పెదవేగి: వీకింగ్స్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘‘డీ పాల్ ఏపీ ఓపెన్ రాపిడ్ చెస్ టోర్నమెంట్–2026’’ విజయవంతంగా ముగిసింది. ఏలూరు జిల్లా దుగ్గిరాలలోని డీ పాల్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించిన ఈ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి మొత్తం 320 మంది చెస్ క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. టోర్నమెంట్ డైరెక్టర్ ఎస్. శ్యామల మాట్లాడుతూ... ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోటీలను సజావుగా నిర్వహించినట్లు తెలిపారు. ఉదయం 9:45 గంటలకు ప్రారంభమైన పోటీలు సాయంత్రం 6 గంటల వరకు కొనసాగాయి. మొత్తం 7 రౌండ్లుగా జరిగిన పోటీల్లో క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచారని చీఫ్ ఆర్బిటర్ పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డీ పాల్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఫాదర్ నెల్సన్, వైస్ ప్రిన్సిపాల్ అజిత్, ఫాదర్ టోనీ తదితరులు విజేతలకు ట్రోఫీలు, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో చెస్ డెవలప్మెంట్ అండ్ ప్లేయర్స్ అసోసియేషన్ ఆఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు శ్రీ కిరణ్ కుమార్ పాలూరి, కార్యదర్శి శ్రీ కె.ఎస్. నాగేశ్వరరావు, అసోసియేషన్ సభ్యులు సీహెచ్ పద్మ, సురేఖ, సీహెచ్ పాల్ విక్టర్ తదితరులు పాల్గొని టోర్నమెంట్ విజయవంతానికి సహకరించారు.
టాప్–3 విజేతలు
ప్రథమ స్థానం: రామ్చరణ్ తేజ (7 పాయింట్లు), తూర్పు గోదావరి జిల్లా
ద్వితీయ స్థానం: రావు జె. మల్లేశ్వర (6.5 పాయింట్లు), ఎన్టీఆర్ జిల్లా
తృతీయ స్థానం: జి. అనూష ఎన్ఎల్వీ (6.5 పాయింట్లు), ఎన్టీఆర్ జిల్లా


