అంతర మథనం

Review Of Burnt Sugar Book - Sakshi

కొత్త బంగారం

బుకర్‌ ప్రైజ్‌ 2020 షార్ట్‌లిస్ట్‌లో చోటు సంపాదించుకున్న ‘బర్ట్న్‌ శుగర్‌‌’ (ఇండియాలో గత సంవత్సరం ‘గర్ల్‌ ఇన్‌ వైట్‌ కాటన్‌’ పేరుతో ప్రచురించబడింది) రచయిత్రి ‘ఆవ్నీ దోషీ’ తొలిరచన అంటే అపనమ్మకం, ఆశ్చర్యం ఏకకాలంలో కలుగుతాయి. తల్లీకూతుళ్ల సంఘర్షణ వస్తువుగా చాలా రచనలే వచ్చివుండవచ్చు కానీ, ఆ ఘర్షణ రూప, పరిణామాల పరిమాణాలని విభిన్న సారాంశాల (థీమ్స్‌) పరంగా చెప్పడం ఇందులోని తాజాదనం కాగా, కథకురాలి విలక్షణమైన భావరహిత స్వరంలోని మెటఫోర్స్, మనస్తత్వాలు, సత్యాసత్యాలు ముప్పిరిగొంటాయి. ఈ దూరాన్వయాల క్లిష్టతల వల్లనే బహుశా రచయిత్రికి నవలని సంతృప్తికరంగా పూర్తి చేయడానికి ఐదేళ్ల సమయం పట్టింది. యు.కె.లో ఈ సంవత్సరం ప్రచురణ జరిగినప్పుడు నవల శీర్షిక అర్థవంతంగా మారడమే కాకుండా, నవల ప్రారంభంలోని ఎపిగ్రాఫ్‌ కూడా– ‘మందు పూయకుండా వదిలేస్తే కూతురికి అయిన గాయం రూపం మారుతుందా?’ బదులు, ‘అమ్మా! నన్ను నీకు పరిచయం చేసుకుంటూ, చేసుకుంటూ చాలా అలసిపోయాను’ అని మారి నవలావరణాన్ని పాఠకుడికి సిద్ధం చేస్తుంది. 
పుణేలో భర్త దిలీప్‌తో కలిసివుంటున్న అంతర ఒక చిత్రకారిణి. మామూలుగా సాగిపోతున్న జీవితంలో తల్లి అలై్జ్జమర్స్‌కి గురికావడంతో అంతర జీవితంలో కుదుపులు, గతకాలాల పునశ్చరణ ప్రారంభమౌతాయి. అది ఎనభైలలో పుణేలో మొదలైన కథ. పెళ్లైన సంవత్సరం తర్వాత కూతురు అంతరని కన్న తార, సంసారచట్రంలో ఇమడలేక, ఒక ధిక్కారంతో పుణేలోనే ఉన్న ఆశ్రమానికి (ఆశ్రమమేదో ప్రత్యేకించి చెప్పకపోయినా, ఊహించగలిగిందే) కూతురుతో సహా చేరుకుంటుంది. కూతురిని పట్టించుకోవడం మానేసి బాబాకి ‘సహచరి’గా తార ఉన్నన్ని రోజులూ అంతర బాల్యం జైల్లో గడిపినట్టు ఛిద్రమైపోతుంది. కొన్నేళ్లయ్యాక బాబా కొత్తసహచరితో కుదురుకోవడాన్ని సహించలేక, ఏడేళ్ల కూతురితో కలిసి బయటికి వస్తుంది. ఎలాంటి ఆధారమూ లేని జీవితాలకి చివరికి అడుక్కోవడమే శరణ్యమవుతుంది. వీళ్ల దీనస్థితి గురించి విన్న తార భర్త ఆమెని ఆమె తల్లి దగ్గరికి చేర్చి, విడాకులు తీసుకుంటాడు. రెజా అనే ఒక ఆర్టిస్ట్‌తో తార పరిచయం అతనితో సహజీవనంగా కొనసాగిన కొన్నేళ్లకి అతను చెప్పాపెట్టకుండా వెళ్లిపోతాడు. ఆర్ట్‌ కోర్సుకని బాంబే చేరుకున్న అంతర, కోర్సు నచ్చక కాలేజీలో చేరదుకానీ అక్కడే కాలం గడుపుతూంటుంది. అక్కడ హఠాత్తుగా ప్రత్యక్షం అయిన రెజాతో ఈసారి అంతర సహజీవనం ప్రారంభిస్తుంది. రెజా తన సహజ ధోరణిలో కొన్నాళ్లకి అదృశ్యమైపోతాడు. పుణేకి తిరిగొచ్చిన అంతర, చివరికి దిలీప్‌ని పెళ్లిచేసుకుంటుంది. తల్లి అనారోగ్యం నేపథ్యంలో తల్లితో తనకున్న పోలికలు, పోటీ, వైరుధ్యాలు, శత్రుత్వాలు, అసంతృప్తులు అన్నీ తెరమీదకొచ్చి సంక్లిష్ట చిత్రంగా నవల విస్తరిస్తుంది. తల్లి జ్ఞాపకశక్తిని కోల్పోవడం వాస్తవమైతే, తన జ్ఞాపకాలలో మాత్రం నిజాయితీ ఎంతుంది (ఖ్ఛ్చ జ్టీy జీటటౌఝ్ఛ్టజిజీnజ ్టజ్చ్టి జీటఛి్చౌu్టజిౌట్ఛఛీ) అన్నది ప్రశ్నార్థకమవుతుంది అంతరకి. ఇంతలో ఒక కూతుర్ని ప్రసవించిన అంతర, ప్రసవానంతర డిప్రెష¯Œ కి గురై, చిక్కుముళ్లని విడదీస్తూపోయే ప్రయత్నంలో మరిన్ని చిక్కుముళ్ల బారినపడ్డట్టవుతుంది. మానవ మనస్తత్వాల మేళవింపుగా సాగే పతాక సన్నివేశంలో నవల హఠాత్తుగా ఒక షార్ట్‌స్టోరీలా ముగిసిపోతుంది. తనని తాను unఖ్చీట్చ చేసుకోవాలనుకున్న అంతర ప్రయత్నం గాల్లో దీపమవుతుంది.  బహుశా unఅn్ట్చట్చ అయిన అనంతరమే అది సాధ్యపడుతుందేమో! 
నవలలో ప్రత్యేకంగా గమనించవలసిన అంశం– అపసవ్యమైన స్త్రీల జీవితాలకి మగవాళ్లే కారణం అనే రచనాత్మక సర్దుబాటు ధోరణికి రచయిత్రి పూనుకోకుండా, ఆయా స్త్రీలను అ¯Œ లైకబుల్‌ పాత్రలుగానే యథాతథంగా చిత్రించడం. స్త్రీల అవస్థలకి బాహ్యపరిస్థితులు కారణమైనట్టే, వారివారి ఆలోచనాపరిధుల పరిమితులూ కొంతవరకూ కారణాలవుతాయి. లైలా స్లిమానీ అనే రచయిత్రి చెప్పినట్టు – ‘‘మగవాళ్లకుండే లోపాలవంటివే ఆడవాళ్లకీ ఉంటాయని అందరూ అంగీకరిస్తేనే సమానత్వం సాధ్యమవుతుంది. ఆడవాళ్లు పువ్వులలాంటివారనీ,  మృదుహృదయులనీ చెప్పే తీపికబుర్లన్నీ వాళ్లకీ చీకటి కోణాలుండగలవన్న సత్యాన్ని గుర్తించడాన్ని విస్మరించడమే! అలాంటి ఉపేక్ష కూడా ఆధిపత్య ధోరణిలో భాగమే!’’ ఇది అర్థం చేసుకోగలిగితేనే అలాంటి అ¯Œ లైకబుల్‌ పాత్రల పట్ల ఆలోచనాత్మకమైన అవగాహన కలుగుతుంది; చదువుతున్నదానికంటే ఎక్కువ స్ఫురిస్తూ ఉంటుంది!
నవల: బర్ట్న్‌ శుగర్‌
రచన: ఆవ్నీ దోషీ
ప్రచురణ: ఫోర్త్‌ ఎస్టేట్‌ ఇండియా; 2019

-ఎ.వి.రమణమూర్తి 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top