ఉపాధిహామీ పనుల వద్ద ఓ జంటకు ఉత్తుత్తి పెళ్లి నిర్వహించి కూలీలు సందడి చేశారు. ఈ ఆసక్తికర ఘటన మండలంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... మండలంలోని కొర్విపల్లి గ్రామంలో ఉపాధి పనుల వద్ద వధువు, వరుడికి గడ్డిపరకలతో చేసిన బాసింగం కట్టారు. కాళ్లకు నల్లనిమట్టినే పారాణిగా పెట్టారు. గడ్డిపరకతో తయారు చేసిన మంగళసూత్రం వధువు మెడలో వరుడు కట్టాడు. ఉపాధి పనులకు తీసుకువచ్చిన తట్టనే డప్పుగా చేసుకొని పెళ్లి సందడి చేశారు. ఈ సందర్భంగా యువతులు నృత్యాలు చేసి అలరించారు. ఇదంతా పనులు ముగిశాక రెండో ఫొటో క్యాప్చర్ కోసం వేచి చూసే సమయంలో ఉపాధి కూలీలకు వేదికగా నిలిచింది.
-చిన్నశంకరంపేట(మెదక్)


