
ఊ...!‘టీ’... తాగుదాం!!
ఊటీలో తేయాకు తోటలున్నాయి. వందలాది గులాబీల తోట ఉంది. బొటానికల్ గార్డెన్లో శిలాజవృక్షం ఉంది. ఏడు వేల
అడుగుల ఎత్తులో సరస్సు.ఎనిమిది వేల అడుగుల్లో పర్వత శిఖరం. ఊటీ అంటే... యాభై ఏళ్ల కిందటబాలీవుడ్ హీరో హీరోయిన్లు... యుగళగీతాలు పాడిన నేల.. టాలీవుడ్... పాటల తోట. రకరకాల టీల రుచిని ఆస్వాదిస్తూ
ఊ... టీ తోటల్లో విహరిద్దాం.
1వ రోజు మధ్యాహ్నం 12.20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్ నంబర్ 17230, శబరి ఎక్స్ప్రెస్ బయలుదేరుతుంది. ప్రయాణం రాత్రంతా సాగుతుంది.
2వ రోజు ఉదయం (07.57గంటలకు) రైలు కోయంబత్తూరుకి చేరుతుంది. రైలు దిగి రోడ్డు మార్గాన ఊటీకి బయలుదేరాలి. హోటల్లో చెక్ ఇన్ అయ్యి, రిఫ్రెష్ అయిన తర్వాత బొటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్లో విహరించి రాత్రికి హోటల్కి చేరడం. రాత్రి బస ఊటీలోనే.
3వ రోజు: బేక్ఫాస్ట్ తరవాత దొడబెట్ట శిఖరం, టీ మ్యూజియం, పైకారా ఫాల్స్ సందర్శనం తర్వాత హోటల్కు చేరడం. ఆ రాత్రి బస కూడా ఊటీలోనే.
4వ వ రోజు : బ్రేక్ఫాస్ట్ తర్వాత కూనూరు సైట్ సీయింగ్కి వెళ్లాలి. తిరిగి ఊటీకి వచ్చి హోటల్కి చేరి విశ్రాంతి. షాపింగ్ చేసుకోవచ్చు.
5వ రోజు : బ్రేక్ఫాస్ట్ తర్వాత కొంత సమయం ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ విశ్రాంతిగా ఫొటో షూట్ చేసుకుంటూ గడిపిన తర్వాత మధ్యాహ్నం గది చెక్ అవుట్ చేసి కోయంబత్తూరుకు బయలుదేరాలి. ట్రైన్ నంబర్ 17229 శబరి ఎక్స్ప్రెస్ 15.55 గంటలకు కోయంబత్తూరు స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. ఆ రైలు సికింద్రాబాద్కి ఆరవ రోజు మధ్యాహ్నం 12.45 గంటలకు చేరుతుంది.
బ్రిటిష్ కాలం నాటి ఉద్యానవనం ఊటీకి ఎందుకెళ్లాలి? ఊటీలో టీ తోటలు తప్ప ఏమున్నాయ్ చూడడానికి? అనే పెదవి విరుపులు ఉంటాయి. కానీ ఊటీలో చూసి తెలుసుకోవాల్సినవి, ఆస్వాదించాల్సినవి చాలా ఉన్నాయి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన బొటానికల్ గార్డెన్స్ ఉన్నాయి. దీనిని కలయ తిరిగి చూడడం ఆహ్లాదంతోపాటు బోనస్గా విజ్ఞానం కలుగుతుంది. ఇది 54 ఎకరాల గార్డెన్స్ సముదాయం. బ్రిటిష్ పాలన కాలం నాటిది. తమిళనాడు ప్రభుత్వం చక్కగా నిర్వహిస్తోంది. చెట్లలో ఆరు వందల రకాలున్నాయి. గార్డెన్స్ మధ్యలో ఫాజిల్డ్ ట్రీ ట్రంక్ (శిలాజ వృక్షం) ఉంది. రెండు కోట్ల సంవత్సరాల కిందట జీవించిన వృక్షం అది. ఔషధ వృక్షాలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. ఇటాలియన్ గార్డెన్, న్యూ గార్డెన్, లోయర్ గార్డెన్, ఫౌంటెయిన్ టెర్రస్ గార్డెన్ ఇలా రకరకాలుగా విభజించి ఉంటుంది. ఫాజిల్ ట్రీ ట్రంక్ లోయర్ గార్డెన్లో ఉంది.
తెలుగు పాటల తోట
కూనూరు పట్టణం ఊటీకి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని ఒకప్పటి తెలుగు సినిమాపాటల చిత్రీకరణ కేంద్రం అనవచ్చు. సినిమా కథలో సన్నివేశాలు ఊటీలో చిత్రీకరించి, పాటలకు మాత్రం కూనూరుకు వచ్చేవాళ్లు తెలుగు దర్శకులు. అప్పట్లో ఊటీ, కూనూరు... ఈ రెండు ప్రదేశాలనూ ఊటీగానే పరిగణిస్తూ సినిమా పాటల చిత్రీకరణ కోసం ఊటీ వెళ్తున్నట్లు దర్శకులు చెప్పేవారు. ఈ ప్రదేశం బ్రిటిష్ కాలనీని తలపించేది. యూరోపియన్ శైలి ఫుడ్ రెస్టారెట్లు ఇప్పటికీ ఉన్నాయి. వెయ్యి రకాల మొక్కలతో సిమ్స్ పఆర్క్ ఉంది. ఊటీ ప్రకృతి సౌందర్యానికి చిరునామా అయితే కూనూరు పాశ్చాత్య విలాసంగా కనిపిస్తుంది.

గులాబీల తోట!
ఊటీ బొటానికల్ గార్డెన్స్ అనగానే ఎక్కువ మందికి రోజ్ గార్డెన్ గుర్తు వస్తుంది. ఇక్కడ వందల రకాల గులాబీ చెట్లు ఉంటాయి. ఇక్కడ ఏటా జరిగే నీలగిరి ఫ్లవర్ షోకి ప్రపంచ దేశాల నుంచి లక్షా యాభై వేల మంది సందర్శకులు వస్తారు. బొటానికల్ గార్డెన్స్లో మొక్కలతో ఏర్పాటు చేసిన భారత రాష్ట్రాల మ్యాప్ను నిశితంగా పరిశీలించి ఆస్వాదించాలి. అన్నట్లు బోన్సాయ్ వృక్షాలను చూడడం మరిచి΄ోవద్దు. ఈ గార్డెన్స్ పరిధిలో తోడా గిరిజన తెగ నివసించే చిన్న ప్రదేశం కూడా ఉంది. దానిని తోడా మండ్ అంటారు. వారి జీవనశైలి ప్రత్యేకం. తెలుపు, నలుపు, ఎరుపు రంగులతో ఎంబ్రాయిడరీ చేసిన వస్త్రాలు అందంగా ఉంటాయి.
బాలీవుడ్ డ్యూయెట్లు ఇక్కడే!
ఊటీలో మనం చూసే సరస్సు సహజసిద్ధమైనది కాదు. బ్రిటిష్ ΄ాలన కాలం నాటిది. చల్లటి నీలగిరుల్లో ఉన్న ఊటీ బ్రిటిష్ వారి వేసవి విడిది. విహారం కోసం సరస్సును తవ్వించారు. యాభై ఎకరాల బొటానికల్ గార్డెన్స్కు దీటుగా ఏడు వేల అడుగుల ఎత్తులో తవ్విన 65 ఎకరాల సరస్సు ఇది. బ్రిటిష్ అధికారులు సరదాగా వేటాడడం కోసం చేపలను పెంచేవారు. ప్రస్తుతం చేపల వేట లేదు. పర్యాటకుల వినోదం కోసం బోట్ షికారు ఉంది. సరస్సు చుట్టూ విస్తరించిన ఎత్తైన చెట్లను చూస్తూ పెడల్ బోట్లో నిదానంగా విహరించడం అనిర్వచనీయమైన అనుభూతి. వేగంగా ప్రయాణించే మోటర్ బోట్లు కూడా ఉంటాయి. సరస్సు చుట్టూ రౌండ్ కొట్టాలంటే సైకిళ్లు అద్దెకిస్తారు. ఈ సరస్సు దగ్గర అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది. అందులో పిల్లలను ఆకర్షించే టాయ్ ట్రైన్, హాంటెడ్ హౌజ్, హార్స్ రైడ్ ఉంటాయి. ఇక ఊటీ గొప్పదనాన్ని ఒక్కమాటలో చెప్పాలంటే ఇది సినిమా చిత్రీకరణ లొకేషన్. ఓ యాభై ఏళ్ల కిందట సినిమాల చిత్రీకరణ ఎక్కువ భాగం ఊటీ, కూనూరుల్లో జరిగేది. తెలుగు సినిమాలే కాదు, బాలీవుడ్ హీరోహీరోయిన్లు కూడా ఇక్కడే డ్యూయెట్లు పాడుకున్నారు.
టెలిస్కోప్లో చూద్దాం!
ఊటీ పేరు ఉదకమండలం. ఇది తూర్పు కనుమలలోని నీలగిరుల్లో విస్తరించిన ప్రదేశం. నీలగిరుల్లో ఎత్తైన కొండను దొడబెట్ట అంటారు. దొడబెట్ట అనేది కన్నడ పదం. పెద్ద కొండ అని అర్థం. ఈ ప్రదేశం ఊటీ పట్టణానికి తొమ్మిది కిలోమీటర్ల దూరాన ఉంది. శిఖరం ఎత్తు ఎనిమిది వేల ఆరు వందల అడుగులు. శిఖరాన్ని చేరడానికి ట్రెకింగ్ చేయాల్సిన అవసరం లేదు. రోడ్డు ఉంది, వాహనాలు వెళ్తాయి. ఈ శిఖరం మీద టెలిస్కోప్ హౌస్ ఉంది. సముద్ర తీరాల్లో లైట్ హౌస్లను చూస్తుంటాం. ఈ శిఖరం మీద ఉన్న టెలిస్కోప్ నుంచి నీలగిరుల సౌందర్యాన్ని వీక్షించవచ్చు.
టీ కప్పు తెచ్చుకుందాం!
టీ మ్యూజియం ఊటీకి నాలుగు కిలోమీటర్ల దూరంలో విస్తారమైన టీ తోటల మధ్య ఉంది. దొడబెట్ట రూట్లో∙వస్తుంది. నిజానికి ఇది పెద్ద టీ ఫ్యాక్టరీ. ఇక్కడ తేయాకును కట్ చేయడంతోపాటు ఆకును స్టీల్ కంటెయినర్లలో వేసి వేడితో ఎండబెట్టడం, క్రష్ చేసి ప్రాసెస్ చేయడం అన్నింటినీ చూడవచ్చు. రకరకాల టీలను రుచి చూడవచ్చు. అలాగే పొడులు కొనుక్కోవచ్చు. ఈ ప్రదేశాన్ని సందర్శించిన గుర్తుగా టీ మ్యూజియం లోగో ముద్రించిన టీ కప్పులు, ప్లేట్లు, టీ షర్ట్లు కొనుక్కోవచ్చు. ఉదయం పది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు. టూర్ ప్యాకేజ్ నిర్వహకుల ఐటెనరీ ఈ సమయానికి అనుగుణంగానే ఉంటుంది.

బోట్హౌస్లో షికారు!
ఊటీకి 20 కిమీల దూరాన ఉంది పైకారా. ఇది తోడా గిరిజనుల ఆరాధ్య ప్రదేశం. నది పేరు, జలపాతం పేరు, జలపాతం ఉన్న ప్రదేశం పేరు అన్నీ పైకారానే. ఇక్కడ గిరిజనులు కొలిచే ఆలయంలో దేవతను కూడా పైకారా అమ్మ అని పిలుస్తారు. ఈ నది మీద డ్యామ్ ఉంది. రిజర్వాయర్లో బోట్ షికార్ చేయవచ్చు. ఇక్కడ మామూలు పడవలు కాదు, పైకప్పుతో బోట్ హౌస్లుంటాయి.


ప్రశాంత పర్యటన
హైదరాబాద్లో మొదలై హైదరాబాద్ చేరడంతో పూర్తయ్యే ఈ టూర్ ప్యాకేజ్ పేరు... ‘అల్టిమేట్ ఊటీ ఎక్స్ హైదరాబాద్ (ఎస్హెచ్ఆర్094)’. ఇది ఆరు రోజుల పర్యటన. గడియారంతో పరుగులు పెడుతూ ఎక్కువ ప్రదేశాలను చుట్టేసే పర్యటన కాదు. ప్రశాంతంగా ప్రకృతి సౌందర్యాన్ని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ సాగే చక్కటి విహారం. మూడు రోజులు ఊటీలో బస చేయవచ్చు. టూర్ కోడ్: ULTIMATE OOTY EX HYDERABAD (SHR094)
చదవండి: రాత్రికి రాత్రే మిలియనీర్గా..జాలరి దశ మార్చిన చేపలు
ప్యాకేజీ ధరలివి!
కంఫర్ట్ కేటగిరీ (థర్డ్ ఏసీ) సింగిల్ షేరింగ్లో ఒకరికి సుమారుగా 30 వేలవుతుంది. ట్విన్ షేరింగ్లో ఒక్కొక్కరికి సుమారు 17 వేలవుతుంది. ట్రిపుల్ షేరింగ్లో ఒక్కొక్కరికి 16 వేలు, పిల్లలకు ఒక్కరికి పదివేలు సుమారుగా.
స్టాండర్డ్ కేటగిరీ (స్లీపర్ క్లాస్) సింగిల్ షేరింగ్లో ఒకరికి 27 వేలకు పైగా, ట్విన్ షేరింగ్లో ఒక్కొక్కరికి 15 వేలు, ట్రిపుల్ షేరింగ్లో 13 వేలకు పైగా అవుతుంది.
రోడ్డు ప్రయాణానికి ఏసీ వాహనాలు, బసకు నాన్ ఏసీ హోటళ్లు. ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది.
హోటల్లో ఇచ్చే బ్రేక్ఫాస్ట్ మాత్రమే ప్యాకేజ్లో ఉంటుంది. మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనాలు వర్తించవు.
బోటింగ్, హార్డ్ రైడింగ్, పర్యాటక ప్రదేశాల ఎంట్రన్స్ టికెట్లు కూడా ప్యాకేజ్ ధరలో వర్తించవు.
వాతావరణం: ఈ నెలలో ఉష్ణోగ్రతలు 25–17 డిగ్రీల మధ్య ఉంటాయి. ఉలెన్ దుస్తులు తీసుకెళ్లాలి. స్వల్ప వర్షపాతం ఉండవచ్చు. కాబట్టి పిల్లలతో వెళ్లేవాళ్లు గొడుగు దగ్గర ఉంచుకుంటే మంచిది. పెద్దవాళ్లకు చిరు తుంపరలో ఊటీ గార్డెన్స్లో విహరించడం బాగుంటుంది.
ఇదీ రూట్: సికింద్రాబాద్లో బయలుదేరిన తర్వాత నల్గొండ, మిర్యాల గూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు జక్షన్, తెనాలి జంక్షన్, నిడుబ్రోలు, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, నెల్లూరు, గూడూరు జంక్షన్, రేణిగుంట జంక్షన్, తిరుపతి, చిత్తూరు మీదుగా ప్రయాణిస్తుంది. ఈ స్టేషన్లలో ఎవరికి సౌకర్యమైన స్టేషన్లో వాళ్లు రైలెక్కవచ్చు. అలాగే తిరుగు ప్రయాణంలో ఏ స్టేషన్లోనైనా దిగవచ్చు కూడా. తెలుగు రాష్ట్రాలు దాటిన తరవాత రైలు తమిళనాడులో ప్రవేశిస్తుంది. ఇది వీక్లీ ట్రిప్. వారానికి ఒక టూర్ మాత్రమే. ప్రతి మంగళవారం ఉంటుంది.
ఇదీ చదవండి: Beauty Tips ఆలూతో అందం : అదిరిపోయే చిట్కాలు
– వాకా మంజులారెడ్డి, సాక్షి, ఫీచర్స్ ప్రతినిధి