ఎనిమిదేళ్లుగా అరుదైన కణితితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ మహిళకు కిమ్స్ హాస్పిటల్స్, కొండాపూర్ వైద్యులు అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి పూర్తిస్థాయి ఉపశమనం కల్పించారు. సుమారు పది గంటలపాటు సాగిన ఈ శస్త్రచికిత్సలో ప్రాణాలకు అత్యంత కీలకమైన రక్తనాళాలను పునర్నిర్మిస్తూ కణితిని పూర్తిగా తొలగించారు.
ఈ మేరకే వైద్యులు మాట్లాడుతూ..రోగికి ఫంక్షనింగ్ ప్యారాగాంగ్లియోమా అనే అత్యంత అరుదైన న్యూరోఎండోక్రైన్ కణితి ఉన్నట్లు వైద్య పరీక్షల్లో గుర్తించాం. ఈ కణితి అధికంగా హార్మోన్లను విడుదల చేయడం వల్ల ఆమెకు బిపి అదుపులో ఉండకపోవడం, తరచూ ఇన్ఫెక్షన్లు, తలతిరుగుడు వంటి సమస్యలు వేధించేవి. అదీగాక ఈ కణితి క్లోమగ్రంథి (ప్యాంక్రియాస్) వెనుక భాగంలో ఉండి కాలేయం, పేగులు, కాళ్లకు రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన రక్తనాళాలైన సీలియాక్ ట్రంక్, సుపీరియర్ మెసెంటరిక్ ఆర్టరీ (ఎస్ఎంఏ), పోర్టల్ వెయిన్, అయోర్టాలకు అతుక్కుపోయి ఉంది.
దీంతో శస్త్రచికిత్స చేస్తే ప్రాణాలకే ముప్పు అని ఏ వైద్యులు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో కిమ్స్ హాస్పిటల్స్, కొండాపూర్ వైద్యులు దీన్ని సవాలుగా తీసుకుని పదిగంటలు శ్రమించి మరి విజయవంతంగా తొలిగించారు. ట్రాన్స్ప్లాంట్ శస్త్రచికిత్సల్లో ఉపయోగించే అత్యాధునిక రక్తనాళాల పునర్నిర్మాణ (వాస్క్యులర్ రీకన్స్ట్రక్షన్) పద్ధతులను వినియోగిస్తూ ఈ క్లిష్టమైన ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించామని వైద్యులు వెల్లడించారు.
శస్త్రచికిత్స అనంతరం రోగి ఎలాంటి ప్రధాన సమస్యలు లేకుండా కోలుకుని ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యినట్లు తెలిపారు. ఎనిమిదేళ్లుగా వేధించిన లక్షణాలన్నింటి నుంచి పూర్తిగా ఉపశమనం పొందడంతో పాటు, అధిక రక్తపోటు నియంత్రణ కోసం తీసుకుంటున్న అనేక మందులను కూడా నిలిపివేయగలిగామని కూడా తెలిపారు. కాగా, ఇలాంటి కేసుల్లో ముందస్తు ప్రణాళిక, బహుళ విభాగాల వైద్య నిపుణుల సమన్వయం, అవసరమైతే అత్యాధునిక రక్తనాళాల పునర్నిర్మాణ నైపుణ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు.
(చదవండి: ఆరోగ్యం క్షీణిస్తున్నా..నిరాహార దీక్షలోనే సోనమ్! అన్ని రోజులు ఆహారం తీసుకోకపోతే..)


