సోలార్‌ సఖి | Solar Sisters Bringing Light to Rural India | Sakshi
Sakshi News home page

సోలార్‌ సఖి

Apr 27 2025 6:05 AM | Updated on Apr 27 2025 7:58 AM

Solar Sisters Bringing Light to Rural India

విజయ పథం

రైల్లో తొలిసారి ప్రయాణించిన ఆ మహిళలు.... ‘రైలు ప్రయాణం ఇంత బాగుంటుందా!’ అని సంబరపడి పోయారు. ఆ తరువాత మరో ప్రయాణం మొదలు పెట్టారు.అయితే అది రైలు ప్రయాణం కాదు. తమ జీవితాలను మార్చివేసిన ప్రయాణం. చిన్న చదువులు చదువుకున్న ఎంతో మంది గ్రామీణ మహిళలు సోలార్‌ ఇంజినీర్‌లుగా, ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా రాణిస్తున్నారు...

రాజస్థాన్‌లో నిశ్ఛలగఢ్‌కు చెందిన తవ్రీదేవి ఎన్నో  సంవత్సరాలు విద్యుత్‌ సౌకర్యం లేని ఇంట్లోనే గడిపింది. అయిదవ తరగతి తరువాత తల్లిదండ్రులు చదువు మాన్పించడంతో ఇంటి పనులు చేసేది. గొర్రెలు మేపేది. ఇల్లే ప్రపంచంగా బతుకుతున్న తవ్రీదేవి జీవితాన్ని ‘సోలార్‌ పవర్‌’ మార్చి వేసింది. హర్మదా(జైపూర్‌)లో ఐదు నెలల సోలార్‌ ఇంజినీరింగ్‌ శిక్షణ కార్యక్రమం ఆమె జీవితాన్ని కొత్త దారిలోకి తీసుకువెళ్లింది.

సోలార్‌ ఇంజినీరింగ్‌ శిక్షణ కోసం సిద్ధం అయినప్పుడు.. ‘ఎందుకులే’ అన్నారు తల్లిదండ్రులు. వారిని బలవంతంగా ఒప్పించాల్సి వచ్చింది, ‘మా కమ్యూనిటీలోని మహిళలు ఎప్పుడూ ముసుగు లేకుండా ఒంటరిగా బయటకు వెళ్లలేదు. నేను ఎప్పుడూ పట్టణ ప్రాంతానికి ఒంటరిగా వెళ్లలేదు’ అంటుంది తవ్రీదేవి.

కిషన్‌గడ్‌కు వెళ్లడం...తన తొలి రైలు ప్రయాణం! ‘అది పూర్తిగా కొత్త అనుభవం. ప్రయాణంలోని ఆనందం తెలిసొచ్చింది’ అంటుంది తవ్రీదేవి. శిక్షణలో సోలార్‌ ఇన్‌స్టలేషన్, ఫీల్డ్‌వర్క్‌కు అవసరమైన నైపుణ్యాలు సంపాదించింది. ఆ తరువాత స్వగ్రామానికి తిరిగివచ్చింది. ‘మేము చాలా సంవత్సరాలు చీకటిలో జీవించాము. అందుకే మా జీవితాల్లో వెలుగు తీసుకురావాలనుకున్నాను’ అంటుంది తవ్రీదేవి.

సోలార్‌ ఇంజినీర్‌గా కొత్త జీవితాన్నిప్రారంభించిన తవ్రీదేవి తన గ్రామానికి విద్యుత్‌ వెలుగులు తీసుకువచ్చింది. భారత రాష్ట్రపతి నుండి ‘ఆది సేవా గౌరవ్‌ సమ్మాన్‌’ అవార్డ్‌ అందుకుంది. ఇది కేవలం తవ్రీదేవి విజయగాథ మాత్రమే కాదు... జార్ఖండ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, మిజోరాం, నాగాలాండ్‌తో సహా పదిరాష్ట్రాలలో మూడువేల మందికి పైగా గ్రామీణ మహిళా సోలార్‌ ఇంజినీర్‌ల విజయగాథ.

తమ గ్రామాల్లో సోలార్‌ ΄్యానెళ్లను ఒంటిచేత్తో మరమ్మతు చేసే వీరు పారిశ్రామికవేత్తలుగా కూడా ఎదిగారు. ఈ మార్పుకు కారణం హర్ష్‌ తివారీ నేతృత్వంలోని ఈఎంపీఐ ఇంటర్నేషనల్‌. ఈ సంస్థ శిక్షణ కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంత మహిళలు సోల్డరింగ్, వైరింగ్, బ్యాటరీ సెటప్, ఫాల్ట్‌ ఫైండింగ్, ఇన్‌స్టలేషన్‌లలోప్రావీణ్యం సాధించారు. గ్రామీణ మహిళలకు సాంకేతిక నైపుణ్యం, ఆర్థికస్వాతంత్య్రం లక్ష్యంగా ఈఎంపీఐ ఇంటర్నేషనల్‌ పనిచేస్తోంది.

శిక్షణ అనంతరం మహిళలు తమ గ్రామాల్లో సోలార్‌ సొల్యూషన్స్‌ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. మరమ్మతులు, ఫస్ట్‌లెవల్‌ చెకప్‌లు నిర్వహించేందుకు వీలుగా చిన్న ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తారు. గ్రామస్థాయి ఇంధన మౌలిక సదుపాయాలు సజావుగా సాగేలా చూస్తారు. శిక్షణ పూర్తయిన తరువాత క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మహిళా సోలార్‌ ఇంజినీర్‌లను ‘సోలార్‌ సఖీ’ అని పిలుస్తారు.

‘వ్యవసాయంతో పాటు చిన్న తరహా పరిశ్రమలలో సౌరశక్తితో నడిచే పరికరాలకు డిమాండ్‌ పెరుగుతుంది, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈఎంపీఐ ఇంటర్నేషనల్‌ సోలార్‌ సఖీలకు శిక్షణ ఇస్తోంది. జీవనోపాధి కల్పిస్తుంది. టెక్నికల్‌ ట్రైనింగ్‌తోపాటు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, కస్టమర్‌ ఎంగేజ్‌మెంట్‌లో కూడా శిక్షణ ఇస్తాం. గ్రామాల్లో సోలార్‌ సెటప్‌లలో ఏవైనా సాంకేతిక లోపాలు తలెత్తితే సోలార్‌ సఖులు పరిష్కారం చూపుతున్నారు’ అంటున్నాడు హర్ష్‌ తివారీ.

Advertisement
 
Advertisement
Advertisement