హుషారు కోసమో, లేదా బేజారు తగ్గడం కోసమో శరీరానికి కాస్త వ్యాయామం అవసరమని సైకిలింగ్ చేసేవాళ్లను చూశాం. బ్యాటరీ సైకిళ్లు, స్కూటర్లు వచ్చాక పెడల్ మీద కాలు పెట్టేవారే కరువయ్యారు. కాని రాజస్థాన్లోని ఓ మహిళ తన అనితర సామర్థ్యంతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. జైపూర్కి చెందిన రేణు సింఘి వయసు అక్షరాల 60 ఏళ్లు. అయితేనేం? టీనేజర్లు కూడా షాక్ అయ్యేలా సైకిలింగ్ చేస్తూ ఛాలెంజ్ విసురుతోంది.
సైకిలింగ్ అంటే అదేదో ట్రాక్లోనో స్మూత్గా ఉన్న రోడ్డు మీదో కాదు. మిట్టపల్లాలు, కొండలు, గుట్టలు ఇలా ప్రదేశమేదైనా తగ్గేదేలే అంటూ సైకిల్ తొక్కేస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆమె సైకి లింగ్ మొదలుపెట్టింది 51 ఏళ్ల వయసులో..కాని ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఆమె 1.5 లక్షల కిలోమీటర్లు సైకిలింగ్ చేసింది. అలాగే ‘1200 కి.మీ పారిస్ బ్రెస్ట్ పారిస్’ సైకిల్ రైడ్ పూర్తి చేసిన తొలి భారతీయ మహిళ కూడా రేణునే.. ఇలా పలు రేసుల్లో పాల్గొంటూ తన తోటి వయసు వారికి ఆదర్శంగా నిలుస్తోంది.


