ముదినేపల్లి రూరల్: ప్రసిద్ధి చెందిన సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్లోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారి పుట్టలో పాలు పోసి, ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. పాలపొంగళ్ల శాల వద్ద మహిళలు నైవేద్యాలు తయారుచేసి స్వామివారికి సమర్పించారు. నాగబంధాల వద్ద స్వామివారి మూర్తులను ప్రతిష్ఠించేందుకు అర్చకులతో పూజలు చేయించి, ప్రతిష్ఠాపన తంతును శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం నాగబంధాల వద్ద, గోశాలలోని గోవులకు మహిళలు పసుపు–కుంకుమలతో పూజలు చేశారు. భక్తుల రద్దీకి తగినట్లుగా అన్నప్రసాద ఏర్పాట్లు చేపట్టారు. ఆలయ సహాయ కమిషనర్ ఆర్.గంగాశ్రీదేవి, చైర్మన్ బొంగు రవికుమార్ ఏర్పాట్లు పర్యవేక్షంచారు.


