షార్ట్ రీల్స్.. లాంగ్రన్ ప్రాబ్లమ్స్
పిల్లలు రీల్స్, షార్ట్ వీడియోలకు అడిక్ట్ అవడం అనేది ప్రస్తుతం తల్లిదండ్రులను వేధిస్తున్న అతిపెద్ద సమస్య. ఇది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు, వారి మెదడు పనితీరును కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఏకాగ్రత సమయం తగ్గిపోవడం
రీల్స్ వల్ల కలిగే అత్యంత ఆందోళనకరమైన అంశం ఏమిటంటే.. ఏకాగ్రత సమయం తగ్గడం. సాధారణంగా మనిషి సగటు ఏకాగ్రత సమయం సుమారు 12 సెకన్ల వరకు ఉంటుంది. కానీ రీల్స్, షార్ట్ వీడియోలు చూసే వారిలో అది 8 సెకన్ల కంటే తక్కువకు పడిపోయిందని పరిశోధనలు చెబుతున్నాయి. కేవలం 15–30 సెకన్ల వీడియోలకే అలవాటు పడటం వల్ల, ఏదైనా ఒక విషయం గురించి లోతుగా ఆలోచించడం, కష్టమైన సమస్యను పరిష్కరించడం మెదడుకు భారంగా అనిపిస్తుంది.
సహనం నశించడం
నిజ జీవితంలో పనులు నెమ్మదిగా జరుగుతాయి. కానీ రీల్స్ ప్రపంచంలో అన్నీ వేగంగా జరిగిపోతాయి. దీనివల్ల పిల్లల్లో విపరీతమైన చిరాకు, అసహనం కలుగుతాయి. ఫోన్ నిరంతరం వేగవంతమైన సమాచారాన్ని అందించడం వల్ల మెదడు కేవలం తక్షణ వినోదం కోసం మాత్రమే ఎదురు చూసేలా మారిపోతుంది. కష్టపడి సాధించే ఫలితం కంటే, వెంటనే వచ్చే వినోదాన్ని కోరుకుంటారు.
స్పీచింగ్ థెరపీ సెంటర్లకు డిమాండ్
రీల్స్, వీడియోలు చూసే పిల్లల్లో మాటలు ఆలస్యంగా వస్తున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మధ్యకాలంలో సంవత్సరాలు పెరుగుతున్నా తమ పిల్లలకు మాటలు రావడం లేదంటూ స్పీచ్ థెరపీ సెంటర్లకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. రీల్స్ చూసే పిల్లలు .. ఇంట్లో వారితో మాట్లాడే ప్రయత్నం కంటే స్క్రీన్ను చూడటానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.
ఆందోళన, నిరాశ
ఇతరుల జీవితాలను రీల్స్లో చూసి, తమ జీవితాన్ని వారితో పోల్చుకోవడం వల్ల పిల్లల్లో ఆందోళన, నిరాశ పెరిగిపోతాయి. ఫిల్లర్లతో కూడిన వీడియోలని చూసి, తమ రూపం పట్ల ఆత్మన్యూనతా భావానికి గురవడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. ఇది పిల్లల అభివృద్ధిని కుంటుపడేలా చేస్తుంది.
భావోద్వేగాలు మొద్దుబారడం
రీల్స్లో హాస్యం, హింస, విషాదం అన్నీ వెంటవెంటనే వస్తాయి. దీనివల్ల మెదడుకు ఒక భావోద్వేగాన్ని సరిగ్గా ప్రాసెస్ చేసే సమయం ఉండదు, ఇది పిల్లలను భావోద్వేగపరంగా మొద్దుబార్చే అవకాశం ఉంది. ఇది నిజజీవితంలో మరింత ప్రమాదకరం.
నిద్ర పట్టకపోవడం
స్మార్ట్ఫోన్తో మరో ముఖ్యమైన సమస్య నిద్ర పట్టకపోవడం. రీల్స్ చూడటం, మెసేజ్లు చేయడం వల్ల మెదడు ఉద్వేగానికి గురవుతుంది. దీనివల్ల స్లీపింగ్ సైకిల్ దెబ్బతిని .. పిల్లల్లో ఆందోళన, ఒత్తిడి పెరిగిపోతాయి. దాంతో చిరాకు, కోపం, మొండిగా ప్రవర్తించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ప్రత్యామ్నాయమే పరిష్కారం
ఫోన్ వద్దు అని ఒకేసారి చెప్పడం కంటే వారికి నచ్చిన కథల పుస్తకాలు, బోర్డ్ గేమ్స్ లేదా ఏదైనా క్రీడావిశేషాలను చర్చించడం వల్ల వారి మనసు మరోవాటి మీదకి మళ్లుతుంది. బోర్గా ఉందని చెప్పగానే పిల్లలకు ఫోన్ ఇవ్వడం మానుకోవాలి. వారితో మాట్లాడాలి, ఆడుకోవాలి. అలాగే మీరు నిరంతరం ఫోన్ చూస్తూ ఉంటే, వారు కూడా మిమ్మల్ని అనుకరిస్తారు గనుక స్క్రీన్ టైమ్ తగ్గించుకోవాలి. స్మార్ట్ ఫోన్ను.. మనం ఎలా వాడుతాము అనేదానిపైనే అది మనకు మేలు చేస్తుందా.. కీడు చేస్తుందా అనే అంశాలు ఆధారపడి ఉంటాయనే విషయాన్ని గ్రహించాలి లేదా వీటిలో భాగస్వామ్యం చేయాలి. బాల్యం నుంచే పిల్లల దృష్టి రీల్స్ నుంచి రియల్కు మళ్లించే ప్రయత్నం చేయాలి.


