ఉత్తమ పర్యాటక గ్రామంగా రాజస్థాన్‌ గ్రామం! అక్కడ మద్యం, మాంసం ముట్టరట! | Rajasthans Devmali Village Named Best Tourist Village In India | Sakshi
Sakshi News home page

ఉత్తమ పర్యాటక గ్రామంగా రాజస్థాన్‌ గ్రామం! అక్కడ మద్యం, మాంసం ముట్టరట!

Sep 24 2024 3:22 PM | Updated on Sep 24 2024 4:05 PM

Rajasthans Devmali Village Named Best Tourist Village In India

రాజస్థాన్‌లోని బీవర్‌ జిల్లాలోని దేవమాలి గ్రామం భారతదేశంలోని ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికయ్యింది. నవంబర్‌ 27న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డుని ప్రదానం చేయనుంది. భారతదేశంలోని రాష్ట్రాలలో ఎన్నో గొప్ప విశిష్టత గల గ్రామలున్నాయి. వాటన్నింటిని వెనక్కినెట్టి రాజస్థాన్‌లోని ఈ గ్రామమే ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎలా ఎంపికయ్యిందో వింటే ఆశ్చర్యపోతారు. ఈ గ్రామానికి ఉన్న స్పెషాలిటీ తెలిస్తే.. ఈ రోజుల్లో కూడా ఇలా నియబద్ధంగా ఎవరు ఉంటున్నారు అని ఆశ్చర్యపోతారు. 

రాజస్తాన్‌లోని బీవర్‌ జిల్లాలోని దేవమాలి గ్రామం పేరుకి తగ్గట్టుగానే చక్కటి జీవనశైలితో దేదీప్యమానంగా ఉంటుంది. అక్కడ ఉన్న ప్రజలెవ్వరూ కూడా మాంసం, చేపలు, మద్యం ముట్టరట. ఇలా అందరూ నియమబద్ధంగా ఉండటం అంత ఈజీ కాదు గదా..!. అలాగే అక్కడ వేప కలపను ఎవ్వరూ కాల్చడం వంటివి చేయరట. అంతేగాదు కిరోసిన్‌ ఉపయోగించడం కూడా నిషిద్ధం. ఆ గ్రామంలో దేవ్‌నారాయణ్‌ ఆలయం ప్రసిద్ధ ఆలయంగా పూజలందుకుంటోంది. ప్రతి ఏడాది లక్షలాదిమంది పర్యాటకులు సందర్శించడానికి వస్తుంటారట. మసుదా ఉపవిభాగంలోని ఆరావళి కొండల మధ్య ఉన్న ఈ గ్రామం సుమారు మూడు వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. 

ఇక్కడ సిమ్మెంట్‌, కలపతో చేసిన పక్కా ఇళ్లు కూడా ఉండవు. అన్ని మట్టితో చేసిన ఇళ్లే ఉంటాయి. అయితే కొండపై వెలసిన దేవనారాయణుని అందమైన ఆలయం ఈ గ్రామానికి ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. ఇక ఈ ఉత్తమ పర్యాటక గ్రామ పోటీని పర్యాట మంత్రిత్వ శాఖ నిర్వహించింది. పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తూ గొప్ప సంస్కృతిని కొనసాగిస్తున్న గ్రామాలను గుర్తించి మరీ ఆ గ్రామాన్ని ఎంపిక చేశారు.. ముఖ్యంగా సమతుల్య జీవన విధానం, పర్యావరణం వంటి అంశాలను ఆధారంగా చేసుకుని ఉత్తమ పర్యాట గ్రామలను ఎంపిక చేసినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. వాటన్నింటి ఆధారంగానే 'దేవమాలి గ్రామం' ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికయ్యిందని మంత్రిత్వ శాఖ జాయింట్ డైరెక్టర్ జనరల్ అరుణ్ శ్రీవాస్తవ తెలిపారు. 

ఈ వ్యాఖ్యలపై రాజస్థాన్‌ ఉపముఖ్యమంత్రి దియా కుమారి కూడా సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. "రాజస్థాన్ గర్వించదగ్గ ఘట్టం!. ఈ గ్రామం సుసంపన్నమైన సంస్కృతి, సంప్రదాయాలు, ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందింది." అని సోషల్‌ మీడియా ఎ‍క్స్‌లో పేర్కొన్నారు. అలాగే కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ దేవమాలి గ్రామాన్ని అత్యుత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేయడం అనేది రాజస్థాన్‌కి ఎంతో గర్వకారణం అన్నారు. 

(చదవండి: అసామాన్య వనిత 'అంబికా పిళ్లై'!..ఓ పక్క కేన్సర్‌తో పోరాటం మరోవైపు..!)
 

Advertisement
 
Advertisement
Advertisement