
తెలుగు రాష్ట్రాల్లో ఉద్యాన తోటలకు తీవ్ర నష్టం కలిగిస్తున్న ఆఫ్రికా నత్తల దండు
ప్రపంచవ్యాప్తంగా ‘వంద దురాక్రమణ జాతుల’ ఐయూసీఎన్ జాబితాలో ఇదొకటి
వాతావరణం తేమగా ఉన్న కాలాల్లో ఆఫ్రికా నత్తలు తామర తంపరగా విస్తరిస్తాయి
సమర్థవంతంగా అరికట్టే నిరూపిత పద్ధతులను వివరిస్తున్న ఎన్ఐపీహెచ్ఎం శాస్త్రవేత్తలు
ప్రకృతిలో పుట్టిన ప్రాంతం దాటి ఇతర ప్రాంతాలకు చేరినప్పుడు తామర తంపరగా పెరుగుతూ జీవవైవిధ్యానికి ముప్పుగా పరిణమించే జాతులను ఇన్వాసివ్ స్పెసీస్ (దురాక్రమణ జాతులు) అంటారు. మొక్కలు, జీవులు ఈ జాబితాలో ఉంటాయి. స్వతహాగా పుట్టి పెరిగే వాతావరణ పరిస్థితుల్లో అవి సమస్యగా ఉండవు. అక్కడి నుంచి ఏదో ఒక విధంగా వేరే వాతావరణ పరిస్థితులున్న దేశాల్లోకి ప్రవేశించినప్పుడు అవి తమ సంతతిని తామర తంపరగా పెంపొందించుకుంటూ సమస్యాత్మకంగా మారతాయి.
స్థానికంగా పంటలను ఆరగించేస్తూ.. రైతులను తీవ్ర ఇక్కట్ల పాలు చేస్తుంటాయి. సర్కారు తుమ్మ, వయ్యారిభామ అలాంటివే. ఈ జాబితాలో తాజాగా చేరింది ‘జెయింట్ ఆఫ్రికన్ నత్త’. ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్ర జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోనూ కొన్ని చోట్ల కూరగాయలు, పండ్ల తోటల్లో కుప్పలు తెప్పలుగా ఆఫ్రికా నత్తలు తమ సంతతిని వృద్ధి చేసుకుంటూ పంటలను విధ్వంసకరంగా తినేస్తున్నాయి.
దీంతో రైతులు తీవ్ర నష్టాల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని కేంద్ర వ్యవసాయ శాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ (ఎన్ఐపీహెచ్ఎం) శాస్త్రవేత్తలు డాక్టర్ పి.శక్తివేల్, డాక్టర్ ఎ. మరియదాస్, డాక్టర్ సి. ఆలిస్ ఆర్ పి సుజీత ఆఫ్రికా నత్తల బెడద నుంచి పంటలను, తోటలను కాపాడుకునే పద్ధతులను సూచిస్తున్నారు. ‘సాక్షి సాగుబడి’ కోసం వారు అందించిన వివరాలతో ప్రత్యేక కథనం.
మన దేశంలో దాదాపు 1,500 రకాల నత్తలున్నాయి. వాటిలో తొమ్మిది జాతుల నత్తలు పూలు, కూరగాయలు, పండ్ల తోటలకు హాని కలిగిస్తున్నాయి. హెలిక్స్ అనే సాధారణ నత్త హిమాచల్ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, ఒడిశా వంటి రాష్ట్రాల్లో కనిపిస్తుంటుంది. అచటినా ఫులికా అనే జెయింట్ ఆఫ్రికన్ నత్త కూడా ఇప్పుడు తోడైంది. ఇది ఇప్పటికే మన దేశంలోని అనేక రాష్ట్రాలకు వ్యాపించింది.
ఒడిశా, పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాలతో పాటు తెలంగాణలోనూ కొన్ని చోట్ల పండ్ల తోటలు, కూరగాయ తోటల్లో తామర తంపరగా విస్తరిస్తూ పెద్ద సమస్యగా మారింది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) దీన్ని ‘అత్యంత దురాక్రమణ గుణం కలిగిన వంద జాతు’ల్లో ఒకటిగా గుర్తించింది.
నత్తల సమగ్ర నిర్వహణ మార్గాలివి:
→ తోటను శుభ్రంగా ఉంచండి. కలుపు మొక్కలను తొలగిం
చండి. నత్తలు లోపలికి రాకుండా తోట చుట్టూ మొక్కల్లేకుండా ఖాళీగా ఉంచండి.
→ తోటలు/పొలాల్లోకి నత్తలు రాకుండా ఉండాలంటే చుట్టూతా ఉప్పు, సున్నపు పొడి లేదా కాపర్ సల్ఫేట్ చల్లితే చాలు. ఈ పదార్థాలను దాటి నత్తలు వెళ్లలేవు.
→ ఉప్పు నత్తలను నిర్జలీకరణం చేసి, చంపుతుంది. కాపర్ సల్ఫేట్ విషపూరితమైన రసాయనం కాబట్టి అవరోధంగా పనిచేస్తుంది. వీటిని చల్లిన ప్రాంతాల్లో నత్తల
సంఖ్య వేగంగా తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. నత్తలు తోటల్లోకి ప్రవేశించకుండా లేదా మొక్కల కాండాలపైకి పాకకుండా నిరోధించడానికి నమ్మదగిన పద్ధతి ఇది.
→ ప్లాస్టిక్ పాత్రలో కొద్దిగా బీరు, వైన్ లేదా ఈస్ట్లను పోసి.. ఆ పాత్ర అంచు నేలతో సమానంగా ఉండేలా, పాతిపెట్టాలి. నత్తలు పాక్కుంటూ వచ్చి అందులో పడతాయి. అప్పుడు ఉప్పు వేస్తే, చనిపోతాయి.
→ నత్తలను ఆకర్షించడానికి కుండలు, బాక్సులు లేదా తడి సంచుల కింద నత్తలు లోపలికి వెళ్లే అంత ఖాళీ ఉండేలా రాళ్లు అమర్చి, వాటి లోపల క్యాబేజీ ఆకులు లేదా బొప్పాయి కాండాలను ఎరగా పెట్టి, రాత్రంతా అలా ఉంచాలి. ఉదయానికి నత్తలు వాటి కింద చేరతాయి. వాటిపై ఉప్పు చల్లితే చనిపోతాయి. లేదా వాటిని నలిపివేసి చంపండి.
→ పండ్ల చెట్లు, కూరగాయ మొక్కల కాండాలకు ఎగబాకకుండా ఉండాలంటే.. వాటి చుట్టూ ఒక వలయంలో కొద్దిగా సూపర్ ఫాస్ఫేట్ ఎరువును చల్లండి.
→ నత్తలు మొక్కలు, చెట్ల పైకి ఎక్కకుండా ఆపటానికి చెట్ల కాండాలకు సన్నని రాగి లేదా జింక్ రేకు (సుమారు 0.8 మిమీ మందం) చుట్టండి.
→ నత్తలున్న తోటల్లో 3 శాతం కాపర్ సల్ఫేట్ ద్రావణం (అంటే.. 400 లీటర్ల నీటిలో 12 కిలోల కాపర్ సల్ఫేట్ కలిపి హెక్టారుకు) పిచికారీ చేయండి.
→ కంచెలు/ప్రహరీలు, నత్తలు గుడ్లు పెట్టిన ప్రాంతాల్లో ఒక లీటరు నీటిలో కాపర్ సల్ఫేట్ (60 గ్రా.), పొగాకు(25 గ్రా.) రసం కలిపి పిచికారీ చేయడం ద్వారా కూడా నత్తల ముప్పును నియంత్రించవచ్చు.
→ పొగాకు మిశ్రమాన్ని తయారు చేసే పద్ధతి: 50 గ్రాముల పొగాకును 1.5 లీటర్ల నీటిలో వేసి మరిగించండి. ద్రావణం 1 లీటరుకు తగ్గే వరకు మరిగిం
చండి. అందులో, 1 లీటరు నీటిలో 60 గ్రాముల కాపర్ సల్ఫేట్ కలిపిన ద్రావణాన్ని కలపండి. ఆ ద్రావణాన్ని నత్తలున్న చోట పిచికారీ చేయండి.
→ ప్రభుత్వం ప్రచారోద్యమం చేపట్టి సమగ్ర చర్యల ద్వారా నత్తల సమస్యను నియంత్రించవచ్చు. మొక్కలు/చెట్లపై ఉండే నత్తలను ప్రజల సహకారంతో చేతులతో తీసివేయించటం, బాతులతో నత్తలను తినిపించటం వంటి పటిష్టమైన చర్యలు తీసుకుంటే ఆఫ్రికా నత్తల సంతతి వ్యాప్తిని నియంత్రించడానికి అవకాశం ఉంది.
నత్తలన్నీ గుడ్లు పెడతాయి!
జెయింట్ ఆఫ్రికన్ జాతికి చెందిన నత్తలన్నిటిలో మగ, ఆడ జననాంగాలుంటాయి. కాబట్టి ఆడ, మగ కూడా గుడ్లు పెడతాయి. సాధారణంగా శరద్ రుతువు, శీతాకాలంలో వాతావరణం తేమగా ఉన్నప్పుడు జతకూడి తడి నేలలో గుండ్రని తెల్ల గుడ్లు పెడతాయి. తడి వాతావరణంలో గుడ్లు రెండు నుంచి నాలుగు వారాల్లో పిల్లలు పుడతాయి. పిల్ల నత్తలు ఒక సంవత్సరం తర్వాత గుడ్లు పెట్టటం ప్రారంభిస్తాయి. నత్త మూడు నుంచి ఐదేళ్లు జీవిస్తుంది. జెయింట్ ఆఫ్రికన్ నత్త సంవత్సరానికి ఒకసారి 50–200 గుడ్లు పెడుతుంది. దాని జీవితకాలంలో వెయ్యి వరకు గుడ్లు పెడుతుంది.
నత్తల ద్రావణంతో పంటలకు మేలు!
నత్తలు పంటలకు నష్టదాయకంగా పరిణమిస్తున్న నేపథ్యంలో ఈ నత్తలతో పంటల పెరుగుదలను వేగవంతం చేసే ద్రావణం(గ్రోత్ పమోటర్) తయారు చేసుకొని పంటలపై పిచికారీ చేయటం ద్వారా రైతులు ప్రయోజనం పొందవచ్చని కాకినాడ జిల్లా ప్రకృతి వ్యవసాయ శాఖ ప్రాజెక్ట్ మేనేజర్ తాతారావు ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు.
నత్తల ద్రావణం తయారు చేసే పద్ధతి: అవసరం ఉన్నన్ని నత్తలను ఒక డ్రమ్ములో వేసుకొని, అవి మునిగిన తర్వాత 2 అంగుళాల పై వరకు నిమ్మరసం పొయ్యాలి. 15 రోజులు ఊరబెట్టాలి. అప్పటికి నత్తలు కోడిగుడ్ల మాదిరిగానే పూర్తిగా ద్రావణంలో కరిగిపోతాయి. వడగట్టిన ద్రావణానికి సమాన తూకంలో బెల్లం కలిని 7 రోజులు వూరబెట్టండి. నత్తల ద్రావణం అర లీటరును 100 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరంలో ఏ పంటల కైనా పిచికారీ చెయ్యొచ్చు. నత్తల సమస్య తీరిపోతుంది. పంట బలంగా పెరిగి రైతుకు డబ్బులు వస్తాయని ఆయన సూచించారు.