మద్దిలపాలెం (విశాఖ): విద్యార్థుల ఉన్నత విద్యకు ఆర్థిక సహాయం అందిస్తూ వారిని ప్రోత్సహించే లక్ష్యంతో పద్మ పూజిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెరిటోరియస్ స్కాలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్–2026ను ఆదివారం మద్దిలపాలెంలోని శంకర ప్యాలెస్లో నిర్వహించారు. ఈ ఏడాది మొత్తం 107 దరఖాస్తులు అందగా.. పరిశీలన అనంతరం 77 మంది విద్యార్థులను స్కాలర్షిప్లకు ఎంపిక చేసి మొత్తం రూ.12.20 లక్షలు పంపిణీ చేశారు. 9, 10వ తరగతి చదువుతున్న 29 మందికి రూ.2.90 లక్షలు, డిగ్రీ, డిప్లొమా, ఫార్మసీ చదువుతున్న 10 మందికి రూ.1.50 లక్షలు, ఇంటర్, బీటెక్ చదువుతున్న 38 మందికి రూ.7.80 లక్షల మెరిట్ స్కాలర్షిప్లు, ధ్రువీకరణ పత్రాలను ఫౌండేషన్ చైర్మన్ ఆర్వీఎస్వీ బసవరాజు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో ప్రతిభావంతులైన విద్యార్థులకు సహకారం అందిస్తున్నామని తెలిపారు. కృష్ణంరాజు మాట్లాడుతూ విద్యతో ఉజ్వల భవిష్యత్తు సాధ్యమన్నారు. పడాల ప్రసాద్ విద్యార్థులకు ప్రేరణాత్మక సూచనలు చేశారు. సానుకూల దృక్పథంతో విద్యను అభ్యసించాలని పోతినేని నిర్మల సూచించారు.
ఉండి: ఎన్నార్పీ అగ్రహారంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్సై హెచ్.మల్లిఖార్జునరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఆకివీడు మండలం దొడ్డనపూడికి చెందిన ఓ కారు ఉండి వైపు నుంచి భీమవరం వైపు వెళ్తోంది. అదే సమయంలో భీమవరం నుంచి ఉండి వైపు వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఆ కారు ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే క్షతగాత్రులను భీమవరం ఆసుపత్రికి తరలించారు. బాధితుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని ఎస్సై తెలిపారు. ప్రమాదంపై సమాచారం అందిందని, బాధితులు కోలుకున్నాక లేదా ఆసుపత్రి నుంచి పూర్తి సమాచారం అందిన వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని ఎస్సై పేర్కొన్నారు.


