
ప్రముఖ పాన్ ఇండియా సింగర్ అమేయ డబ్లి తన స్వర మాధుర్యంతో నగరంలో సందడి చేయనున్నారు. గత 14 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా 4 వేలకు పైగా సంగీత కచేరీలు, ప్రదర్శనలు చేసిన అమేయ డబ్లి ఈ నెల 28న నగరంలోని శిల్పకళావేదికగా లైవ్ కాన్సర్ట్తో సంగీత ప్రియులను అలరించనున్నారు. ఏకమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘పాన్ ఇండియా కృష్ణా టూర్’లో భాగంగా హైదరాబాద్తో పాటు భారత్లోని 11 నగరాల్లో ఈ కాన్సర్ట్ నిర్వహించనున్నారు. ఈ మ్యూజికల్ టూర్ కృష్ణునిపై మాత్రమే సంగీత విభావరి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఇటీవల సన్నాహక కార్యక్రమానికి హాజరైన నేపథ్యంలో ‘సాక్షి’తో ముచ్చటించారు.. ఆ విశేషాలు..
టాలీవుడ్ స్టార్ రాణా దగ్గుబాటి, మిహీకా బజాజ్ పెళ్లి మొదలు కపూర్ ఖండన్, రాణీ ముఖర్జీ, ఆదిత్య చోప్రా, జిందాల్ కుటుంబం, ఇమామి గ్రూప్లోని అగర్వాల్ కుటుంబం, ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్ వంటి లగ్జరీ వేడుకల్లో పాడిన డబ్లి మొదటి సారి నగరంలో సంగీత ప్రదర్శన చేపట్టడం విశేషం.
ఏకమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో..
సంగీతం ఒక సాంత్వన, పాటలు ఒక సంతృప్తి..!! నా ప్రయాణంలో ప్రపంచవ్యాప్తంగా 4 వేలకు పైగా ప్రదర్శనలిచ్చాను. ఈ సారి వినూత్నంగా కృష్ణుని ఇతివృత్తంతో ఈ పాన్ ఇండియా టూర్ చేయడం సంతోషంగా ఉంది.
ముఖ్యంగా నా సామాజిక బాధ్యతగా నా సంపాదనలో 25 నుంచి 50 శాతం వరకూ సేవా కార్యక్రమాలకు వినియోగిస్తుంటాను. ఇందులో భాగంగానే ఏకమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ మ్యూజికల్ టూర్ను జైపూర్, జోద్పూర్, సూరత్, ముంబై, పుణె, బెంగళూరు, అహ్మదాబాద్, కోల్కతా నగరాల్లో ప్రదర్శిస్తున్నాను.
ప్రదర్శనలో 25 శాతం వారికే..
దేశం కోసం నిరంతరం పోరాడుతున్న ఆర్మీ కోసం ప్రత్యేకంగా సంగీత ప్రదర్శనలిచ్చాను. అంతేకాకుండా నా ప్రతి ప్రదర్శనలో 25 శాతం సీట్లు ఆర్మీ వారి కోసం ఉచితంగా కేటాయిస్తాను.. ఈ ఆనవాయితి నగరంలోని ప్రదర్శనలో కూడా కొనసాగుతోంది. ఈ ప్రదర్శన కోసం మొదటిసారి తెలుగు పాటను కూడా పాడబోతున్నా.
అనాది నుంచి హైదరాబాద్కు సంగీతానికీ విడదీయరాని అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడి సంగీత ప్రియుల గురించి దేశవ్యాప్తంగా తెలుసు. 16 మంది ప్రముఖ సంగీత విద్వాంసులు, ఐదుగురు ప్రముఖ సింగర్లు.. మొత్తం నాతో పాటు 25 మంది భారీ బృందంతో ఈ ప్రతిష్టాత్మక కచేరీ హైదరాబాద్ నగరాన్ని సంగీత సాగరంలో ముంచెత్తనుంది.
– సింగర్ అమేయ డబ్లి