ఏలూరు (ఆర్ఆర్పేట): జాతీయ బ్యాంకుల్లో పనిచేస్తున్న అధికారులకు, ఉద్యోగులకు, సిబ్బందికి వారానికి ఐదు రోజులు పని దినాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ, అలాగే ద్వైపాక్షికంగా ఒప్పుకున్న పీఎల్ఏ విధానాన్ని, ఏకపక్షంగా అమలు చేస్తున్న విధానాన్ని నిరసిస్తూ ఏలూరులో బ్యాంకు ఉద్యోగులు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేసి ఆర్ఆర్పేట యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్ నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యూఎఫ్బీయూ కన్వీనర్ కాళే శ్రీనివాసరావు మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని దినాలను కల్పిస్తామని జాతీయ బ్యాంక్ల యూనియన్కి హామీ ఇచ్చి చాలా కాలం అయినా అమలులో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. బ్యాంకు ఉద్యోగులకు పనిభారం పెరిగిందనర్నారు. అలాగే పనితీరు ఆధారిత ప్రోత్సాహకం అన్ని క్యాడర్లకూ సమానంగా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఎస్బీఐ ఏలూరు రీజనల్ సెక్రటరీ విమల్, యూనియన్ బ్యాంక్ ఏఐబీఓసీ నాయకుడు శ్రీరంగం శ్రీనివాసరావు, ఎస్బీఐ ఆఫీసర్స్ నాయకుడు వెంకటేశ్వరరావు, బ్యాంక్ ఆఫ్ బరోడా యూనియన్ నాయకుడు ఎస్.శ్రీనివాసరావు, ఇండియన్ బ్యాంక్ జాయింట్ జనరల్ సెక్రటరీ ఎంఆర్కే రెడ్డి, డీసీసీబీ బ్యాంక్ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. వీరికి ఏఐటీయూసీ, సీఐటీయూ నాయకులు రెడ్డి శ్రీనివాస్, డీఎన్వీడీ ప్రసాద్ తదితరులు మద్దతు పలికారు.


