ఆద్యంతం.. ఆసక్తికరం ఈ ఆరు రోజుల టూర్‌..! | IRCTC Tourism: Madhya Pradesh Jyotirlinga Darshan (SHR 097) tour package | Sakshi
Sakshi News home page

ఆద్యంతం.. ఆసక్తికరం ఈ ఆరు రోజుల టూర్‌..! మధ్యప్రదేశ్‌ జ్యోతిర్లింగ్‌ దర్శనం నుంచి..

Jun 30 2025 10:01 AM | Updated on Jun 30 2025 10:01 AM

IRCTC Tourism: Madhya Pradesh Jyotirlinga Darshan (SHR 097) tour package

మధ్యప్రదేశ్‌ జ్యోతిర్లింగ దర్శనం. ప్రాచీన కోటల సందర్శనం. సాంచి బౌద్ధ స్థూపం వీక్షణం. ఇండోర్‌ లాల్‌బాగ్‌ ప్యాలెస్‌. ఉజ్జయిని మహాకాలేశ్వరుడు. భోపాల్‌ ఆదివాసీ ఆద్యకళల నిలయం. నర్మద తీరాన అహిల్యాబాయి కోట. ఇంకా... ఇంకా ఈ టూర్‌లో.

1వ రోజు
సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ (12707) సాయంత్రం నాలుగన్నరకు కాచిగూడ స్టేషన్‌లో బయలుదేరుతుంది. రాత్రంతా ప్రయాణం.

2వ రోజు
రైలు ఉదయం 08:15 గంటలకు భోపాల్‌ రైల్వే స్టేషన్‌కు చేరుతుంది. రైలు దిగి హోటల్‌ గదిలో చెక్‌ ఇన్, ఫ్రెష్‌ అప్‌ అయిన తర్వాత రోడ్డు మార్గాన సాంచి స్థూపానికి ప్రయాణం. ఆ తర్వాత భోజేశ్వర్‌ మహాదేవ్‌ ఆలయ దర్శనం చేసుకుని తిరిగి భోపాల్‌కు రావాలి. భోపాల్‌లోని ట్రైబల్‌ మ్యూజియం వీక్షణం. రాత్రికి హోటల్‌లో బస.

అశోకుడి పెళ్లి మండపం!
సాంచి స్థూపం బౌద్ధ క్షేత్రాల్లో ప్రధానమైనది. మన ప్రాచీన నిర్మాణ శాస్త్ర విజ్ఞానానికి ప్రతీక. యునెస్కో గుర్తించిన వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌ కూడా. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ నగరానికి 45 కిలోమీటర్ల దూరాన ఉంది. ఇది క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దం నాటి నిర్మాణం. ఈ చారిత్రక నిర్మాణం మౌర్య, బౌద్ధ వాస్తుశైలిల సమ్మేళనం. బుద్ధుని అవశిష్టాన్ని ప్రతిష్ఠించి నిర్మించారు. 

స్థూపానికి దక్షిణ ముఖ ద్వారానికి దగ్గరగా సాంచి ఆర్కియలాజికల్‌ మ్యూజియం ఉంది. ఇందులో నాలుగు సింహాల అశోకుని రాజముద్ర, ధర్మచక్రం ఉన్నాయి. అశోక చక్రవర్తి బౌద్ధాన్ని స్వీకరించిన తర్వాత చేసిన గొప్ప నిర్మాణాల్లో ఇది ముఖ్యమైనది. ఇది అశోకుని భార్య దేవి పుట్టిన ప్రదేశం, వారి వివాహం జరిగిన ప్రదేశం కూడా ఇక్కడికి పది కిలోమీటర్ల దూరానున్న విదిశ.. రెండు వందల రూపాయల కరెన్సీ నోట్‌ను వెనక్కి తిప్పి చూడండి. సాంచిలోని బౌద్ధస్థూపం కనిపిస్తుంది.

భోపాల్‌ మ్యూజియం – ఆదివాసీల ఆద్యకళ (ఆద్యకళా నిలయం)
మధ్యప్రదేశ్‌లో నివసించే ఆదివాసీలు, వారి జీవనశైలికి ఒక మీనియేచర్‌ రూపమే ఈ ట్రైబల్‌ మ్యూజియం. ఇందులో స్థానికంగా నివసించే గోంద్, భిల్, భారియా, సహారియా, కోర్కు, కోల్, భైగా ఆదివాసీ జాతుల రోజువారీ వస్తువులు, కళాకృతులు ఉన్నాయి. ఆదిలాబాద్‌లోని ఆదివాసీలు తయారు చేసే ఢోక్రా శైలి ఇత్తడి బొమ్మలు కూడా ఉన్నాయి. ఆదివాసీలు ధాన్యం నిల్వచేసుకోవడానికి అడవిలోని చెట్ల తీగలతో అల్లిన పెద్ద పెద్ద బుట్టలు ఉంటాయి.

భోజ్‌పూర్‌ ఈశ్వరుడు
భోజేశ్వర మందిరం... ఉన్న ప్రదేశం పేరు భోజ్‌పుర్‌. ఇది చిన్న గ్రామం. పారమార రాజు భోజుడు నిర్మించిన ఆలయం ఇది. అయితే ఇక్కడ ఆలయ నిర్మాణం పూర్తయినట్లు కనిపించదు. అర్ధంతరంగా ఆగి΄ోయిందా లేక నిర్మాణం విధ్వంసానికి గురైందా అనే సందేహం వస్తుంది. ఆలయ ప్రాంగణంలో అక్కడక్కడా శిల్పాల విడిభాగాలు కనిపిస్తాయి. 

ఆ విడిభాగాలు క్షతగాత్రాలు కాదు. ఒక పెద్ద శిల్పం ఆకారం ఉంటుంది, కానీ మెరుగులు లేక అసంపూర్తిగా కనిపిస్తుంది. బహుశా ఈ ఆలయ నిర్మాణాన్ని తలపెట్టిన తర్వాత అనుకోని కారణాలతో నిర్మాణం ఆగి΄ోయి ఉండవచ్చని చరిత్రకారుల అంచనా. ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా దీనిని నిశితంగా పరిశోధించి మాన్యుమెంట్‌ ఆఫ్‌ నేషనల్‌ ఇం΄ార్టెన్స్‌గా గుర్తించింది. ఏటా ఇక్కడ శివరాత్రి వేడుక అంబరాన్ని తాకుతుంది.

3వ రోజు
బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత గది చెక్‌ అవుట్, ఉజ్జయినికి ప్రయాణం. ఉజ్జయినిలో హోటల్‌ చెక్‌ ఇన్‌. మహాకాలేశ్వర్‌ ఆలయం, హర్‌సిద్ధి ఆలయం, మంగళ్‌నాథ్‌ ఆలయం, నవ్‌గ్రహ శని మందిర్, శ్రీచింతామన్‌ గణేశ్‌ టెంపుల్, రామ్‌ఘాట్, శ్రీగద్‌కాలిక టెంపుల్‌ దర్శనం, రాత్రికి ఉజ్జయినిలోనే బస.

క్షతగాత్ర ఉజ్జయిని
ప్రాచీనకాలం నుంచి ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం ఇది. పద్దెనిమిది శక్తిపీఠాల్లో ఉజ్జయిని ఒకటి. ద్వాదశ జ్యోతిర్లింగం కూడా. సతీదేవి దేహంలో పై పెదవి పడిన ప్రదేశం ఉజ్జయిని అని చెబుతారు. మహాకాలేశ్వరుడి ఆలయం కూడా ఇక్కడ ప్రసిద్ధి. గుజరాత్‌ లోని సోమనాథ్‌ ఆలయం లాగానే ఇది కూడా విధ్వంసాల బారిన పడిన ఆలయం. 

ఢిల్లీ పాలకుడు ఇల్టుట్‌మిష్‌ తన రాజ్యవిస్తరణలో భాగంగా ఉజ్జయిని మీద దండెత్తి విజయం సాధించిన సందర్భంగా ఇక్కడి ప్రాచీన ఆలయాన్ని ధ్వంసం చేశాడు. జ్యోతిర్లింగాన్ని ముక్కలు చేసి సమీపంలోని కోటితీర్థ కుండ్‌లో విసిరివేశాడని చెబుతారు. మరాఠా రాజోద్యోగి రామచంద్ర బాబా సుఖ్తాంకర్‌ పునర్నిర్మాణం చేశాడు. కానీ అది కూడా జలాలుద్దీన్, అలాఉద్దీన్‌ ఖిల్జీల దాడికి గురైంది.

ఈ శని క్షేత్రం త్రివేణీ సంగమం
నవగ్రహ శని మందిర్‌ ఉజ్జయినికి ఎనిమిది కిలోమీటర్ల దూరాన ఉంది. ఇక్కడ క్షిప్ర, గండకి, సరస్వతి నదులు కలుస్తాయి. ఈ ప్రదేశాన్ని త్రివేణీ ఉజ్జయిని అంటారు. సాధారణంగా శివాలయం లేదా ఇతర ఆలయాల్లో నవగ్రహాల వేదిక ఉంటుంది. ఇక్కడ నవగ్రహాల కోసమే ఓ ఆలయం ఉంది.

సీతమ్మ కొలిచిన గణేశుడు
ఈ ఆలయం ఉజ్జయినికి ఏడు కిలోమీటర్ల దూరాన ఫతేహాబాద్‌లో ఉంది. స్వయంభువుగా వెలిసిన ఈ గణేశుడిని కొలిస్తే మనసులోని చింతలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. రామాయణ కాలంలో సీతాదేవి ఈ ప్రదేశంలో కొంతకాలం నివసించిందని, ఆ సమయంలో ఈ గణేశుడిని ప్రార్థించినదని చెబుతారు. ఇక్కడి క్షిప్రానది తీరాన రామ్‌ఘాట్‌ కూడా ఉంది. 

4వ రోజు
బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత గది చెక్‌ అవుట్, మహేశ్వర్‌కు ప్రయాణం. అహిల్యాదేవి కోట, నర్మద ఘాట్‌ దర్శనం తర్వాత ఓంకారేశ్వర్‌కు ప్రయాణం. ఓంకారేశ్వర్‌లో హోటల్‌ లో చెక్‌ ఇన్‌ అయిన తర్వాత నడకదూరంలో ఉన్న ఆలయాలను దర్శించుకోవచ్చు. నదిలో పడవ ప్రయాణం చేయవచ్చు. రాత్రి బస ఓంకారేశ్వర్‌లో.

రాతికి పూచిన పూలు
రాణి అహిల్యాబాయి కోట మహేశ్వర్‌ పట్టణంలో ఉంది. దాంతో మహేశ్వర్‌ కోటగా వ్యవహారంలోకి వచ్చింది. ఇది మొత్తం గ్రానైట్‌ స్టోన్‌తో చేసిన మరాఠా శైలి నిర్మాణం. నర్మద నది తీరాన శత్రుదుర్భేద్యంగా నిర్మించడమే కాక అత్యంత సునిశితమైన నైపుణ్యంతో నగిషీలు చెక్కారు. కోటలోని ప్యాలెస్‌ల గోడలకు చెక్కిన పూలు అప్పుడే విచ్చుకున్నట్లున్న తాజా పూల తోరణాల్లా ఉంటాయి. రాతికి పూచిన ఈ పూలు నాటి శిల్పకారుల నైపుణ్యాన్ని నేటి తరానికి తెలియచేస్తున్న ప్రతిబింబాలు. ఈ కోట స్త్రీసాధికారతకు ప్రతీక. రాణి అహిల్యాబాయ్‌ హోల్కర్‌ క్రీ.శ 1765 నుంచి 1796 వరకు మాల్వా రాజ్యాన్ని పాలించారు. 

ఈ కోటలో ఉన్న రాణి ప్యాలెస్‌ను మ్యూజియంగా మార్చారు. అందులో ఆమె ఆహార్యం, జీవనశైలితోపాటు పాలన రీతి కూడా కళ్లకు కడుతుంది. ఆమె వారసుడు ప్రిన్స్‌ రిచర్డ్‌ హోల్కర్‌ ఈ కోటలోని అహిల్యాబాయి వాడాను హెరిటేజ్‌ హోటల్‌గా మార్చారు. మహేశ్వరలో నర్మదాతీరాన విహరిస్తూ అనేక ఆలయాలు, చారిత్రక నిర్మాణాలను దగ్గరగా వీక్షించవచ్చు. 

5వ రోజు
బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత గది చెక్‌ అవుట్, ప్రయాణం ఇందోర్‌ వైపు సాగుతుంది. ఇందోర్‌లో లాల్‌బాగ్‌ ప్యాలెస్, ఖజ్రన గణేశ్‌ మందిర్‌ దర్శనం తర్వాత రాత్రి ఎనిమిది గంటలకు ఇందోర్‌ రైల్వేస్టేషన్‌కు వచ్చి ట్రైన్‌ నంబర్‌ 19301 అంబేద్కర్‌ నగర్‌– యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కాలి. ఎనిమిది గంటలకు రైలు బయలుదేరుతుంది. రాత్రంతా ప్రయాణం.

లాల్‌బాగ్‌ గులాబీల తోట
ఇందోర్‌లోని లాల్‌బాగ్‌ ప్యాలెస్‌ కూడా హోల్కర్‌ రాజవంశ నిర్మాణమే. యాభై ఏళ్ల కిందటి వరకు ఆ రాజవంశమే ఇందులో నివసించింది. ప్రభుత్వ నిర్వహణలో ఉంది. ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా దీనిని మ్యూజియంగా మార్చింది. ఈ ప్యాలెస్‌లోకి వెళ్లే ముందు మెయిన్‌ గేట్‌ నిశితంగా పరిశీలించాలి. యూరోపియన్‌ శైలిలో బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ను తలపిస్తుంది. ఇక భవనంలోపలి గదులు కూడా ప్రాచ్య ప్రాచాత్య కలబోతగా ఉంటాయి. 

76 ఎకరాల్లో విస్తరించిన ప్యాలెస్‌ ప్రాంగణమంతటినీ చూడడం కష్టమే. కానీ ఇరవై ఎకరాల రోజ్‌ గార్డెన్‌ను మిస్‌ కాకూడదు. అహిల్యాబాయి వాడాను ఆమె వారసుడు హోటల్‌గా మార్చాడని చెప్పుకున్నప్పుడు అతడి పేరు ప్రిన్స్‌ రిచర్డ్‌  హోల్కర్‌ అని చెప్పుకున్నాం. అప్పుడు కలిగిన సందేహానికి సమాధానం ఈ ప్యాలెస్‌లో లభిస్తుంది.  హోల్కర్‌ రాజవంశానికి చెందిన తుకోజీరావ్‌ హోల్కర్‌ మూడవ భార్య అమెరికన్‌. పేరు నాన్సీ అన్నే మిల్లర్‌. తుకోజీ మరణం తర్వాత ఆమె అమెరికాకి వెళ్లిపోయారు. 

మధ్యప్రదేశ్‌ జ్యోతిర్లింగ్‌ దర్శన్‌ (ఎస్‌హెచ్‌ఆర్‌ 097). ఇది ఆరు రోజుల యాత్ర. 

భోపాల్, ఉజ్జయిని, ఓంకారేశ్వర్, ఇందోర్‌ ప్రదేశాలను సందర్శించవచ్చు. 

హైదరాబాద్, కాచిగూడ స్టేషన్‌ నుంచి ట్రైన్‌ నంబరు 12707, సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ బుధవారం సాయంత్రం నాలుగన్నరకు బయలుదేరుతుంది. ఇది వీక్లీ టూర్‌. 

కంఫర్ట్‌ (థర్డ్‌ ఏసీ)లో సింగిల్‌ షేరింగ్‌కి 36 వేలకు పైగా అవుతుంది. ట్విన్‌ షేరింగ్‌లో ఒక్కొక్కరికి 20వేలు దాటుతుంది. ట్రిపుల్‌ షేరింగ్‌లో ఒక్కొక్కరికి దాదాపుగా 16 వేలవుతుంది. నలుగురు నుంచి ఆరుగురు వరకు బృందంగా ప్రయాణం చేస్తే మరికొంత తగ్గుతుంది.

స్టాండర్డ్‌ (స్లీపర్‌) కేటగిరీలో సింగిల్‌ షేరింగ్‌ సుమారు 34 వేలు, ట్విన్‌ షేరింగ్‌లో ఒక్కొక్కరికి సుమారు 18 వేలవుతుంది. ట్రిపుల్‌ షేరింగ్‌లో ఒక్కొక్కరికి సుమారు 14 వేలవుతుంది.

టూర్‌ కోడ్‌:
https://www.irctctourism.com/pacakage_descriptionpackageCode=SHR097

(చదవండి: పర్యాటకుల తాకిడితో ఉక్కిరిబిక్కిరి అయ్యే టాప్‌ 10 ప్రదేశాలివే..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement