
వరి పొలంలో ఎలుకల సమస్యకు చిట్కా పరిష్కారం
ఎకరాకు 4–5 క్వింటాళ్ల వరకు ధాన్యం నష్ట నివారణ
కొరకరాని కొయ్యగా మారిన సమస్య ఒక్కోసారి చిన్న ఉపాయంతో తీరిపోతుంది. ఈ రైతు ఆవిష్కరణ కూడా అలాంటిదే. వరి పొలంలో ఎలుకల సమస్య రైతులకు పెద్ద తలనొప్పి. విషపు గుళికలు, బొరియల్లోకి పొగ పెట్టటం వంటి పనులేవీ పెద్దగా సత్ఫలితాలు ఇవ్వట్లేదు. ధాన్యం దిగుబడి నష్టం 10–50% వరకు ఉంటుంది. ఈ జఠిల సమస్యకు వేముల కరుణాకర్ రెడ్డి అనే రైతు వినూత్నమైన పరిష్కారం కనుగొన్నాడు. విష రసాయనాలు, ఖర్చు లేకుండానే ఎలుకలను పారదోలుతున్నారు! కేవలం ఎండు తాటాకుల శబ్దాలతో ఎలుకలను సమర్థవంతంగా అరికట్టి అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నారు!!
వరిలో నారు మడి నుంచి పంట కోసే దశ వరకు ఎలుకలు నష్టం కలిగిస్తుంటాయి. ప్రధానంగా, సార్వా/వానాకాలం పంట గింజ దశలో ఉండే ఆక్టోబర్–నవంబర్ నెలల్లో, దాళ్వా/యాసంగిలోని మార్చి–ఏప్రిల్ నెలల్లో తీవ్ర నష్టం చేస్తుంటాయి. ముఖ్యంగా, వరి పంట దుబ్బు దశ నుంచి కోత దశ వరకు ఎలుకలు పొలాల్లో వీర విహారం చేస్తుంటాయి. ఎలుకలు త్వరితగతిన సంతానోత్పత్తి చేయగలవు. ఒక జత ఎలుకల నుంచి ఏడాదికి ఏకంగా 1,250 ఎలుకలు పుట్టుకొస్తాయి. అందువల్ల నియంత్రించలేకపోతే పంట నష్టం అపారంగా ఉంటుంది. బొరియల్లో ఉండి, రాత్రి పూట 30–100 మీటర్ల దూరంలోని పంటను ఆరగిస్తాయి. వరి పొలం కోత దశలో నీరు తగ్గించినప్పుడు ఎలుకలు తమ ప్రతాపాన్ని చూపిస్తాయి.
వినూత్నంగా తాటి కమ్మలతో..
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని తీగల ధర్మారం రైతు వేముల కరుణాకర్ రెడ్డి స్వస్థలం. ఇతర రైతుల మాదిరిగానే వరి పొలంలో ఎలుకల నివారణకు జింక్ సల్ఫైడ్ను వాడారు. పెద్దగా ఉపయోగం కనబడలేదు. దాంతో సంప్రదాయ పద్దతిలోనే పరిష్కారం వెదికారు. పంట పొట్ట దశకు పెరిగిన సమయంలో తాటి ఆకులను మట్టలతో పాటు (తాటి కమ్మలు) నరికి పొలంలో ఎలుకలు తిరిగే ఆస్కారం ఉన్న చోట్ల పాతారు. గాలికి తాటి ఆకుల నుంచి వచ్చే చప్పుడుకు భయపడి ఎలుకలు పారిపోతున్నాయి. దీనికి తోడు, తాటాకులపై పక్షులు వాలుతున్నాయి. గతంలో ఎలుకల వల్ల ఎకరాకు 4–5 క్వింటాళ్ల ధాన్యం నష్టం వచ్చేది. తాటాకులు పెట్టిన ఈ సీజన్లో పంట నష్టం పెద్దగా లేదని కరుణాకర్రెడ్డి సంతోషంగా చెప్పారు. ఆయనను చూసి బీర్పూర్, సారంగాపూర్ మండల రైతులు సైతం ఇదే చిట్కాను ప్రయోగిస్తూ మంచి ఫలితం పొందుతున్నారు.
ఎకరానికి 15 తాటాకులు చాలు!
తాటాకు కమ్మలు ఎకరానికి 15 చొప్పున వరి పొలంలో పెడుతున్నాను. ఆ తాటాకుల శబ్దాలతో పాటు, వాటిపై వాలే పక్షులు చేసే శబ్దాలకు ఎలుకలు బోరియల నుంచి బయటకు రావట్లేదు. వరి కోతలయ్యే వరకు తాటాకులను పొలంలోనే ఉంచుతాను. గతంలో డబ్బు ఖర్చు చేసి ఏమి చేసినా ఎలుకల సమస్య తీరలేదు. ఎలాంటి ఖర్చు లేకుండా తాటాకులతోనే సమస్య ఇప్పుడు తీరింది.
– వేముల కరుణాకర్ రెడ్డి (84979 72225) తీగల ధర్మారం, ధర్మపురి(మం), జగిత్యాల జిల్లా
(పి.కరుణాకరరెడ్డి, సాక్షి, జగిత్యాల)