గంగవరం: రాజ్యాంగం కల్పించిన హక్కులు, అవకాశాలను పొందడంలో తాము తీవ్ర అన్యాయానికి గురవుతున్నామని ఆదివాసీ గౌడ సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం గంగవరంలో ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల ఆదివాసీ గౌడ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆదివాసీ గౌడ సంఘ అధ్యక్షుడు మట్ట రామ్మూర్తి, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు కొప్పుల నాగరాజు, పోలవరం ఏజెన్సీ ఏరియా అధ్యక్షుడు నాయుడు సత్యనారాయణ ఈ సమావేశంలో మాట్లాడారు. తరతరాలుగా మన్యంలో జీవనం సాగిస్తున్న ఆదివాసీ గౌడలకు రాజ్యాంగం కల్పించిన విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పూర్తిస్థాయిలో అందడం లేదని వారు వాపోయారు. ఐక్యతతోనే తమ హక్కులను సాధించుకోగలమని పిలుపునిచ్చారు. త్వరలో ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీ గౌడలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని వారు తెలిపారు.


