గేయకారుడు, సంకీర్తనాచార్యుడు, కలియుగదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి 32 వేల కవితలతో సంకీర్తనలు సమర్పించిన పద కవితా పితామహుడు తాళ్ల΄ాక అన్నమాచార్యుడు సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు నందక ఖడ్గం అంశగా నారాయణసూరి, లక్కమాంబ దంపతులకు జన్మించిన పర్వదినం వైశాఖ శుద్ధ పౌర్ణమినాడు తిరుమల తిరుపతి దేవస్థానంలో పెద్ద ఎత్తున అన్నమయ్య జయంతి వేడుకలను అత్యంత వైభవంగా జరుపుతారు.

శంకర జయంతి... రామానుజ జయంతి...
వైశాఖ శుద్ధ పంచమి జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు, రామానుజాచార్యుల వారు జన్మించిన అత్యంత విశిష్టమైన తిథి. ఈ రోజున వైష్ణవులు తప్పనిసరిగా రామానుజుల జయంతిని వైభవంగా జరుపుకుంటే, వైదిక మతానుసారులు శంకర జయంతిని చాలా నిష్ఠగా జరుపుకుంటారు.  

వైశాఖ బహుశ విదియ– నారద జయంతి...
బ్రహ్మ మానస పుత్రుడు, పరమ భాగవతోత్తముడు, సకల శాస్త్ర పారంగతుడు, సంగీత కోవిదుడు, అనుక్షణం నారాయణ నామస్మరణతో ఆనంద పారవశ్యుడయ్యే నారదుడు పుట్టిన ఈ పర్వదినాన ఆయన పేరు మీదుగాపాత్రికేయులకు పురస్కారాలు ప్రదానం చేయడం ప్రతీతి. నారాయణ లోక కల్యాణం కోసం కలహ భోజనుడిగా పేరు తెచ్చుకున్న నారద మహర్షిని స్మరించు కోవడం చాలా మంచిది.

వైశాఖ బహుళ ఏకాదశి– నిర్జల ఏకాదశి...
ఈరోజు చుక్క నీటిని కూడా తాగకుండా ఉపవసించిన వారి పట్ల ప్రసన్నుడై శ్రీ మహావిష్ణువు సకల సంపదలు కలిగించి, అంతిమాన మోక్షం ప్రసాదిస్తాడని ప్రతీతి. 

వైశాఖ శుద్ధ దశమి– అన్నవరం సత్యదేవుని కల్యాణ మహోత్సవం...
తిరుమల తరువాత అంతటి మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం, కోరిన వరాలిచ్చే సత్యదేవుడు కొలువైన దివ్యక్షేత్రం అన్నవరం. శ్రీ అనంతలక్ష్మీ రమాదేవి అమ్మవార్లతో కలిసి రత్నగిరిపై (అన్నవరం కొండ)పై శ్రీ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి కొలువైన ఈ పుణ్య స్థలంలో వెశాఖ శుద్ధ దశమినాడు సీతారాములే పెళ్లిపెద్దలుగా సత్యదేవుని వివాహం కన్నుల పండువగా జరుగుతుంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement