
ఇది ఒక ప్రార్థన మందిరంలోని పవిత్రమైన బావి. శతాబ్దాలుగా వేలాది మంది భక్తులు ఇథియోపియాలోని ‘బెర్మెల్ జార్జిస్’ అనే ఈ బావిలోని నీటిని తాగితే ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని నమ్ముతున్నారు. కాని, ఇప్పుడు ఉన్న రోగాలు నయం కాకపోగా, కొత్త రోగాలను తెప్పిస్తోంది ఈ పవిత్ర జలం. తాజాగా శాస్త్రవేత్తలు ఈ పవిత్ర జలం కారణంగానే యూరప్లో కలరా వ్యాధి వ్యాపిస్తోందని గుర్తించారు.
యూరప్ దేశాల నుంచి కొందరు భక్తులు ఇటీవలే ఇథియోపియాకు ప్రయాణించి, ఈ బావిలోని నీటితో చేతులు, ముఖం కడుక్కుని, అదే నీటిని తాగారట! యూరప్లో వ్యాపించిన కలరా కేసులను పరీక్షించిన వైద్య పరిశోధకులకు బాధితులే ఈ సంగతి చెప్పారు. ఆ నీటిని పరీక్షించగా, అందులో విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా ఎక్కువగా ఉండటంతో నీరు తీవ్రంగా కలుషితమైందని తేలింది.
ఈ కారణంగానే బాధితులందరికీ వాంతులు, విరోచనాలు అయ్యాయి. అదృష్టం కొద్దీ స్థానిక ప్రభుత్వాలు ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టి, అదుపులోకి తెచ్చాయి. ఇకపై ఎవరైనా ఆ పవిత్ర స్థలంలోని నీటిని ఉపయోగించే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
(చదవండి: మీరు ఇంట్రావర్టా..? ఎక్స్ట్రావర్టా..? చిటికెలో చెప్పే ట్రిక్ ఇదిగో..)