
రసాయనిక ఎరువుల వినియోగం
రసాయనిక ఎరువులు, అధిక దిగుబడినిచ్చే వంగడాలు, నీటిపారుదల సదుపాయాలు.. ఈ మూడింటిని ఒక ప్యాకేజీగా రైతులకు అందుబాటులోకి తెచ్చింది ‘హరిత విప్లవం’. ఆంగ్లంలో ఈ మూడిటిని కలిపి గ్రీన్ రెవెల్యూషన్ టెక్నాలజీస్ (జిఆర్టిలు) అంటారు. హరిత విప్లవ కాలంలో ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న, పేద దేశాల్లో రైతులకు ఈ మూడే విస్తృతంగా అందుబాటులోకి రావటంతో పంట దిగుబడులు ఇబ్బడిముబ్బడి అయ్యాయి. ఏటేటా రసాయనిక ఎరువులతో పాటు పురుగుమందులు తదితర వ్యవసాయ రసాయనాల వాడకం పెరుగుతూనే ఉంది.
పెరిగే జనాభాకు అనుగుణంగా ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయలు తదితర వ్యవసాయోత్పత్తుల ఉత్పత్తిని పెంచవలసి వస్తోంది. అయితే, రసాయనిక ఎరువుల వాడకాన్ని అంతకంతకూ పెంచుకుంటూ పోవటం వల్ల పర్యావరణ సంబంధమైన సమస్యలు వస్తున్నాయి. నేలలు చౌడుబారిపోతున్నాయి. నీటి వనరులు రసాయనిక ఎరువుల అవశేషాలతో కలుషితం అవుతున్నాయన్న ఆందోళనలు సైతం పెరిగిపోతున్నాయి. అందువల్లనే పర్యావరణానికి అంతగా హాని చేయని సుస్థిర / సేంద్రియ / ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఇటీవల కాలంలో గతమెన్నడూ లేనంతగా ఆదరణ పొందుతున్నాయి.
అయినప్పటికీ ఇప్పటికీ నూటికి 95 శాతం మంది రైతులు రసాయనిక ఎరువులతోనే వ్యవసాయం చేస్తున్నారు. ఇంతకీ, ఏయే దేశాల్లో పంటలకు ఎంతెంత మోతాదులో రసాయనిక ఎరువులు వాడుతున్నారు? నత్రజని అనగానే యూరియా గుర్తొస్తుంది. పంటలకు యూరియా యేతర మార్గాల ద్వారా నత్రజని ఎంతెంత అందుతుంది? ఎరువులను ఎంతెంత వాడుతున్నారు? వీటిని శాస్త్రవేత్తలు సూచించిన దానికన్నా అనేక రెట్లు ఎక్కువ వాడుతుండటం వల్ల వస్తున్న పరిణామాలేంటి? ఇటువంటి ఆసక్తికరమైన అంశాలను పరిశీలిద్దాం.. కాసేపు రసాయనిక ఎరువుల లోకంలోకి తొంగి చూద్దాం...
పంట మొక్కలు, తోటలు ఆరోగ్యంగా పెరిగి మంచి ఫలసాయాన్ని ఇవ్వాలంటే వాటి పెరుగుదలకు అవసరమైనంత మోతాదులో 17 రకాల పోషకాలు అవసరం. ఇవి రెండు రకాలు.. స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు. కర్బనం, హైడ్రోజన్, ఆక్సిజన్.. ఈ మూడింటిని వాతావరణం నుంచి మొక్కలు గ్రహిస్తాయి. మిగతా 14 రకాలు నేల నుంచి వేర్ల ద్వారా పంటలు గ్రహిస్తాయి.
అదేవిధంగా ఎరువుల్లో రెండు రకాలు. రసాయనిక ఎరువులు, సేంద్రియ ఎరువులు (జీవన ఎరువులు కూడా ఈ కోవలోకే వస్తాయి). నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం అనేవి స్థూల పోషకాలు. ఇవి పెద్ద పరిమాణంలో పంటలకు అవసరం. ఐరన్, జింక్, బోరాన్, మెగ్నీషియం.. వంటి సూక్ష్మపోషకాలు. ఇవి స్వల్ప పరిమాణంలో అవసరం. సాధారణంగా రసాయనిక ఎరువులు అని అంటే చాలా వరకు నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం అనే అర్థం. ఎన్పీకే ఎరువులని అంటుంటాం.
2024లో 19.54 కోట్ల మెట్రిక్ టన్నుల రసాయనిక ఎరువులను ప్రపంచవ్యాప్తంగా రైతులు పంటల సాగు కోసం ఉపయోగించారు. 2023 కన్నా ఇది కొంచెం ఎక్కువ. 2022లో 18.5 కోట్ల టన్నులు వాడారు. 2021తో పోల్చితే ఇది 7% తక్కువ. కొవిడ్ నేపథ్యంలో రసాయనిక ఎరువుల ధరలు బాగా పెరిగిపోవటంతో కొన్ని చోట్ల వాడకం తగ్గినా అది తాత్కాలిక పరాణామమేనని చెప్పాచ్చు.
రసాయనిక ఎరువుల ఉత్పత్తి, ఎగుమతి యూరప్, అమెరికా ఖండాల్లో ఎక్కువ. ఐదు దేశాలు ఎరువుల ఎగుమతిలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. అయితే వాడకం ఆసియాలో ఎక్కువ. భారత్ సహా ఆసియా దేశాలన్నీ రసాయనిక ఎరువులను దిగుమతి చేసుకుంటూ వ్యవసాయానికి మద్దతు పలుకుతున్నాయి. ఉక్రెయిన్–రష్యా యుద్ధ కాలంలో ఎరువుల సరఫరా తగ్గి, ధర పెరిగిపోవటం మనకు తెలుసు.
ఆయా దేశాల్లో నెలకొన్న వాతావరణ పరిస్థితులు, నేలల్లో సారం, రైతుల స్థోమత, వారు అనుసరిస్తున్న సాంకేతికత, స్థానిక ప్రభుత్వాలు అందించే ప్రోత్సాహకాలు వంటి అనేక పర్యావరణ, ఆర్థిక, భౌగోళిక అంశాలపై ఎరువుల వాడకం మోతాదులు, దిగుబడులు వంటివి ఆధారపడి ఉంటాయి.
ఎరువుల వినియోగం 18.5 కోట్ల టన్నులు
ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం (పంటలు, పశుపోషణ, ఆక్వాకల్చర్, అడవుల పెంపకం, చేపల వేటసహా) ద్వారా సమకూరే ఆదాయం 2000–2022 మధ్య కాలంలో 89 శాతం పెరిగింది. 2022లో 3.8 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇందులో ఆసియా దేశాలదే 66%తో ప్రధాన పాత్ర. ప్రపంచ దేశాల వార్షిక ఆదాయంలో 4% మాత్రమే వ్యవసాయ రంగం నుంచి వస్తున్నప్పటికీ స్వతంత్ర ఆహారోత్పత్తి వ్యవస్థను కలిగి ఉండటం ఏ దేశానికైనా ఆహార సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకోవటానికి అవసరమే. అందుకు ఈ రోజుకు ప్రధాన సాధనంగా రసాయనిక ఎరువులే నిలుస్తున్నాయి.
ఆహార వ్యవసాయ సంస్థ (యుఎన్–ఎఫ్పిఓ) ప్రకటించిన తాజా గణాంకాల ప్రకారం.. 2022 నాటికి ప్రపంచంలో రసాయనిక ఎరువుల వార్షిక వినియోగం 18.5 కోట్ల టన్నులకు చేరింది. ఇందులో సింహభాగం 58% నత్రజని ఎరువులే. 10.8 కోట్ల టన్నుల యూరియా వాడకం జరిగింది. 4.2 కోట్ల టన్నుల ఫాస్ఫరస్ (23%), 3.5 కోట్ల టన్నుల పొటాషియం (19%) ఎరువులను రైతులు వాడారు.

2022లో రసాయనిక ఎరువుల వాడకంలో 55 శాతం వాటాతో ఆసియా ముందంజలో ఉంది. అమెరికా దేశాలు రెండోస్థానంలో, యూరప్ మూడో స్థానంలో, ఓసియానా నాలుగో స్థానంలో ఉన్నాయి. చైనా, భారత్, బ్రెజిల్, అమెరికా దేశాలు అధికంగా రసాయనిక ఎరువులు వాడుతున్నాయి. ఆసియా దేశాల్లో వాడుతున్న ఎరువుల్లో నత్రజని ఎరువుల వాటా 61–62% మేరకు ఉంది.
హెక్టారుకు 130 కిలోలు
హెక్టారు పొలంలో రసాయనిక ఎరువుల వాడకం 130 కిలోల మేరకు ఆసియా దేశాల్లోనే అత్యధికంగా ఉంది. అమెరికా ఖండంలో 130 కిలోలు, ఓసియానా దేశాల్లో 84 కిలోలు, యూరప్లో 64 కిలోలు, ఆఫ్రికాలో అతి తక్కువగా 22 కిలోల మేరకు రసాయనిక ఎరువులు వాడుతున్నారు. అమెరికా ఖండంలో 2000–2022 మధ్యకాలంలో వినియోగం 57% పెరిగింది. ఆసియాలో 37%, ఆఫ్రికాలో 32%, ఓసియానాలో 15% పెరగ్గా, యూరప్ దేశాల్లో 2% తగ్గింది. చెరకు, మొక్కజొన్న. గోధుమ, వరి పంటలను అత్యధిక విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు.

వర్షం ద్వారా 9.8 కిలోల నత్రజని!
ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. పంటలకు నత్రజని అందేది యూరియా ద్వారా మాత్రమే కాదు. అందుకు అనేక ఇతర మార్గాలు కూడా ఉన్నాయి. యుఎన్–ఎఫ్ఎఓ గణాంకాల ప్రకారం (2022).. ప్రపంచవ్యాప్తంగా సగటున హెక్టారుకు ఏడాదికి సేంద్రియ ఎరువుల ద్వారా 16.2 కిలోల నత్రజని పంటలకు అందుతోంది. రసాయనిక ఎరువుల ద్వారా అందుతోంది 64.3 కిలోలు. వర్షం/మంచు ద్వారా 9.8 కిలోల నత్రజని వాతావరణంలో నుంచి గ్రహించి సూక్ష్మజీవులు అందిస్తున్నది 25.5 కిలోలు. పంట కోతల ద్వారా (ఫలసాయం, పంట వ్యర్థాలతో కలుపుకొని) మనం భూమి నుంచి పొందుతున్న నత్రజని 65.1 కిలోలు మాత్రమే.
అయితే, వర్షం, మంచు ద్వారా భారత్లో పొలాలకు 2022లో అందిన నత్రజని సగటున హెక్టారుకు 21.2 కిలోలు! ఇది ప్రపంచ సగటు 9.8 కిలోలతో పోల్చితే రెట్టింపు కన్నా ఎక్కువ కావటం విశేషం. 2021లో వివిధ మార్గాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా హెక్టారు భూమికి సగటున 116.9 కిలోల నత్రజని అందింది. అందులో నుంచి, పంట పండిన తర్వాత మనం పొందే ఫలసాయం ద్వారా 65.1 కిలోల నత్రజని పోగా మిగతా 51.8 కిలోల నత్రజని ప్రతి హెక్టారు భూమిలో మిగిలిందని ఎఫ్.ఎ.ఓ. లెక్కగట్టింది. 2000 సంవత్సరంలో ఇలా మిగిలింది 48.3 కిలోలు మాత్రమేనట.