మధ్యప్రదేశ్లో జబల్పూర్లో ఘోర పడవప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంలో మృతుల సంఖ్య 11కు చేరుకుంది. అయితే ఆ ఘటనకు బాధ్యులైన వారిని ప్రభుత్వం సస్పెండ్ చేయడంతో పాటు పరిహారం సైతం ప్రకటించింది. కాగా ఈ ఘటనలో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న వారు వారి అనుభవాలను మీడియాతో పంచుకున్నారు.
రోషన్ ఆనంద్ వర్మ (బాధితుడు)
"పడవ బలమైన అలలకు చిక్కుకోవడంతో అరగంట పాటు తీవ్ర గందరగోళం నెలకొంది. కుర్చీలు, బల్లలు, ప్రజలు ఒకరిపై ఒకరు పడిపోయారు మహిళలు, పిల్లలు భయంతో వణికిపోయారు. క్రూయిజ్లోకి నీరు రావడం మొదలైంది. దానిలోని ఒక భాగం అప్పటికే విరిగిపోయింది. మృత్యువు మా కళ్లెదుటే ఉంది, కానీ మేము ఆశ వదులుకోలేదు. 11 ఏళ్ల చిన్నారితో కలిసి ఒడ్డు వైపు కదిలాం. ఎలాగోలా మాకు మద్దతు లభించి, సురక్షితంగా పైకి ఎక్కగలిగాం," అని ఆయన అన్నారు.
మా కుటుంబ మంతా వెంటనే అప్రమత్తమై లైఫ్ జాకెట్లు ధరించడం వల్లే ప్రాణాలతో బయటపడగలిగామని భావోద్వేగానికి గురయ్యారు. వాతావరణ హెచ్చరికలు ఉన్నప్పటికీ క్రూయిజ్ను నిర్వహించారని ఆయన ఇంకా ఆరోపించారు. "ఇది స్పష్టమైన నిర్లక్ష్యం. ప్రయాణికుల భద్రత కంటే లాభానికే ప్రాధాన్యత ఇచ్చారు," అని వర్మ అన్నారు.
అత్యవసర పరిస్థితి సమయంలో యాజమాన్యం, క్రూయిజ్ సిబ్బంది ఇద్దరూ విఫలమయ్యారని వర్మ ఆరోపించారు. "సిబ్బంది నుంచి సరైన సూచనలు అందలేదు, అలాగే సకాలంలో సహాయం కూడా అందించలేదు. ఒకవేళ రెస్క్యూ బోట్ వెంటనే వచ్చి ఉంటే, ప్రతి ప్రయాణీకుడినీ కాపాడి ఉండేవారు," అని ఆయన పేర్కొన్నారు.
సవితా వర్మ అనే మరో బాధితురాలు మాట్లాడుతూ 16 ఏళ్ల తర్వాత ఇజ్రాయెల్ నుంచి తిరిగి వచ్చి, తన మేనకోడలు పుట్టినరోజు వేడుకల కోసం కుటుంబంతో కలిసి జబల్పూర్ వచ్చానని ఆసుపత్రిలో సహాయం అందించేవారు ఎవరూ లేకపోగా, కనీస వైద్యం అందకుండానే రూ.4,700 బిల్లు వసూలు చేశారని ఆమె ఆరోపించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య 11కు చేరుకోగా ఇప్పటి వరకూ రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి.


